వనస్థలిపురం, డిసెంబర్ 30 : ‘ఆలస్యంగా జరిగిన న్యాయం కూడా అన్యాయంతో సమానం’ అన్నారు మహానుభావులు. నేరం జరిగిన వెంటనే స్పందించి, దానిని ఛేదించి బాధితులకు న్యాయం చేయడంలో తెలంగాణ పోలీసులు ఆదర్శం. అదే దారిలో వనస్థలిపురం పోలీసులు పయణించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10వ స్థానంలో నిలిచారు. రాష్ట్రంలో 713 పోలీస్ స్టేషన్లలో 17వ స్థానంలో నిలిచారు. దీంతో ప్రజల్లో మరింత నమ్మకాన్ని పొందారు.
ప్రజల సహకారం, సీసీ కెమెరాల నిఘాతో నేర పరిశోధనలో ఉత్తమ ఫలితాలు సాధించగలిగాం, ఫ్రెండ్లీ పోలీస్, కమ్యూనిటీ పోలీసింగ్లో ప్రజల నుంచి సహకారం లభించింది. మా సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ నేర నివారణ, పరిశోధన చేయగలిగాం. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. అనుమానిత వ్యక్తులు, వస్తువుల సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలి. సైబర్ నేరగాళ్లు అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేయాలి, స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలి.
– కోలా సత్యనారాయణ, సీఐ
హత్య, డెకాయిట్ కేసుల్లో 100శాతం పూర్తి చేశారు. దోపిడీ కేసుల్లో 98శాతం కేసులు ఛేదించి, సొత్తును కూడా రికవరీ చేశారు. దొంగతనాల కేసుల్లో 59శాతం పూర్తి చేసి, సొత్తును రికవరీ చేశారు. దొంగతనాల కేసుల్లో ఓ నేరస్తుడి వద్ద నుంచి 2 కేజీల బంగారాన్ని రికవరీ చేసి రికార్డు సృష్టించారు. మిస్సింగ్ కేసుల్లోనూ 90శాతం పరిశోధన పూర్తి చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి 48 గంటల్లో పూర్తి చేసిన కేసులు కోకొల్లలుగా ఉన్నాయి.
వనస్థలిపురం పోలీసులు సైబర్ నేరాలను ఛేదించడంలోనూ ముందున్నారు. గతంలో సైబర్ నేరాలను ఎల్బీనగర్ నుంచి పరిశోధించారు. 2022లో ఇక్కడే కేసు నమోదు చేసి పరిశోధించారు. ఓటీపీలు, బ్లాక్ మెయిల్, ఛీటింగ్ చేస్తూ అకౌంట్ల నుంచి డబ్బులు కొట్టేసేవారి పీచ మణిచారు. సైబర్ నేరాల్లో 90శాతం ఛేదించి, బాధితులకు న్యాయం చేశారు.