హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి చికిత్సలో ఇప్పటివరకూ 200 ఔషధాలు, 70 చికిత్సా పద్ధతులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. వైరస్కు సమర్ధవంతమైన చికిత్స అందించే క్రమంలో ఇప్పటిరకూ 265 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టు నైపర్ హైదరాబాద్కు చెందిన శాస్త్రవేత్తలు సహా శాస్త్రవేత్తల బృందం చేపట్టిన పరిశోధన వెల్లడించింది. వీటిలో 115 ఔషధాలు, చికిత్సా పద్ధతులు వైరల్ లోడ్ను తగ్గించడం, వ్యాధిని సమర్థంగా నిరోధించడంలో మెరుగైన ఫలితాలు ఇచ్చినట్టు వెల్లడైంది.
ఇక వ్యాక్సిన్లు మినహా ఇప్పటివరకూ పరీక్షించిన మందులన్నీ పాతవే కావడం గమనార్హం. కొవిడ్-19 చికిత్సలో ఇవి భిన్నమైన ఫలితాలు ఇచ్చినట్టు గుర్తించారు. కొవిడ్-19 వేగంగా వ్యాప్తి చెందుతూ అధిక ఇన్ఫెక్షన్ రేటుతో ఆందోళన రేకెత్తించగా మందుల ద్వారా చికిత్స, క్రిటల్ కేర్ వైద్యులకు సవాల్గా పరిణమించింది. మహమ్మారికి సమర్ధంగా చికిత్స అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా 200కి పైగా కాంపౌండ్స్, 69 థెరాప్యుటిక్ ఏజెంట్స్పై క్లినికల్ ట్రయల్స్ సాగుతున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. క్లినికల్ ట్రయల్స్లో భాగంగా పలు యాంటీ వైరల్ మందులు, యాంటీ పరాసిటిక్, మోనోక్లోనల్ యాంటీబాడీలు, వ్యాక్సిన్లు, స్టెమ్సెల్ ధెరఫీలను ప్రయోగాత్మకంగా పరీక్షించారని తెలిపింది.
వైరస్ ముప్పును తగ్గించడంలో విటమిన్ సీ, విటమిన్ డీ సప్లిమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించారని పేర్కొంది. విటమిన్ డీ వైరస్ కణాల వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు ఊపిరితిత్తులను దెబ్బతీసేందుకు కారణమయ్యే వాపు కారక సైటోకైన్స్ను నియంత్రిస్తుందని వెల్లడైంది. ఈ అధ్యయన వివరాలు సైంటిఫిక్ జర్నల్ బయోమెడిసన్ అండ్ ఫార్మకోథెరఫీ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.
ఈ అధ్యయనంలో నైపర్ హైదరాబాద్ శాస్త్రవేత్తలతో పాటు ఢిల్లీ వర్సిటీ డాక్టర్ అంబేడ్కర్ సెంటర్ ఫర్ బయోమెడికల్ రీసెర్చి పరిశోధకులు, చండీఘఢ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ పరిశోధకులు కూడా పాలుపంచుకున్నారు. పరిశోధకుల బృందంలో ముఖేష్ కుమార్, జితేందర్ మదన్, రూపీందర్ కౌర్ సోధి, శశి బాలా సింగ్, అంజు కత్యాల్ ఉన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు సాధ్యమైన వ్యూహాల రూపకల్పనకు వినూత్న మార్గాల్లో ఆలోచన, అభివృద్ధి కోసం సమాజాన్ని పురిగొల్పిందని పరిశోధకులు పేర్కొన్నారు.