సిటీబ్యూరో, సెప్టెంబరు 29 (నమస్తే తెలంగాణ) :మీ ఇంట్లో కాలేజీకెళ్లే విద్యార్థులు, చదువు పూర్తైన యువకులు ఉన్నారా..? వారు స్మార్ట్ఫోన్లో మునిగిపోతున్నారా..? అయితే ఆ ఫోన్లో ఎలాంటి యాప్లు ఉన్నాయో ఒకసారి తనిఖీ చేయండి. లేదంటే మీరు ఆర్థికంగా నష్టపోయి కష్టాల్లో పడాల్సిందే. ఇటీవలే 20 నుంచి 30 కుటుంబాల తలిదండ్రులు, భార్యలు, సోదరులు, బంధువుల సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్రను కలిశారు. తమ పిల్లలు క్రికెట్ బెట్టింగ్ మోజులో పడి ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తున్నారని, సులభంగా డబ్బులు సంపాదించాలని ఇంట్లోని పెద్దలు కూడా బెట్టింగ్ మాయలో పడి ఆస్తులు, బంగారు ఆభరణాలు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
గచ్చిబౌలి పీఎస్ పరిధిలో… ప్రధాన సూత్రధారి చింత వేణు, అనుచరులు వడువు అజయ్కుమార్, జెల్ల సురేశ్, కునప్పరెడ్డి దుర్గా పవన్ కుమార్, తిరుమణి మణికంఠ, కొల్లటి మణికంఠ, పి.శ్రీనివాస్, దుర్గాప్రసాద్ కొల్లటి, డి.సుందర రామరాజు, ఎమ్.జయశ్రీనివాస్. మియాపూర్ పీఎస్ పరిధిలో… ప్రధాన సూత్రధారి నాగళ్ల రాకేష్, అనుచరులు జమ్ము నాగరాజు, సత్యనారాయణ.
బాచుపల్లి పీఎస్ పరిధిలో… ప్రధాన సూత్రధారి గోదావర్తి వెంకటేశ్, అనుచరులు అట్లూరి రంజిత్కుమార్, కోటా సాయి నవీన్, బొప్పా వెంకటేశ్, గన్ని కళ్యాణ్కుమార్, పత్తిపాటి రాము, ఈదర రవి, గన్ని రవితేజ, కామగని సతీశ్, మల్లిఖార్జున చారి. వీరిలో అత్యధికంగా ఏపీ నుంచి వచ్చి ఇక్కడ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని దందాను నడిపిస్తున్నట్లు బయటపడింది.
పరారీలో ఉన్న వారు కీలక ప్రధాన పాత్రధారి మహా, చెన్ను భాస్కర్రెడ్డి, సురేశ్, పవన్ అలియాస్ ప్రవీణ్, సుమన్, రామాంజనేయ, నందర్లాల్.
తాజాగా పట్టుబడిన బెట్టింగ్ ముఠాల దందాను సైబరాబాద్ పోలీసులు అన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఠా సభ్యుల ఆర్థిక వ్యవహారాలు, బ్యాంక్ ఖాతాలు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఐడీల ద్వారా జరిగిన లావాదేవిలపై విచారణ చేయాలని ఐటీ శాఖ అధికారులకు లేఖలు రాస్తున్నారు. అదే విధంగా తెలంగాణలో గ్యాంబ్లింగ్పై నిషేధం ఉండడంతో బెట్టింగ్ యాప్లు మన రాష్ట్రంలో పనిచేయకుండా చూడాలని గూగుల్తో పాటు మరికొన్ని యాప్ సంస్థలకు లేఖలను రాస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.
ఈ బెట్టింగ్ దందా నాలుగు అంచెలుగా సాగుతుంది. ప్రధాన బుకీ(లైన్ ఇచ్చే వాడు), బుకీ, సబ్ బుకీ, ఏజెంట్లు.. ఇలా ఈ దందాను నిర్వహిస్తున్నారు. ప్రధాన బుకీ కూడా బెట్ 365, ఎమ్పీఎల్, బెట్వే, డ్రీమ్ గురు, మై 11 సర్కిల్, బెట్ 365, బీవిన్, 777బెట్, డాఫాబెట్, విన్నర్, క్రికెట్ బెట్టింగ్ 2020, జస్ట్ బెట్, లోటస్ క్రికెట్ లైన్ యాప్లతో పందాలు నడిపిస్తున్నారు. రాష్ట్రంలో గ్యాంబ్లింగ్ నిషేధం కాబట్టి ఈ యాప్లు ఇక్కడ పని చేయవు. దీంతో బుకీలు ఇతర రాష్ర్టాల నుంచి వీటిని ఆపరేట్ చేస్తూ బెట్టింగ్ లైన్లను కమీషన్ల మీద అందిస్తున్నారు. ఇలా బుకీలు, సబ్ బుకీలు ప్రతి మ్యాచ్కు లక్షలాది రుపాయాలను సంపాదిస్తూ, బీఎండబ్ల్యూ కార్లలో తిరుగుతూ అత్యంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు.
ఈ బెట్టింగ్ బుకీలు ఇండ్లు, అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లను అద్దెకు తీసుకుని దందా చేస్తున్నారు. సొంతవి అయితే పోలీసులు జప్తు చేస్తారనే ఉద్దేశ్యంతో అద్దె ఇండ్లవైపే మొగ్గు చూపిస్తున్నారు. హైదరాబాద్లో వెలుగుచూసిన బెట్టింగ్ ముఠాల ప్రధాన ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి నడుస్తుంది. పట్టుబడిన నాలుగు గ్యాంగ్లు విజయవాడకు చెందిన మహా దగ్గర లైన్ తీసుకున్నవే కావడం గమనార్హం. మహా ఒక లైన్కు హైదరాబాద్లోని బుకీకి రూ. 5 లక్షలకు అమ్ముకుంటున్నాడు. హైదరాబాద్ బుకీ మరో సబ్ బుకీకి లైన్ లక్ష రుపాయాలకు అమ్ముకుని కమీషన్ల మీద పందెంరాయుళ్ల డబ్బును పంచుకుంటున్నారు. ఇలా లైన్ తీసుకున్న బుకీ వేరు వేరుగా వందలాది మంది పందెంరాయుళ్లను గ్రూపులుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ క్రికెట్ బెట్టింగ్లను ప్రధాన సూత్రధారి మహా ఫ్యాన్సీ లైఫ్ ఎంటర్టైన్మెంట్ అప్లికేషన్, లైవ్ లైన్ గురు, క్రికెట్ మజా, లోటస్, బెట్-365, బెట్ ఫెయిర్ల ద్వారా నడిపిస్తున్నాడు. పందెంరాయుళ్ల నుంచి నగదుగా లేదా ఆన్లైన్ పేమెంట్ల వారికి బెట్టింగ్ డబ్బును ముఠాలు వసూలు చేస్తున్నాయి.
సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆపరేషన్ క్రికెట్ బెట్టింగ్ను ఎస్వోటీ డీసీపీ సందీప్ సారథ్యంలో మాదాపూర్ ఎస్వోటీకి అప్పగించారు. 60 రోజుల పాటు రహస్యంగా విచారణ ప్రారంభించిన ఎస్వోటీ పోలీసులు మియాపూర్, బాచుపల్లి, గచ్చిబౌలి, శంషాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న స్థావరాలను గుర్తించారు. ఈ ప్రాంతాలన్నింటికి ఒక రూటు మ్యాప్ను తయారు చేసి ఏడు బృందాలతో 7 చోట్ల ఒకేసారి సోదాలు జరిపారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్కు కళ్లెం వేశారు. మొత్తం 23 మందిని అదుపులోకి తీసుకుని, రూ. 93 లక్షల నగదు, నాలుగు ఖరీదైన కార్లు, 14 బెట్టింగ్ బోర్డులు, 2 రౌటర్లు, 247 మొబైల్ ఫోన్లు, 28 స్మార్ట్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ఈ బుకీల దగ్గర బెట్టింగ్ ఆడే వారిలో 75 శాతం మంది యువకులు, విద్యార్థులు, ఈజీ మనీపై అత్యాశ కలిగిన వారే ఉన్నట్లు తేలింది. మిగతా 25శాతం మంది బెట్టింగ్లకు బానిసలైన వారు ఉన్నట్లు తెలిసింది.
మీ పిల్లలు వాడుతున్న స్మార్ట్ఫోన్లను తల్లిదండ్రులు విధిగా తనిఖీ చేయాలి. బెట్టింగ్ యాప్లు ఉంటే వెంటనే తొలగించండి. సైబరాబాద్ పరిధిలో అక్రమ దందాలపై సమాచారం ఉంటే డయల్ 100 లేదా 9490617444 నంబర్కు వాట్సాప్ చేయండి. – సీపీ స్టీఫెన్ రవీంద్ర