జీడిమెట్ల, ఏప్రిల్ 28 : ప్రముఖ పేరొందిన కంపెనీల పేరుతో నకిలీ ఎయిర్ పాడ్స్, స్మార్ట్ వాచ్లను విక్రయిస్తున్న ముఠాను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం షాపూర్నగర్లోని బాలానగర్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ టి.శ్రీనివాస్ రావు వివరాలు వెల్లడించారు. జగద్గిరిగుట్ట వెంకటేశ్వరనగర్కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ (28), మహ్మద్ ఇఫ్రాన్ (24)లకు కూకట్పల్లి పద్మావతి ప్లాజాలో సెల్ఫోన్ దుకాణం ఉన్నది. వారు ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ ఎయిర్పాడ్స్, స్మార్ట్వాచ్లను విక్రయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న కూకట్పల్లి పోలీసులు షాపుపై దాడి చేసి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా బాచుపల్లిలోని జేహెచ్ మొబైల్స్ నిర్వాహకుడు పందిరి జయరామకృష్ణ, ప్రకాశం జిల్లా బేస్తవారి పేటకు చెందిన షేక్ హుస్సేన్ భాష వారికి విక్రయించినట్లు తెలిపారు. వారిని విచారించగా అబిడ్స్ జగదీశ్మార్కెట్లోని కేతేశ్వర్ మొబైల్స్ నుంచి తీసుకొచ్చినట్లు చెప్పాడు. అక్కడికి వెళ్లి విచారించగా ఢిల్లీ కరోల్ బాగ్ నుంచి తీసుకువచ్చి నగరంలోని పలు సెల్ ఫోన్ దుకాణ నిర్వాహకులకు విక్రయినట్లు చెప్పాడు. వారి వద్ద నుంచి 500 నకిలీ ఎయిర్ పాడ్స్, 14 యాక్ట్ -2 వాచ్లు, ఇతర కంపెనీలకు చెందిన స్మార్ట్ వాచ్లు 20, యాపిల్ లోగోతో ఉన్న సెల్ఫోన్ కవర్స్ 70, కారు, 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన కూకట్పల్లి, బాచుపల్లి సీఐలు సురేందర్, సుమన్కుమార్లను డీసీపీ అభినందించారు. విలేకరుల సమావేశంలో కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.