సిటీబ్యూరో, అక్టోబర్ 11 ( నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పాటయ్యాక సంసృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసి బతుకమ్మ పండుగను ప్రతి ఏటా మహిళలు ఘనంగా నిర్వహిస్తున్నారని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఉత్సవాల్లో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డి, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత, అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి, ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య, ఉద్యోగినిలు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కేవలం తెలంగాణలో మాత్రమే జరుపుకొనే ప్రత్యేకమైన బతుకమ్మ పండగను ప్రపంచానికి చాటిందని అన్నారు. మహిళలు భక్తి శ్రద్ధలతో పూలతో బతుకమ్మను పూజించడంతో పాటు నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకొంటున్నారన్నారు. జీహెచ్ఎంసీ తరఫున లైట్స్, బేబి పాండ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు. సద్దుల బతుకమ్మకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా మంగళవారం పీపుల్ ప్లాజాలో నిర్వహించనున్న బతుకమ్మ ఉత్సవాలకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ఎమ్మెల్సీ కవిత, శాసన సభ్యులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారని మేయర్ విజయలక్ష్మి తెలిపారు.