చార్మినార్, జనవరి 12 : అమాయకుల నమ్మకమే ఆదాయంగా మార్చుకున్నాడు. తన శక్తులతో అన్నీ అనుకూలంగా మారుస్తాను.. అంటూ జ్యోతిష్యం పేరుతో అమాయకులను మోసం చేస్తున్న ఓ మాయగాడిని దక్షిణ తూర్పు, ఛత్రినాక పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ మండల డీసీపీ సాయి చైతన్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన సిరిగిరి మంజునాథ అలియాస్ బ్రహ్మ, అలియాస్ అర్జున్రాజు అలియాస్ మంజు (39) వేర్వేరు పేర్లతో చలామణి అవుతున్నాడు. కరీమాబాద్లో ప్రత్యేకంగా దుర్గా, సమ్మక్క సారలమ్మ జ్యోతిష్యాలయం పేర్లతో స్థానికంగా వ్యాపారం ప్రారంభించాడు. తనను సంప్రదిస్తే జ్యోతిష్యం ద్వారా బాధలను గుర్తించి.. ఎలాంటి సమస్యనైనా నయం చేస్తానంటూ లోకల్ టీవీ చానళ్లలో ప్రకటనలిచ్చాడు. టీవీలో వచ్చిన అతడి ప్రకటన చూసిన హైదరాబాద్ పాతబస్తీకి చెందిన శ్రీకాంత్ రెడ్డి సంప్రదించాడు. శ్రీకాంత్రెడ్డి తల్లి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నది. కొన్ని కష్టాలు కూడా ఉన్నాయి. దీంతో శ్రీకాంత్రెడ్డి నవంబర్ ఒకటవ తేదీన వరంగల్ జిల్లాలోని కరీమాబాద్కు వెళ్లి మంజునాథను కలిసి, సమస్యను చెప్పాడు. హైదరాబాద్లో ఉన్న ఇంటిని చూస్తే గాని సమస్య అర్థం కాదంటూ మంజునాథ చెప్పడంతో భయపడి.. నవంబర్ నాలుగో తేదీన ఇంటికి ఆహ్వానించారు. శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వచ్చిన మంజునాథ.. ఇల్లు మొత్తం కలియతిరిగాడు.
ఇంటికి నరదిష్టి ఉన్నదని చెప్పాడు. నరదిష్టి ఉండటంతో కీడు జరుగుతోందని, శాంతి పూజలు చేస్తే అంతా మంచే జరుగుతుందని చెప్పి.. రెండు లక్షలు తీసుకున్నాడు. శాంతి పూజలు చేయకుంటే మీ తల్లి ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని శ్రీకాంత్తో చెప్పాడు. ఆందోళన చెందిన శ్రీకాంత్.. జ్యోతిష్యుడు మంజునాథ్ అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చాడు. ఇప్పటి వరకు పలుమార్లు రూ. 17 లక్షలు ఇచ్చాడు. రకరకాల పూజలు చేశాడు. అయినా.. కష్టాలు తీరలేదు. శ్రీకాంత్రెడ్డి తల్లి ఆరోగ్యం కూడా నయం కాలేదు. దీంతో బాధితులు ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జ్యోతిష్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్న మంజునాథను దక్షిణ- తూర్పు టాస్క్ఫోర్స్, ఛత్రినాక పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ. 14.65 లక్షలు స్వాధీనం చేసుకొని, రిమాండ్కు తరలించారు. ఈ సమావేశంలో టాస్క్ఫోర్స్ డీసీపీ నర్సింహారావు, అదనపు డీసీపీ జహంగీర్, ఏసీపీ రమేశ్, ఇన్స్పెక్టర్లు సైద బాబు, భోజ్య తదితరులు పాల్గొన్నారు.