బంజారాహిల్స్ : ఆంద్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి(49) సోమవారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయనకు భార్య శ్రీకీర్తి, కుమార్తె అనన్యారెడ్డి. కుమారుడు అర్జున్రెడ్డి ఉన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 48లో నివాసం ఉంటున్న గౌతమ్రెడ్డికి ఉదయం 7.15 నిమిషాలకు గుండెపోటు రావడంతో సోఫాలో పక్కకు ఒరిగిపోయారు.
దాంతో అక్కడే ఉన్న భార్య శ్రీకీర్తి, డ్రైవర్ నాగేశ్వర్రావు ఇతర సిబ్బంది సాయంతో జూబ్లీహిల్స్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అస్పత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స ప్రారంభించారు. అయితే సుమారు 9.13 ప్రాంతంలో గౌతమ్రెడ్డి తుదిశ్వాస విడిచారు. మేకపాటి గౌతమ్రెడ్డి మరణవార్త తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు అపోలో ఆస్పత్రికి తరలివచ్చారు.
మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు ఆస్పత్రివద్దకు వచ్చి వైద్యులతో మాట్లాడారు. వారంరోజులుగా దుబాయ్ పర్యటనలో ఉన్న గౌతమ్రెడ్డి ఆదివారమే నగరానికి వచ్చాడని, రాత్రి 9.45దాకా ఒక ఫంక్షన్లో పాల్గొని ఇంటికి వచ్చాడని, ఎలాంటి అస్వస్థత కనిపించలేదని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతరమయ్యారు.
అపోలో ఆస్పత్రిలో గౌతమ్రెడ్డి మృతిపై సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, వైఎస్.షర్మిల తదితరులు వచ్చి కుటుంబసభ్యులను ఓదార్చారు.
మేకపాటి గౌతమ్రెడ్డి పార్థివదేహానికి పలువురి నివాళి..
గుండెపోటుతో మృతి చెందిన ఏపీ మంత్రి గౌతమ్రెడ్డి పార్థివదేహాన్ని ఉదయం 11గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి తరలించారు. గౌతమ్రెడ్డి పార్థివ దేహానికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీలు సురేష్రెడ్డి. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, గల్లా జయదేవ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, జేసీ దివాకర్రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, డీకే. అరుణ, సీపీఐ నేత నారాయణ తదితరులు గౌతమ్రెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించారు.
పవన్ కల్యాణ్, నిర్మాత సురేష్బాబు, సీనియర్ నేతలు కేవీపీ రామచంద్రరావు, మైసూరారెడి తదితరులు గౌతమ్రెడ్డికి నివాళులు అర్పించారు.
ఎల్లుండి అంత్యక్రియలు..
గుండెపోటుతో మృతి చెందిన గౌతమ్రెడ్డి పార్ధివదేహాన్ని మంగళవారం ఉదయం విమానంలో నెల్లూరుకు తరలించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన అంత్యక్రియలు బుధవారం స్వగ్రామమైన బ్రాహ్మణపల్లిలో నిర్వహించనున్నారని వారు పేర్కొన్నారు.