శంషాబాద్ రూరల్/ మియాపూర్, ఏప్రిల్ 2 : రాజేంద్రనగర్ నియోజకవర్గం పిల్లోనిగూడ వద్ద రైల్వే లైన్ తెరిపించాలని, జూకల్ వద్ద అండర్ పాస్ నిర్మించాలని, శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని లింగంపల్లి రైల్వే బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, ప్రకాశ్గౌడ్ మంగళవారం రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ను కోరారు. సికింద్రాబాద్లోని రైల్వే నిలయంలో జీఎంను కలిసి వినతి పత్రం అందజేశారు. శంషాబాద్ మండలంలోని పిల్లోనిగూడ గ్రామం వద్ద ఉన్న రైల్వే లైన్ ముసివేయడంతో పిల్లోనిగూడ గ్రామ ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, జూకల్ గ్రామం వద్ద రెండు చోట్ల అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మించాలని కోరారు.
అదేవిధంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షాకాలంలో నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నదని, పాత వంతెన స్థానంలో అధునాతన రైల్వే బ్రిడ్జిని నిర్మించాలని, ఆదిత్యనగర్ బాక్సు డ్రైన్ నిర్మాణం, నాలా విస్తరణ, మాదాపూర్ హఫీజ్పేట్ పరిసరాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి అనుమతి, శిల్పాగార్డెన్ అండర్ పాస్ నుంచి మంజీరా పైప్లైన్ రోడ్డులోని వైశాలీనగర్ వరకు వర్షపు నీటి కాలువ నిర్మాణం, లింగంపల్లి చందానగర్ స్టేషన్ల మధ్య ఆర్యూబీ వద్ద నాలా వెడల్పు, రెండు వైపులా సీసీ రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీంతో స్పందించిన రైల్వే జీఎం అరుణ్కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. జీఎం కలిసిన వారిలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, జగదీశ్వర్ గౌడ్, రవీందర్నాయక్, నర్సింహ, శ్రీనివాస్, ఖాసీం, లిఖాయత్, ముసఫ్ ఖాన్, రహీం, తదితరులు పాల్గొన్నారు.