కృత్రిమ ఎరువులు, పురుగుల మందులు వాడకుండా వ్యవసాయం చేయడం మంచిదనే అభిప్రాయం క్రమంగా బలపడుతున్న రోజులివి. రకరకాల పేర్లతో ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులు క్రమంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. అందులో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ (జడ్బీఎన్ఎఫ్) ముఖ్యమైంది. విఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత పాలేకర్ సుభాష్ పాలేకర్ ఈ విధాన రూపకర్త. 1990లలో ఆయన దీన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. జీవేతర పదార్థాల వినియోగం అనేది ఏ మాత్రం లేకుండా చేసే వ్యవసాయమే జడ్బీఎన్ఎఫ్. ఇందులో జీవేతరం అనేది ఏ మాత్రం లేకపోవడాన్ని బట్టే దీనికి జీరో బడ్జెట్ అనే పేరు వచ్చింది.
భూసారం హరించుకుపోవడానికి, కాలుష్యానికి కారణమైన హరిత విప్లవానికి ప్రత్యామ్నాయంగా ఆయన ఈ పద్ధతిని ప్రతిపాదించారు. వానపాముల వంటి సహజ వ్యవసాయ మిత్ర పురుగులు, కీటకాలతోపాటుగా గో మయం, గో మూత్రం వంటివి వాడటం దీని ప్రత్యేకత. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ విధానాన్ని బలంగా సమర్థించడం తెలిసిందే.
ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ప్రదేశ్లో ఊపిరి పోసుకున్న ఈ విధానాన్ని ముందుగా కర్ణాటక రాష్ట్రం ప్రయోగాత్మకంగా చేపట్టింది. ఆ రాష్ట్రంలోని వివిధ రకాల వ్యావసాయిక-పర్యావరణ మండలాల్లో దీన్ని ప్రవేశపెట్టారు. తర్వాత కేరళ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ర్టాలు అనుసరించాయి. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడని కారణంగా వ్యవసాయ బడ్జెట్.. అంటే అదనంగా పెట్టే ఖర్చు తగ్గిపోతుంది. కానీ దాంతో పాటే దిగుబడి కూడా తగ్గిపోవడం ఈ విధానంలో ప్రధాన సమస్య. ఈ కారణంగానే దేశంలోని పలు ప్రాంతాల్లో దీన్ని అమలుచేసిన రైతులు తిరిగి పాత విధానానికే మళ్లారు. దీంతో పాలేకర్ విధానం ప్రభావశీలతపై పలు ప్రశ్నలు ముందుకువచ్చాయి.
ఇదే అంశంపై తాజాగా వెలువడిన ఓ అధ్యయన పత్రం సైతం, దేశానికి పూర్తిస్థాయిలో జడ్బీఎన్ఎఫ్ లేదా సహజ వ్యవసాయ విధానానికి ఉన్నపళంగా మళ్లడం అంత శ్రేయస్కరం కాదని కేంద్రానికి సూచించడం గమనార్హం. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (నాబార్డ్) భారతీయ అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధనా మండలి (ఇక్రీయర్) సంయుక్తంగా ఈ అధ్యయన నివేదికను ప్రచురించాయి. దేశీయ వ్యవసాయంలో జడ్బీఎన్ఎఫ్ వంద శాతం అమలుచేస్తే జాతీయ ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని నివేదిక హెచ్చరించింది. ఈ నూతన వ్యవసాయ విధానంపై జరిగిన రెండు ప్రధాన అధ్యయన ఫలితాల మధ్య తీవ్రమైన అంతరం ఉండటాన్ని నివేదిక ఎత్తిచూపింది.
పాలేకర్ సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలో పలుచోట్ల జడ్బీఎన్ఎఫ్ వ్యవసాయాన్ని చేపట్టిన రైతులు దానిని వదిలేసి పాత పద్ధతులకు మళ్లడం గమనార్హం. ఈ నేపథ్యంలో దీర్ఘకాలికంగా మరింత లోతైన పరిశోధనలు చేపట్టాలని సదరు నివేదిక సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్బీఎన్ఎఫ్ విధానం అమలు వల్ల ఖర్చు తగ్గిందనీ, అదే సమయంలో దిగుబడి కూడా పెరిగిందని సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) సంస్థ తన అధ్యయనంలో తేల్చింది. మరోవైపు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ జరిపిన అధ్యయనం జడ్బీఎన్ఎఫ్ వల్ల ఖర్చు తగ్గినప్పటికీ దిగుబడి మూడోవంతు నుంచి యాభై శాతానికి పైగా తగ్గిందని ఎత్తిచూపింది. దిగుబడి తగ్గితే ధర పెంచాల్సి వస్తుంది. కానీ వ్యవసాయ దిగుబడులకు అధిక ధర అనేది లభించడం కష్టసాధ్యమైన విషయమని చెప్పక తప్పదు.
ఒకవేళ లభించినా అది సామాన్య ప్రజలు వాడే ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ఇక్కడ ఇంకో సమస్య ఏమంటే జడ్బీఎన్ఎఫ్ విధానంలో ఉపయోగించే రకరకాల మిశ్రమ ద్రావకాల దీర్ఘకాలిక పర్యావరణ ప్రభావాలేమిటో ఇంకా వెల్లడి కాలేదు. పెద్ద ఎత్తున ఈ తరహా సహజ ఎరువుల తయారీ, సరఫరా సాధ్యాసాధ్యాలపై కూడా ఆలోచించాలి. సహజ వ్యవసాయ విధానం శ్రీలంకలో ప్రతికూల ఫలితాలివ్వడాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. జడ్బీఎన్ఎఫ్ వ్యవసాయం కారణంగా భారత్ పొరుగునున్న ఆ ద్వీపదేశంలో ఆహార సంక్షోభం ఏర్పడటం తెలిసిందే. ఈ అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఒక్కుమ్మడిగా దేశవ్యాప్తంగా సహజ వ్యవసాయ విధానానికి మళ్లేముందు అన్ని అంశాలను కూలంకషంగా పరిశీలించడమే అవశ్యం, అనివార్యం.