బాలానగర్, జనవరి 30 : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)గత ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కార్గో అండ్ పార్శిల్, కొరియర్ సర్వీసుల ద్వారా ఆర్టీసీకి కాసుల పంట కురుస్తున్నది. కార్గో సర్వీసులకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. ఎక్కడైనా సరే బుక్ చేసిన పార్శిల్ను రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా చేరవేసే బాధ్యతను ఆర్టీసీ తీసుకున్నది. ప్రైవేటు రంగంలో వస్తు రవాణా ఖర్చు ఎక్కువ ఉండడంతోపాటు వస్తువులు సకాలంలో వచ్చే అవకాశాలు లేకపోవడంతో ఆర్టీసీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే గత ఏడాది సంస్థ కార్గో, పార్శిల్, కొరియర్ సర్వీసులను ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే కూకట్పల్లి డిపోలో రోజుకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ఆదాయం సమకూరేదని, నెలకు 7-8 లక్షల ఆదాయం వచ్చేదని డిపో అధికారులు తెలిపారు. ఈ ఏడాది కూకట్పల్లి డిపోలో రోజుకు రూ.50వేల నుంచి 60వేల వరకు ఆదాయం రాగా, నెలకు 15 నుంచి 18 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు డిపో వర్గాలు తెలిపాయి.
కార్గో సర్వీసులు ..
3 టన్నుల బరువు నుంచి 8 టన్నుల బరువున్న వస్తువులను కార్గో సర్వీసుల ద్వారా పంపించవచ్చు. 3 నుంచి 4 టన్నుల బరువున్న కార్గోలను చిన్న కార్గోల ద్వారా పంపిస్తారు. అంతకంటే ఎక్కువ బరువున్న వస్తువులను పెద్ద కార్గోల ద్వారా పంపిస్తారు. కార్గోలో బుక్ చేసుకున్న వస్తువులను డైరెక్టుగా గమ్యస్థానానికి చేరుస్తారు.
ఎలా పంపాలి..
ఉదాహరణకు కేపీహెచ్బీకాలనీలో నివాసముండే ఒక వ్యక్తి కరీంనగర్కు ఒక వస్తువును పార్శిల్ ద్వారా పంపాలనుకున్నప్పుడు సదరు వ్యక్తి తన వస్తువును కేపీహెచ్కాలనీలోని ఆర్టీసీ సెంటర్ వద్ద బుక్ చేయాలి. అనంతరం సదరు వస్తువును ఆర్టీసీ సిబ్బంది ప్రశాంత్నగర్లో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణానికి పంపిస్తారు. అక్కడి నుంచి జేబీఎస్, సీబీఎస్లకు సదరు పార్శిల్ను పంపిస్తారు. అక్కడి నుంచి ఆయా పార్శిళ్లను ఎలాంటి జాప్యం లేకుండా అదేరోజు గమ్యస్థానాలకు చేరుకుంటుంది.
కార్గో సర్వీసులతో ఆర్టీసీకి లాభాలు..
టీఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో అండ్ పార్శిల్, కొరియర్ సర్వీసులకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తున్నది. రోజుకు రూ. 50 వేల నుంచి 60 వేల వరకు.. నెలకు రూ.15 నుంచి రూ.18లక్షల వరకు ఆదాయం వస్తుంది. కార్గో అండ్ పార్శిల్, కొరియర్ సర్వీసుల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తద్వారా ఆర్టీసీని నష్టాల ఊబిలో నుంచి గట్టెక్కించడానికి దోహదపడుతున్నది. వినియోగదారులకు విశేష సేవలు అందిస్తూ సంస్థను మరింత వృద్ధిలోకి తేచ్చేందుకు తమ వంతు కృషి చేస్తాం.