బాలానగర్, జూలై 2: స్వాతంత్య్ర సమరయోధుడు, కేంద్ర మాజీ మంత్రి బాబూ జగ్జీవన్రాం పేరు బాలానగర్ ఫ్లై ఓవర్కు పెట్టడం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. హెచ్ఎండీఏ అధికారులతో పాటు బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి, ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీశ్ గౌడ్లతో కలిసి ఆయన బాలానగర్ ఫ్లై ఓవర్ను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీన పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బాలానగర్ ఫ్లై ఓవర్ను ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఫ్లై ఓవర్ పనులు ఇప్పటికే 99 శాతం పూర్తయ్యాయని తెలిపారు.
ఫ్లై ఓవర్పై ఎల్ఈడీ లైట్లు, డివైడర్పై మొక్కలు, పెయింటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన పనులును సైతం త్వరలో పూర్తి చేసి 6వ తేదీ నుంచి ప్రజలకు అంకితం చేయనున్నట్లు తెలిపారు. దశాబ్దాల కాలంగా బాలానగర్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి తాను కంకణం కట్టుకున్నానని పేర్కొన్నారు. బాలానగర్లో దీర్ఘకాలంగా నెలకొన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయమన్నారు. ‘పఠాన్చెరువు టు సికింద్రాబాద్, జీడిమెట్ల టు చార్మినార్, పఠాన్చెరువు టు మేడ్చల్’ ప్రాంతాలకు ఇకపై బస్సు ప్రయాణం సులువు కానుందన్నారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ అధికారులు, బాలానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ఫతేనగర్ అధ్యక్షుడు బిక్షపతి, సునీల్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.