Digestive Health | మారిన జీవన విధానం కారణంగా మనలో చాలా మంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. గ్యాస్, అజీర్ణం, మలబద్దకం, ఉబ్బరం, ఆకలి లేకపోవడం వంటి వివిధ జీర్ణ సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఈ సమస్యలతో బాధపడుతున్నారు. క్రమరహిత భోజనం, ఫైబర్ లేని ఆహారం, నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యల బారి నుండి బయటపడడానికి చాలా మంది మందులను కూడా వాడుతున్నారు. పెద్ద వారితో పాటు పిల్లలు, యువత కూడా మందులను వాడే పరిస్థితి నెలకొంది. అయితే ఈ జీర్ణ సమస్యలను తగ్గించుకోవడానికి మందులు వాడాల్సిన పని లేదని మన జీవనశైలిలో మార్పులు చేసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల మందులు వాడాల్సిన అవసరం లేకుండానే జీర్ణ సమస్యలు తగ్గుతాయని అలాగే భవిష్యత్తులో కూడా రాకుండా ఉంటాయని వారు చెబుతున్నారు. జీర్ణసమస్యల నుండి బయటపడడానికి మన జీవనశైలిలో ఎటువంటి మార్పులు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే రోజూ నిర్ణీత సమయానికి భోజనం చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు భోజనం చేయడం వల్ల గ్యాస్ సమస్య పెరుగుతుంది. మనం రోజూ ఒకే సమయానికి భోజనం చేయడం వల్ల శరీర అంతర్గత గడియారం జీర్ణ ఎంజైమ్ లను సరైన సమయానికి విడుదల చేస్తుంది. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, ఉబ్బరం, మలబద్దకం, ఆమ్లత్వం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే తినేటప్పుడు టీవీ, సెల్ఫోన్ వంటి వాటిని చూడకూడదు. డిజిటల్ స్క్రీన్ లను చూడడం వల్ల మెదడు దృష్టి సరిగ్గా ఉండదు. దీంతో పేగులకు సంకేతాలు సరిగ్గా వెళ్లక ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక తినేటప్పుడు మన దృష్టి అంతా మన భోజనంపై ఉండేలా చూసుకోవాలి. జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే రాత్రి పూట త్వరగా నిద్రించడం కూడా అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఆలస్యంగా నిద్రించడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణమవ్వదు. దీంతో యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుంది.
మనం ఆహారం తీసుకోవడానికి, నిద్రించడానికి మధ్యలో 2 నుండి 3 గంటల సమయం ఉండడం వల్ల తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది, శరీరం పోషకాలను సరిగ్గా గ్రహించుకుంటుంది. అలాగే మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, తృణ ధాన్యాలు, చిక్కుళ్లు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ఫైబర్ కలిగిన ఆహారాలను తీసుకోవడం వల్ల పేగులల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం సమస్య తగ్గుతుంది. ఆహారంలో ఫైబర్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మొత్తానికి మేలు కలుగుతుంది. అదే విధంగా రోజూ ఉదయం మల విసర్జన తప్పకుండా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ఉదయంపూట మలవిసర్జన చేయడం ఒక అలవాటుగా చేసుకోవాలి. మలవిసర్జన చేయడం వల్ల ఉబ్బరం, గ్యాస్ వంటి వాటితో పాటు ఇతర జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
జీర్ణ సమస్యలతో బాధపడే వారు ప్రతిరోజూ వ్యాయామం చేయడం అవసరం. వ్యాయామం చేయడం వల్ల జీర్ణవ్యవస్థతో పాటు మొత్తం శరీరానికి మేలు కలుగుతుంది. వ్యాయామం చేయడం వల్ల పేగు కదలికలు ఎక్కువగా ఉంటాయి. దీంతో అజీర్తి, గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా మన జీవనశైలిలో, మన ఆహారపు అలవాట్లల్లో మార్పులు చేసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయని మందులు వాడే అవసరం కూడా ఉండదని వైద్యులు పేర్కొంటున్నారు.