ఒకరి మృతి..ఐదుగురికి గాయాలు
విషాదం నింపిన బర్త్డే వేడుక
కుత్బుల్లాపూర్, డిసెంబర్ 20: గచ్చిబౌలి ఘటన మరువకముందే.. మద్యం మత్తు కారణంగా మరో ప్రమాదం జరిగింది. బర్త్డే వేడుకల్లో ఫుల్గా తాగి.. సరదాగా రైడింగ్ చేద్దామని వెళ్లిన ఆరుగురిలో ఒకరు మృత్యువాతపడ్డారు. పేట్ బషీరాబాద్ ఎస్ఐ భానుప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం…బహదూర్పల్లి, దూలపల్లి ప్రాంతాలకు చెందిన ఎలుగారి బాలకృష్ణ (34), కిరణ్, అజయ్, వెంకట్, సతీశ్, రాము స్నేహితులు. ఆదివారం రాత్రి బహదూర్పల్లిలోని సతీశ్ కొడుకు బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఇందులో స్నేహితులంతా కలిసి మద్యం సేవించారు. అనంతరం రాత్రి 12 గంటల సమయంలో కిరణ్ తన కారులో ఓ సారి రైడింగ్ చేద్దామని చెప్పడంతో బహదూర్పల్లి నుంచి దూలపల్లి ఫారెస్టు వైపునకు వచ్చారు. కారు అతివేగంతో ఉండటంతో మూలమలుపు వద్ద అదుపు తప్పి.. డివైడర్ను తాకి..పల్టీలు కొట్టి.. చెట్టుకు బలంగా ఢీకొట్టింది. బాలకృష్ణ వెనక సీటులో కూర్చున్నప్పటికీ ప్రమాద ధాటికి కారులోనే చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్రంగా, ఇద్దరికి స్వల్పంగా గాయాలయ్యాయి. డ్రైవింగ్ చేస్తున్న కిరణ్ ఘటనాస్థలి నుంచి పరారైనట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ..
లారీని ఢీకొట్టిన కారు.. భర్త మృతి..భార్యకు తీవ్ర గాయాలు అంత్యక్రియలకు వెళ్లి వస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. భర్త అక్కడికక్కడే చనిపోగా, భార్య తీవ్రంగా గాయపడింది. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ కనకయ్య కథనం ప్రకారం..వనస్థలిపురానికి చెందిన జెట్లి చార్లిస్ డెనియల్(40), స్రవంతి (35) దంపతులు సంగారెడ్డికి వెళ్లి తిరిగి వస్తుండగా, వారు ప్రయాణిస్తున్న కారు ముందువెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డెనియల్ మరణించగా, గాయపడిన శ్రవంతి చికిత్స పొందుతున్నది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.