దుండిగల్: రెంట్కు కార్లు తీసుకొని.. వాటిని తనఖా పెట్టి.. వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నాడో వ్యక్తి. బాచుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిజాంపేట్లోని యూనివర్సల్ కార్స్ ట్రావెల్స్ బిజినెస్ నిర్వాహకుడు సయ్యద్ ఖాజా హబీబ్ అన్సారీ వద్ద తమిళనాడు రాష్ట్రం, కృష్ణగిరి మండలం హౌసూర్ గ్రామానికి చెందిన గోపాల్ రవి(46) గతేడాది ఏప్రిల్ 27న రెండు కార్లను నెలవారీగా కిరాయికి లక్షా 40 వేల చెల్లించి తీసుకున్నాడు.
మరో రెండు నెలల తర్వాత మరో కారును రూ. 40 వేలు నెల కిరాయి చెల్లించి తీసుకున్నాడు. ఆ తర్వాత రెంట్ డబ్బులు కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. నిర్వాహకుడు కారుకు ఉన్న జీపీఎస్ ఆధారంగా తమిళనాడుకు వెళ్లి.. గోపాల్ రవిను డబ్బులు అడిగాడు. అతడు కార్లు తనఖా పెట్టాడని తెలుసుకొని.. తాను మోసపోయానని గ్రహించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, గోపాల్ను తమిళనాడులో అరెస్టు చేశారు.