విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఐదుగురు బెస్ట్ పోలీసు ఆఫీసర్లను సీపీ అంజనీకుమార్ ప్రశంసించారు. ఆరు వర్టికల్స్ రిసెప్షన్, పెట్రోలు వాహనాలు, కోర్టు డ్యూటీ, బ్లూ కోల్ట్స్, టెక్ టీమ్ వర్టికల్, క్రైం రైటర్లలో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించగా హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ శనివారం బషీర్బాగ్లోని పోలీస్ కమిషనరేట్లో వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ ఐదుగురితో పాటు మరో 30 మందికి సీపీ మెమోంటోలు అందించారు. వీరంతా టెక్నాలజీని ఉపయోగించుకుని పౌరులకు అత్యంత వేగంగా సేవలు అందించగా సీపీ అభినందించారు.
పటిష్ట దర్యాప్తుతోనే అన్ని కేసుల్లో నిందితులకు శిక్షలు పడుతున్నాయని సీపీ అంజనీకుమార్ అన్నారు. పలు కేసుల్లో సత్వర దర్యాప్తు పూర్తి చేసి శిక్షలు పడేలా చూసిన వెస్ట్జోన్ పోలీసులు, కోర్టు సిబ్బందికి శనివారం తన కార్యాలయంలో ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ దర్యాప్తు అధికారుల కృషితోనే ఎస్సార్నగర్ పోలీస్స్టేష్లో నమోదైన పోక్సో కేసులో షేక్ రియాజ్కు మూడేండ్ల జైలు, వెయ్యి రూపాయల జరిమానా.. మంగళ్హట్ పోలీస్స్టేషన్లో నమోదైన లైంగిక దాడి కేసులో సుకృత్సింగ్కు 20 ఏండ్ల జైలు, రూ.10 వేల జరిమాన విధిస్తూ న్యాయస్థానాలు తీర్పు చెప్పాయన్నారు. కార్యక్రమంలో వెస్ట్జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గాజి తదితర అధికారులు పాల్గొన్నారు.