ఖైరతాబాద్, ఆగస్టు 10: కొవిడ్ బారిన పడిన జర్నలిస్టుల కోసం ఇప్పటి వరకు రూ.5.36 కోట్ల ఆర్థిక సాయం చేశామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయీల్ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జర్నలిస్టులకు ఉచిత కార్డియాక్ స్క్రీనింగ్ క్యాంప్ను ఏర్పాటు చేశారు. క్రియా ఫౌండేషన్, లైన్ 24 టీవీ సహకారంతో నిర్వహించిన క్యాంపును అల్లం నారాయణ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. తొలుత వైద్య శిబిరానికి సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడి, చాలీ చాలని జీతాలు, ఉద్యోగ భద్రత తదితర సమస్యల మధ్య పనిచేస్తున్న జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలన్నారు. ఇస్మాయీల్ మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కేర్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పీఎల్ఎన్ కపార్ధి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, కొవిద సహృదయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, హ్యుమన్రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ రీజియన్ చైర్పర్సన్ డాక్టర్ జి. అనూహ్య రెడ్డిలు, క్రియా ఫౌండేషన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ సాయి కృష్ణ మల్లు, టీలైన్ 24 బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఎస్.కృష్ణవేణి పాల్గొన్నారు.