నాడు పస్తులు.. నేడు డెయిరీ ఓనర్
కూలి పనినుంచి ఉపాధి కల్పన వరకు..
స్త్రీనిధి, సెర్ప్, మెప్మా రుణాలతో భరోసా
స్వయం సహాయక సంఘాల విజయగాథ
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయ సంఘాల ద్వారా మహిళలు సంఘటితమవుతున్నారు. చదువుతో సంబంధం లేకుండా ఉపాధి వెతుక్కొంటున్నారు. మరింతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. తాము ఎంచుకున్న వ్యాపారాల్లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. స్త్రీనిధి, సెర్ప్, మెప్మా నుంచి అందిస్తున్న రుణాలు వారికి భరోసాను
ఇస్తున్నాయి. మహిళా స్వయం సహాయక సంఘాల్లో చేరి కుటుంబాన్ని పోషించడమే కాకుండా మరికొందరికీ ఉపాధినిస్తున్నారు.
ఇది ఊహించని స్థాయి
మహిళా సంఘాలతోనే తమ కుటుంబం జీవితం మారిపోయిందని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం, ఎత్తోండ క్యాంప్ నివాసి సావిత్రమ్మ సంతోషం వ్యక్తంచేశారు. ‘అప్పట్లో మాకు గుంట భూమి కూడా లేదు. మా ఆయన కూలి పని చేసేవారు. నేను రాట్నం వడికినా పెద్దగా డబ్బులు వచ్చేవికావు. ఒక్కోసారి ఆరోగ్యం బాగలేక మా ఆయన పనికి పోకపోతే ఆరోజు పస్తులు ఉండాల్సి వచ్చేది. 1996లో ఐకేపీవాళ్లు సంఘాలు ఏర్పాటుచేసుకోవాలని చెప్పారు. ఊళ్లో 40 గ్రూపులు ఏర్పడ్డాయి. మొదట రూ.5వేల నుంచి రూ.10వేల వరకు లోన్లు ఇచ్చేవారు. ఆ తర్వాత స్త్రీనిధి నుంచి రెండుసార్లు రూ.50వేల చొప్పున తీసుకొని.. రెండు బర్రెలను కొనుక్కున్నాం. పాల సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన. రోజుకు రూ.400-500 ఆదాయం వస్తున్నది. మహిళా గ్రూపులతోనే ఇదంతా సాధ్యమైంది. కష్టపడి రెండు ఎకరాల పొలం కొనుక్కున్నాం. ఇద్దరు బిడ్డల పెండ్లి చేశాం.
ఈ పనితో పాటుగా స్కూల్లో మధ్యాహ్న భోజనం కూడా వండిపెడుతాను. గతంలో పూట గడవటం కూడా కష్టంగా ఉండేది. ఈ స్థాయికి వస్తానని కలలో కూడా అనుకోలేదు’ అని ఆమె చెప్పారు.
కరోనా సమయంలోనూ 20మందికి ఉపాధి
నేను డిప్లొమా చేశాను. పెళ్లి చేసుకున్నాక గృహిణిగా ఉన్నాను. మెప్మా ద్వారా మహిళా సంఘం సభ్యులకు జ్యూట్ బ్యాగులు కుట్టడంపై శిక్షణ ఇస్తున్నారని తెలిసి నేర్చుకున్నాను. లక్ష పెట్టుబడితో యూనిట్ స్టార్ట్ చేశాను. మార్చిలో కరోనా, ఆ తర్వాత లాక్డౌన్ రావడంతో మాస్కులు కుట్టాలని డీఆర్డీఏ, మెప్మా వాళ్లు ఆర్డర్ ఇచ్చారు. మెప్మాకు లక్ష మాస్కులు.. డీఆర్డీఏకు 1.90లక్షల వరకు మాస్కులు కుట్టి ఇచ్చాం. లాక్డౌన్లో చాలామందికి పనిలేకపోయేది. కానీ, నాకు తెలిసినవారికి దాదాపుగా 20 మందికి నిరంతరం పని కల్పించాను. నా భర్తకు బయటపని దొరుకలేదు.. ఈ పనితో వచ్చే డబ్బులతో కుటుంబానికి ఇబ్బందులు తప్పాయని చాలామంది చెప్పడం సంతృప్తినిచ్చింది. కరోనాతో నా భర్త పని బంద్ కావడంతో.. నాతోపాటు పనిచేస్తున్నారు. నెలకు రూ.30-40వేలు సంపాదించాలుగుతున్నాను. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి రూ.10లక్షల డీపీఆర్ను సిద్ధం చేశాను. తొందరలోనే దానిని ప్రారంభిస్తా.
– రేఖా భార్గవి, (ఖమ్మం పట్టణం)
కొత్త ట్రెండ్ ఇదే… అందుకే
మా ఆయనకు టైర్ పక్చర్ కొట్టు ఉన్నది. దాని మీద వచ్చిన ఆదాయంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. నాకు కుట్టుమిషన్ వచ్చు. చాలామంది మిషన్ కుడుతుండటంతో చేతినిండా పని ఉండేదికాదు. మగ్గం వర్క్ అంటే చాలామందికి ఇష్టం ఉన్నా.. వేల రూపాయలు కావడంతో చేయించుకోలేకపోయేవారు. కంప్యూటర్ ఎంబ్రాయిడర్ వర్క్స్ గురించి విన్నాను. తక్కువ ఖర్చుతో మగ్గం మీద డిజైన్లు వేసే అవకాశం ఉండటంతో ఈ మిషన్ కొనుక్కొవాలని అనుకున్నా. స్త్రీనిధి నుంచి లోన్ తీసుకుని మిషన్ కొన్నాను. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ.. ఇప్పటి ట్రెండ్. నెలకు రూ.15వేల వరకు సంపాదిస్తున్నాను.
– ప్రియాంక, మడిపల్లి, జమ్మికుంట (కరీంనగర్)
తక్కువ పెట్టుబడితో మంచి ఉపాధి
నా భర్త వ్యవసాయ కూలి. మా ఆయన చేసే కూలీతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. తొమ్మిదేండ్లక్రితం మహిళా సంఘంలో చేరాను. అక్కడ తీసుకునే డబ్బులు ఇల్లు గడవడానికి సరిపోయేవి. ఉర్లో పిండి గిర్ని పెట్టాలనుకున్నాం. అప్పుడే స్త్రీనిధి లోన్లు ఇస్తున్నారు అని తెలిసింది. సంఘం సభ్యులతో మాట్లాడి పిండి గిర్నికి రూ.50వేలు లోను తీసుకున్నాను. మిల్లు బాగానే నడుస్తున్నది. ఉదయం, సాయంత్రం గంట, రెండు గంటల చొప్పున నడిపించుకుంటే సరిపోతుంది. అన్ని ఖర్చులు కరెంటు బిల్లు, ఈఎంఐ పోను ఆరువేల వరకు మిగులుతాయి. మొదట ఒకటి ఆ తర్వాత ఇంకో గిర్ని తీసుకున్నాం. భూమి కొన్నాం. సంతోషంగా ఉన్నాం.
-ఫాతిమా, కలమడుగు, జన్నారం (ఆదిలాబాద్)