సిటీబ్యూరో, జూలై 11 (నమస్తే తెలంగాణ): బాగ్లింగంపల్లిలో బల్దియా కమిషనర్ ఆమ్రపాలి గురువారం పర్యటించారు. జోనల్ కమిషనర్ రవి కిరణ్తో కలిసి సుందరయ్య పార్కు, మదర్ డైరీ పార్కు, వీఎస్టీ నుంచి బాగ్ లింగంపల్లి వరకు ఫేజ్-2 ఫ్లైఓవర్ ప్రతిపాదిత నిర్మాణ స్థలాన్ని కమిషనర్ పరిశీలించారు. సుందరయ్య పార్కులో వర్షపు నీరు నిల్వడంతో ఇబ్బందులు వస్తున్నాయని, దీంతో పాటు టాయిలెట్ మరమ్మతులు చేపట్టాలని వాకర్స్ కమిషనర్ను కోరగా, వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఎస్ఎన్డీపీ నాలా పనులు కూడా పూర్తి చేయాలని, మదర్ డైరీ పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. వీఎస్టీ నుంచి బాగ్లింగంపల్లి వరకు రెండు దశల్లో ఫ్లైఓవర్ నిర్మాణాలు చేపట్టాలని గతంలో నిర్ణయించగా, మొదటి దశలో ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు చేపట్టిన స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.