వాషింగ్టన్: యుద్ధంలో దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణ కృషికి సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. శుక్రవారం పశ్చిమాసియా ఘర్షణలపై మాట్లాడుతూ,
పాలస్తీనా సమస్యకు రెండు రాజ్యాల పరిష్కారమే ఉత్తమమని చెప్పారు. ఇజ్రాయెల్ సరసన స్వతంత్ర పాలస్తీనా రాజ్యం ఏర్పాటు చేయడమే ఆ ప్రాంతంలోని ఘర్షణలకు ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. అలాగే జెరూసలేంలో మతకలహాలను ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అన్నారు. అయితే ఇజ్రాయెల్ భద్రత పట్ల తన నిబద్ధత విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని ప్రాంతీయ దేశాలు నిర్ద్వంద్వంగా గుర్తిస్తే తప్ప శాంతి నెలకొనదని బైడెన్ అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ తో పాటుగా సార్వభౌమాధికారాలు గల పాలస్తీనా ఏర్పాటు అనే రెండు దేశాల పరిష్కారం దశాబ్దాలుగా అంతర్జాతీయ దౌత్య పరిష్కారంగా ఉన్నదని గుర్తు చేశారు. డోనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా విధానం పూర్తి ఏకపక్షంగా ఇజ్రాయెల్ వైపు మొగ్గిందని విమర్శలు వచ్చాయి. కాగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సమతూక విధానం ప్రకటించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.