సిటీబ్యూరో, జూలై 10(నమస్తే తెలంగాణ)/సుల్తాన్ బజార్: నకిలీ టీ-పౌడర్ను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని శనివారం హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ బార్మెర్ ప్రాంతానికి చెందిన మహేందర్ సింగ్ కొన్నేండ్ల కింద నగరానికి వలస వచ్చి కిరాణా దుకాణం సామగ్రి సరఫరా చేస్తూ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ వ్యాపారంలో వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో అడ్డదారుల వైపునకు మళ్లాడు. ఈ నేపథ్యంలో మహేందర్ సింగ్ కల్తీ చేసిన ఓ కంపెనీ టీ-పౌడర్ను తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్నాడు. ఇలా వినియోగదారులతో పాటు దుకాణదారులను మోసం చేస్తున్నాడు. ఈ కల్తీ టీ-పౌడర్ విక్రయానికి సంబంధించిన సమాచారం అందుకున్న నగర తూర్పు మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు మహేందర్ సింగ్ను అదుపులోకి తీసుకుని అతని నుంచి 14,400 కల్తీ టీ-పౌడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం అతనిని అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు. మహేందర్ సింగ్ గతంలో కూడా ఇదే విధంగా కల్తీ చేసిన సామగ్రిని విక్రయిస్తూ అఫ్జల్గంజ్ పోలీసులకు పట్టుబడ్డాడని విచారణలో తేలింది. వీటిని తయారు చేస్తున్న ప్రధాన నిందితుడు సురేందర్ సింగ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.