COVID | లండన్: మూడేండ్లు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్ తగ్గుముఖం పట్టినా దాని ప్రభావం మాత్రం వీడటం లేదు. కరోనా బాధితులను దీర్ఘకాల కొవిడ్ (లాంగ్ కొవిడ్) లక్షణాలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి. అలసట, శ్వాస సమస్యలు, ఛాతి, కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెదడు సంబంధ సమస్యలు, నిద్రలేమి, ఆందోళన, మనోవ్యాకులతతో రోగులు నిత్యం సతమతమవుతూనే ఉన్నారు. కాగా, దీర్ఘకాల కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న 59 శాతం మందిలో కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డ ఏడాది తర్వాత శరీరంలోని ఏదో ఒక అవయవం దెబ్బతింటున్నదని బ్రిటన్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. కొవిడ్ బారినపడినప్పుడు పెద్దగా ఇబ్బందులు పడని వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తున్నదని పరిశోధకులు గుర్తించారు. 536 మంది కొవిడ్ రోగులపై పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఇందులో 13 శాతం మంది కరోనాతో దవాఖానలో చేరినవారు కాగా, 32 శాతం మంది ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. ఈ 536 మంది రోగులకు ఆరు నెలల తర్వాత 40 నిమిషాల పాటు మల్టీ ఆర్గాన్ ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించారు. ఈ ఫలితాలను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విశ్లేషించగా, ఇందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ అధ్యయన ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి.
దీర్ఘకాల కొవిడ్ బాధితుల్లో ఏడాది వరకు లక్షణాలు కనిపిస్తున్నాయి. మహిళలు, యువతలో ఆరు నుంచి ఏడాదిలో లక్షణాలు ఒకే విధంగా ఉంటున్నాయి. వీరిలో ఒకే అవయవం దెబ్బతింటున్నది. ప్రతి ఐదుగురిలో కనీసం ముగ్గురికి కనీసం ఒక అవయవం దెబ్బతింటున్నట్టు మా పరిశోధనలో తేలింది. ప్రతి నలుగురిలో ఒకరికి ఒకటి కంటే ఎక్కువ అవయవాలకు (మల్టీ ఆర్గాన్ డ్యామేజ్) నష్టం వాటిల్లుతున్నట్టు గుర్తించాం. కొన్ని కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేకుండానే ఇది సంభవించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ లాంగ్ కొవిడ్ సమస్యలు చాలామందిలో జీవన నాణ్యత, పనితీరుపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య కార్యకర్తలపై ఈ ప్రభావం అధికంగా ఉన్నది. 180 రోజుల తర్వాత సమస్యలు తలెత్తాయి.
– యూసీఎల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సీనియర్ ప్రొఫెసర్ అమితవ బెనర్జీ