ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం
యుద్ధంలో గెలుపోటములు ఉండవు. ఇరుపక్షాలు భారీగా నష్టపోతాయి. యుద్ధానంతర పరిణామాలను ఊహించలేం. సైనికులతో పాటు ఇరుపక్షాలకు చెందిన వేల మంది అమాయకులు మరణిస్తారు. తాజాగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ పోరులో ఇప్పటికే వేల మంది అసువులుబాశారు. ఎందరో చిన్నారులు అనాథలుగా మారారు. ఒక్క ఇజ్రాయెల్-హమాస్ పోరులోనే 22 వేల మందికిపైగా మృతిచెందారు. మరి వారి పిల్లల పరిస్థితేంటి?
యూనిసెఫ్ ప్రకారం.. యుద్ధాలు, వ్యాధులు, పేదరికం, కరువు, ప్రకృతి విపత్తులు తదితర కారణాల వల్ల తమ తల్లిదండ్రులను కోల్పోయిన 18 ఏండ్లలోపు పిల్లలను అనాథలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15.3 కోట్ల మంది అనాథలు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి. యుద్ధాల కారణంగా అనాథలుగా మారుతున్న చిన్నారుల సంక్షేమం కోసం ఏటా జనవరి 6న ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ఫ్రాన్స్కు చెందిన ఎస్ఓఎస్ ఎన్ఫాంట్స్ ఎన్ డిట్రెసెస్ సంస్థ దీన్ని ప్రతిపాదించింది.
యుద్ధాల కారణంగా అనాథలుగా మారుతున్న చిన్నారుల గురించి రెండో ప్రపంచ యుద్ధానంతరం అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం వల్ల ఒక్క పోలెండ్లోనే 3 లక్షల మంది, యుగోస్లేవియాలో 2 లక్షల మంది అనాథలయ్యారు. ఇజ్రాయెల్ హమాస్ పోరులో 9 వేలమందికిపైగా చిన్నారులు మరణించడం బాధాకరం. ఇంకా ఎన్ని ప్రాణాలు గాల్లో కలవాలో? ఈ యుద్ధం ఆగేదెన్నడో? ఈ మారణహోమాన్ని నివారించేందుకు అన్ని దేశాలు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. అనాథల సంక్షేమం కోసం అంతర్జాతీయ, స్వచ్ఛంద సంస్థలు, ప్రపంచ దేశాలు చర్యలు చేపట్టాలి. లేకపోతే ఇటువంటి అనాథలే భవిష్యత్తులో సంఘ విద్రోహ శక్తులుగా మారతారు. ‘కుటుంబం లేని పిల్లలు ప్రపంచంలోనే అత్యంత హాని కలిగించే వ్యక్తులు’ అని రచయిత బ్రూక్ రాండోల్ఫ్ గతంలో హెచ్చరించిన విషయం విదితమే. ఆధిపత్యం, మతోన్మాదం, జాతి, లింగ, భాషా, ప్రాంతం తదితర కారణాల వల్ల దేశాల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. వాటి వల్ల అనేకమంది అనాథలుగా మారుతూనే ఉన్నారు. పైన పేర్కొన్నట్టు.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 15.3 కోట్ల మంది అనాథలున్నారు. వీరిలో అత్యధికంగా ఆసియాలో 7.1 కోట్లు, ఆఫ్రికాలో 5.9 కోట్లు, లాటిన్ అమెరికా, కరీబియన్ దీవుల్లో కలిపి 90 లక్షల మంది అనాథలున్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.
పేదరికం, ఉపాధి లేకపోవడం, నిరక్షరాస్యత, కుల, మత, ప్రాంతీయ, లింగ అసమానతల కారణంగా మన దేశంలోనూ లక్షల మంది అనాథలవుతున్నారు. ప్రస్తుతం భారత్లో సుమారు 3 కోట్ల మంది అనాథలున్నట్టు తెలుస్తున్నది. వీరిలో ఎక్కువ మంది అక్రమ రవాణాకు గురవుతున్నారు. కొందరు భిక్షాటన చేస్తుండగా.. మరికొందరు దొంగలుగా మారుతున్నారు. విద్య అందకపోవడం, అనారోగ్యం, పోషకాహార లోపం, వసతుల్లేకపోవటం వంటి సమస్యలతో వారు బాధపడుతున్నారు.
అనాథల సంక్షేమం కోసం ప్రతి దేశం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి. ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపాలి. విద్య అందరికీ అందేలా చూడాలి. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా ప్రపంచ దేశాలు పాలన సాగించి, అనాథలను మంచి పౌరులుగా తీర్చిదిద్దినప్పుడే ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవానికి అర్థం, పరమార్థం ఉంటుంది.
– ఐ.ప్రసాదరావు 63056 82733