న్యూఢిల్లీ : శరీరంలో ఎముకలు, కండరాల పటిష్టానికి విటమిన్ డీ అత్యవసరమే కాకుండా జీవక్రియల వేగం పెరిగేందుకు, మెరిసే చర్మాన్ని అందించడంలో ఈ సన్షైన్ విటమిన్ పాత్ర కీలకం. విటమిన్ డీ లోపం ప్రపంచవ్యాప్తంగా వైద్యారోగ్య అధికారులను కలవరపెడుతోంది. డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచ జనాభాలో 13 శాతం మంది డీ విటమిన్ లోపంతో బాధపడుతున్నారని అంచనా.
కుంగుబాటు, మధుమేహం, క్యాన్సర్, హృద్రోగ ముప్పు నుంచి విటమిన్ డీ కాపాడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. రోజుకు 600-800 ఐయూ విటమిన్ డీ అత్యధికులకు సరిపోతుందని యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ వెల్లడించింది. ఇక విటమిన్ డీ లోపంతో కండరాలు, జాయింట్ నొప్పులు, తీవ్ర నీరసం, అలసట, కుంగుబాటు వంటి సమస్యలు వెంటాడుతాయని క్లీవ్ల్యాండ్ క్లినిక్ పేర్కొంది.
ఇక విటమిన్ డీ కోసం రోజూ ఉదయాన్నే పది నిమిషాల పాటు సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడంతో పాటు ఫిష్, సీ ఫుడ్ తరచూ తీసుకోవాలి. కోడిగుడ్డు, పాలు, ఓట్స్, బాదం, వాల్నట్స్ వంటి సిరిల్స్ తృణధాన్యాలు క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. పెరుగు, సోయా ఉత్పత్తులను కూడా నిత్యం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.