మేడ్చల్, మే 26 : అలుపెరుగని కృషి, పట్టుదల ఉంటే..పేరుకోసం కాకుండా ఎంచుకున్న లక్ష్యం కోసం పని చేస్తే.. గుర్తింపు ఆశించకుండానే లభిస్తుంది. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామ సర్పంచ్ వీర్లపల్లి గీతాభాగ్యారెడ్డి బృందం పడిన శ్రమకు గుర్తింపు లభించింది. ఆశించకుండానే జీవ వైవిధ్య అవార్డు సొంతం చేసుకుంది. గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దడానికి చేసిన కృషి, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణకు, వన్యప్రాణులు బతకడానికి తీసుకున్న చర్యలు డబిల్పూర్ను రాష్ట్రస్థాయి వేదికపై నిలబెట్టి, రాష్ట్రంలోని ఐదు గ్రామాల్లో ఒకటిగా జీవ వైవిధ్య అవార్డును సొంతం చేసుకునేలా చేసింది.
పచ్చదనానికి పెద్దపీట
డబిల్పూర్ గ్రామం మండలంలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ. ఈ పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికైన వీర్లపల్లి గీతాభాగ్యారెడ్డి ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పని చేస్తున్నారు. వివిధ మార్గాల్లో నిధులను సమకూర్చకుంటూ గ్రామాన్ని అభివృద్ధిని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. ప్రతి ఏటా తెలంగాణ హరితహారంలో భాగంగా లక్ష్యానికి మించి మొక్కలు నాటుతూ పరిరక్షిస్తూ వచ్చారు. అలాగే పరిశుభ్రత పరిరక్షణకు చర్యలు తీసుకున్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను నిర్మించి, ఎక్కడా కూడా మురుగునీరు నిల్వకుండా చర్యలు తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. వినియోగించే వారిపై జరిమానాలు విధిస్తూ కట్టుదిట్టం చేశారు.
చెరువు సుందరీకరణ..
డబిల్పూర్ గ్రామ మల్క చెరువు కట్ట కేవలం చెరువుకు కట్టనే కాకుండా మేడ్చల్కు రాకపోకలు సాగించేందుకు అనువుగా ఉండే దారి. దీనిని బీటీ రోడ్డుగా మార్చిన అనంతరం కట్టకు ఇరువైపులా మొక్కలు నాటి పరిరక్షించారు. దీంతో చెరువు కట్ట అందంగా, ఆహ్లాదానికి చిరునామాగా మారింది.
వన్యప్రాణి రక్షణలో భాగస్వామ్యం
డబిల్పూర్ గ్రామానికి అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు లక్ష మొక్కలను నాటారు. ఆ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అటవీ ప్రాంతంలో పచ్చదనం పెంపొందించడంలో గ్రామ పంచాయతీ తరఫున తగిన సహాయ సహకారాలు అందజేశారు. తద్వారా ఆ ప్రాంతంలో సంచరిస్తున్న నెమళ్లు, కుందెళ్లు ఇతర జీవుల రక్షణకు తోడ్పడ్డారు. పాడి పశువులు రోగాల బారిన పడకండా ఎప్పటికప్పుడు టీకాలు వేయిస్తున్నారు.
జీవ వైవిద్య పరిక్షణకు మరిన్ని చర్యలు
గ్రామానికి రాష్ట్ర స్థాయిలో జీవ వైవిధ్య అవార్డు సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ చూపిన బాటలో నడుస్తూ ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని చర్యలు తీసుకుంటాం. భవిష్యత్లో జీవ వైవిధ్య బోర్డు అధికారుల సూచనల మేరకు గ్రామంలో చిరుధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తాం. సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జీవ వైవిధ్య అవార్డు రావడంలో మంత్రి మల్లారెడ్డి ప్రోత్సాహం ఎంతో ఉంది.
– వీర్లపల్లి గీతాభాగ్యారెడ్డి, సర్పంచ్, డబిల్పూర్