సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఎయిర్పోర్టులో ఉద్యోగాలంటూ అమాయకులకు ఫోన్లు చేయిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఒక కాల్సెంటర్ నిర్వాహకుడిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నగర జాయింట్ సీపీ(క్రైమ్స్) ఏవీ రంగనాథ్ కథనం ప్రకారం.. ఉద్యోగాల కోసం జాబ్ పోర్టల్స్లో తమ బయోడేటాలను అప్లోడ్ చేసేవారి డేటాను ఆ పోర్టల్ నుంచి కొనుగోలు చేసి.. అందులో ఉన్న ఫోన్ నంబర్లు, ఇతర వివరాలతో బాధితులకు ఫోన్ చేయిస్తున్నాడు. ఉత్తర్ప్రదేశ్, నోయిడాకు చెందిన విజయ్కాంత్ నోయిడాలో ఒక కాల్సెంటర్ను నిర్వహిస్తున్నాడు. ఆయా జాబ్ పోర్టల్స్ నుంచి కొనుగోలు చేసిన డేటాను టెలీకాలర్స్కు అందిస్తాడు. ఎయిర్పోర్టులో ఉద్యోగాలు ఉన్నాయంటూ ఫోన్చేసి నమ్మిస్తుంటారు. ఉద్యోగమనగానే అమాయకులు గంతేసి నేరగాళ్లు చెప్పినట్టు వింటున్నారు. రిజిస్ట్రేషన్, హెల్త్ చెక్అప్, డిపాజిట్స్.. పేరుతో నేరగాళ్లు అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత నేరగాళ్లు నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు పంపించి మోసం చేస్తున్నారు.
రూ. 2.20 లక్షలు స్వాహా
నాంపల్లికి చెందిన బాధితుడికి ఫోన్ చేసిన నేరగాళ్లు.. ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మాట్లాడుతున్నట్టు చెప్పారు. మీరు ఉద్యోగానికి ఎంపికయ్యారంటూ.. రిజిస్ట్రేషన్ ఫీ, సాలరీ అకౌంట్ ఓపెనింగ్ ఫీ, యూనిఫామ్ ఫీ, ఆఫర్ లెటర్ ఫీ.. అంటూ బాధితుడి నుంచి రూ. 2.20 లక్షలు వసూలు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
నోయిడాలో అరెస్టు..
నిందితులు నోయిడాలోని ఓ కాల్ సెంటర్ నుంచి ఫోన్ చేస్తునట్లు గుర్తించారు. ఇన్స్పెక్టర్ మధుసూదన్రావు నేతృతంలోని బృందం అక్కడికి వెళ్లి కాల్సెంటర్పై దాడి చేసింది. నిర్వాహకుడు విజయ్కాంత్ను అరెస్ట్ చేసి నగరానికి తరలించారు. నిందితుడి వద్ద నుంచి ల్యాప్టాప్లు, 23 మొబైల్స్, చెక్బుక్స్, బ్యాంక్ కార్డులు, 80 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.