అతిసార వ్యాధి.. వైద్యం కన్నా నివారణ సులభం. ఈ రుగ్మతను నివారించడం వల్ల శిశు మరణాలు తగ్గుతాయి. పోషకాహార లోపాలను అధిగమించవచ్చు. బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. వయసుకు తగిన ఎదుగుదల ఉంటుంది.
1. శిశువుకు 6 నెలలు పూర్తిగా నిండేవరకు తల్లిపాలు మాత్రమే తాగించాలి. తల్లిపాలలోని రోగ నిరోధక పదార్థాలు అతిసార వ్యాధిని నివారిస్తాయి. అందు వల్లనే మొదటి 6 నెలల వయసు పిల్లలకు అతిసార వ్యాధి అరుదుగా వస్తుంది.
2. పాలు సరిపోవడం లేదని డాక్టరు నిర్ధారిస్తే.. పరిశుభ్రమైన కప్పు, చెంచాతో లేదా ఉగ్గు గిన్నెతో (నీళ్లు కలపని) పాలు తాగించాలి. సీసాతో పాలు తాగించడమంటే ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవడమే.
3. ఆరు నెలల వయసు తరువాత పరిశుభ్రమైన అదనపు ఆహారాన్ని ఇవ్వాలి. పిల్లలకు ఆహారం తినిపించే ముందు, మల విసర్జన తరువాత చేతుల నుంచి మోచేతుల వరకు శుభ్రంగా కడుక్కోవాలి.
4. తాజా ఆహారాన్నే పెట్టాలి. వండిన వెంటనే ఆహారాన్ని తినిపించే వీలు లేనప్పుడు మూత ఉంచిన పాత్రలలో పరిశుభ్రమైన ప్రదేశంలో నిలువ చేయాలి. భోజన సమయంలో కొంచెం వేడిచేసి తినిపించాలి. దుర్వాసన వస్తున్న ఆహారాన్ని పడేయడమే ఉత్తమం.
5. చిన్నపిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన ఉండదు. పెద్దలే శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు పళ్లు వచ్చే వయసులో చేతులు, ఆట వస్తువులు నోట్లో పెట్టుకుంటారు. కాబట్టి, 2-3 గంటలకొకసారి వాటిని శుభ్రంగా కడగాలి. వారానికి ఒకసారి గోళ్లు కత్తిరించాలి. పొడవు గోళ్లలో మట్టి చేరడం వల్ల అందులోని సూక్ష్మజీవులు వ్యాధులను కలిగిస్తాయి.
6. పళ్లు, దుంపలు శుభ్రంగా కడిగిన తరువాతే తినిపించాలి. వీధుల్లో అమ్మే కోసిన పండ్ల ముక్కలు, పళ్ల రసాలు తీసుకోరాదు. ఐస్క్రీమ్ తయారీకి ఉపయోగించే నీరు కలుషితమైనా అతిసార వ్యాధి రావచ్చు.
7. పరిశుభ్రమైన నీటినే ఇవ్వాలి. కనీసం రెండు సంవత్సరాల వయసు వరకు వడపోసి, మరిగించి, చల్లార్చిన నీరే పిల్లలకు సురక్షితం. నీరు నిల్వ ఉంచే పాత్రలపై నిత్యం మూత ఉంచాలి. కావలసినప్పుడు పొడవైన కాడ ఉన్న గరిటెతో గ్లాసులో పోసుకోవాలి. చేతులు పదేపదే ముంచితే నీరు కలుషితం అవుతుంది. అలాగే, పిల్లల కోసం పరిశుభ్రమైన మరుగుదొడ్లనే ఉపయోగించాలి.
డాక్టర్ కర్రా రమేశ్రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు