సిటీబ్యూరో/చార్మినార్/అబిడ్స్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): పాతనగరంలో చోటు చేసుకుంటున్న ఘటనలను నగర పోలీసులు వ్యూహాత్మకంగా అణిచివేస్తున్నారు. అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే యువకులను ఎక్కడికక్కడే అడ్డుకుంటూ వారిని సముదాయిస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించవద్దని.. శాంతి భద్రతల సమస్యలు సృష్టించే వారిపై కఠినంగా ఉంటామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అదనపు సీపీ చౌహాన్, సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్యలు యువతకు పలు సూచనలు చేశారు. గురువారం పాతనగరంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. అక్కడక్కడ నిరసనగా దుకాణాలు మూసివేశారు. బుధవారం రాత్రి అరెస్టు చేసిన వారందరినీ గురువారం ఉదయం పోలీసులు వదిలేశారు. అయితే, అనుమానితుల ఇండ్లకు జియోట్యాగ్ చేసి, వారిపై నిఘా పెంచారు.
సద్దుమణిగింది..
వదంతులు సృష్టించి సోషల్ మీడియా ద్వారా వాటిని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. మీడియా సంయమనంతో వ్యవహరించాలని అదనపు సీపీ చౌహాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సూచనలు చేశారు. మధ్యాహ్నం కొందరు యువకులు బషీర్బాగ్లోని సీపీ కార్యాలయం ముందు ఆందోళనకు ప్రయత్నించగా పోలీసులు వారిని వారించారు. రాజాసింగ్తో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండటం.. ప్రస్తుత పరిస్థితులతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురువుతుండటంతో అతడిపై పీడీ యాక్టు ప్రయోగించి, చర్లపల్లి జైలుకు పంపించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ను జైలుకు పంపించడంతో పాత నగరంలో పరిస్థితి దాదాపుగా సద్దుమణిగింది.
గోషామహల్పై పోలీసు ఫోకస్..
రాజాసింగ్పై పీడీ యాక్టు ప్రయోగించడం.. జైలుకు పంపడంతో గోషామహల్ నియోజకవర్గంలో శాంతి భద్రతల సమస్యల తలెత్తకుండా పశ్చిమ మండలం పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. వెస్ట్జోన్ డీసీపీ రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. మరో పక్క బేగంబజార్లోని కొంతమంది వ్యాపారులు రాజాసింగ్ అరెస్టును నిరసిస్తూ దుకాణాలు మూసేశారు. ఇదిలా ఉంటే బుధవారం రాత్రి శాలిబండలో రాళ్లురువ్విన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాజాసింగ్పై మీర్పేట పీఎస్లో మరో కేసు..
మీర్పేట పోలీసు స్టేషన్లో ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదైంది. బాలాపూర్ మండలం షరీఫ్నగర్కు చెందిన మహ్మద్ రఫీక్ బుధవారం ఫిర్యాదు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు. ఒక మతాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించిన రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన్నట్లు ఎస్ఐ భద్యా నాయక్ తెలిపారు.
వదంతులు నమ్మొద్దు.. ఒకరి అరెస్టు
ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. ఇదిలాఉండగా.. రాజాసింగ్ వీడియోను చూసి సోమవారం అర్ధరాత్రి తర్వాత పాతనగరంలో ఆందోళన చేశారు. ఈ ఆందోళనలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా వీడియో తయారు చేసి, దానిని ట్విట్టర్ ద్వారా వైరల్ చేసిన సయ్యద్ అబ్దహు కషఫ్ను హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.