హిమాయత్నగర్, సెప్టెంబర్ 2 : ఆగి ఉన్న రెండు ఆటోలపై ప్రమాదవశాత్తు ఓ భారీ వృక్షం కూలిన సంఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో ఓ ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ రాజ్భవన్ రోడ్డులోని ఎంఎస్ మక్తాకు చెందిన మహ్మద్ గౌస్ పాషా(36) ఆటో డ్రైవర్. భార్య ఫరీదా బేగం, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. శనివారం మధ్యాహ్నం 1:22గంటలకు హిమాయత్నగర్ నుంచి హైదర్గూడ మీదుగా బషీర్బాగ్ వైపు ఆటోలో ఒక్కడే వెళ్తున్నాడు.
హైదర్గూడ వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో వాహనాలు నిలిచిపోయాయి. అదే సమయంలో ప్రమాదవశాత్తు ఫుట్ పాత్పై ఉన్న భారీ వృక్షం నిలిచి ఉన్న రెండు ఆటోలపై పడింది. ఈ ప్రమాదంలో మహ్మద్ గౌస్ పాష అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆటోలో ఉన్న నాగోల్కు చెందిన ఇస్లావత్ సురేశ్ ఆటో డ్రైవర్తో పాటు ప్రయాణికులు ప్రమాదం నుంచి బయట పడ్డారు. రెండు ఆటోలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన హైదర్గూడ సబ్స్టేషన్ అధికారులు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది కూలిన చెట్టును తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మృతుడు మహ్మద్ గౌస్ పాషా మామ యూసుఫ్ ఫిర్యాదు మేరకు ఎస్సై రాజేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.