ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం సతీమణి అమలతో కలిసి తిరుమలకు వెళ్లిన ఆయన వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్ కారణంగా రెండేళ్ల తర్వాత స్వామి వారిని దర్శించుకున్నానని చెప్పారు. ఈ ఏడాది కరోనా అంతమై ప్రపంచంలో ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. తాను నటించిన ‘బంగార్రాజు’ చిత్రాన్ని కరోనా సమయంలోనూ ఆదరిస్తున్న ప్రేక్షకులకు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు.