మేడ్చల్ కలెక్టరేట్, జనవరి 26 : భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. నాగారం మున్సిపాలిటీ రాంపల్లి ప్రధాన చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని గురువారం మంత్రి మల్లారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డా.బీఆర్ అంబేద్కర్ చేసిన కృషి వల్లే దేశానికి గొప్ప రాజ్యాంగం సమకూరింది అని ఆయన చెప్పారు.
ఆయన దేశం కోసం చేసిన త్యాగాలు వృథా కాకుండా దేశ అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు రాములు, మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, మాజీ ఎంపీపీ రామారం సుజాత, తదితరులు పాల్గొన్నారు.