నూతన పార్లమెంటు భవనంలో సభా కార్యకలాపాల ప్రారంభోత్సవ వేడుక అట్టహాసంగా ప్రధాని మోదీ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన జరగటం చూశాం. ఈ భవనానికి భూమి పూజ, భవనాన్ని జాతికి అంకితం చేయటం, ఆ తదుపరి లాంఛనంగా సమావేశాలు నిర్వహించడం వరకు జరిగిన ఏ వేడుకలోనూ రాష్ట్రపతి ప్రస్తావన లేకపోవటం చూశాం. ఈ వ్యవహారం వివాదమైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇదే వేదిక మీద మనం గతంలో కూడా చర్చించుకున్నాం. పాత భవనానికి వీడ్కోలు పలుకుతూ సెంట్రల్ హాల్లో రెండు సభలు కలవటం, ఆ సమావేశంలో ప్రధాని, ఇతర నేతలు ప్రసంగించటం చూశాం. రాష్ట్రపతి లేకుండా ఇరు సభలు సమావేశమవటం మన పార్లమెంటరీ సంప్రదాయం కాదు; విదేశీ ప్రధానమంత్రులు పార్లమెంటు సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తే తప్ప. పార్లమెంటు ప్రాంగణంలో ప్రధానమంత్రికి ప్రత్యేక హోదా ఏమీ లేనప్పటికీ, నూతన భవన వేడుకలన్నీ ఆయన చేతుల మీదుగానే జరిగాయి.
New Parliament house | సనాతన ధర్మానికి వారసులం అని చెప్పుకొనేవారు, పార్లమెంటు సాంప్రదాయాలను ఉల్లంఘించటం ఎలా అర్థం చేసుకోవాలి? కనీసం నూతన భవనంలో పార్లమెంటు కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంలో రాష్ట్రపతి ప్రసంగంతో మొదలైతే రాష్ట్రపతి పదవికి సముచిత గౌరవం దక్కేదని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజ్యాంగం మనకు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్దేశిస్తే, అది ఏ విధంగా ప్రధానమంత్రిత్వ వ్యవస్థగా అవతరించిందీ ఈ వేదికలో చర్చించుకున్నాం. పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధానమంత్రికి ప్రత్యేక హోదా ఏమీ లేదు. వ్యవస్థ అంతా ఒక వ్యక్తి చుట్టూ తిరిగే ఈ ధోరణి రాజ్యాంగ సంస్థల మీద జరుగుతున్న దాడిగా పరిగణించాలి. ఈ సమావేశాల్లోనే ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామక ప్రక్రియలో మార్పులు చేసే బిల్లును ప్రవేశపెడుతున్నారు. ఇకనుంచి ప్రధాని ఎవరిని ఇష్టపడితే వారే కేంద్ర ఎన్నికల సంఘం అధిపతి అవుతారు. ఈ మార్పు భవిష్యత్తులో ఎటువంటి విపత్కర పరిణామాలకు దారితీస్తుందో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
స్వాతంత్య్రం వచ్చాక మొట్టమొదటిసారి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉండటం గమనార్హం. అది కూడా పాలక పక్షానికి సభలో తగినంత సంఖ్యాబలం ఉండి కూడా! నూతన భవనంలోకి అడుగిడిగిన శుభదినాన నూతన భావాలతో ఆలోచించాలి. లేకపోతే కొత్త సీసాలో పాత పానీయం లాగే ఉంటుంది ఒక జాతిగా మనం సాగించే పయనం. నూతన భవనంలోకి అడుగుపెట్టిన సందర్భంలో ఇప్పటిదాకా అద్దె ఇంట్లో ఇబ్బందులు పడి కొత్తగా ఇల్లు కట్టుకున్నవాళ్లు అనుభవించే ఉత్సాహాన్ని మనం వినాయక చవితి పండుగ రోజు పార్లమెంటు ప్రాంగణంలో చూశాం.
ఒక భవనం నుంచి పక్కనే ఉన్న మరో భవనంలోకి నడిచి వెళ్లటానికి ఇంత హంగామా అవసరమా అన్న ప్రశ్న మేధావులను వేధిస్తున్నది. సర్వ సామాన్యమైన విషయానికి సెంటిమెంటల్ సెన్సేషన్ను సృష్టించటంలో మన ప్రధానికి ఉన్న ప్రావీణ్యం తెలిసిన విషయమే! కానీ, దేశ ప్రజలు ఈ ఉత్సాహాన్ని ఏ కారణంగా పంచుకుంటారు? భూమి పూజలు, భవన ప్రారంభోత్సవాలు, గృహప్రవేశాలు గట్రా అన్నీ కూడా అనుత్పాదక అంశాలు. పరిపాలన ద్వారా సాధించిన ప్రగతి ఇదీ అని ఇదమిద్దంగా చెప్పుకోలేనప్పుడే అనుత్పాదక అంశాల మీద ఎక్కువ దృష్టిపెట్టి, అతి సామాన్య విషయానికి కూడా అతిగా హంగామా చేస్తారు మన నేతలు.
ప్రజలు ఒక జాతిగా సంబురాలు చేసుకోవటానికి బలమైన కారణం ఏముంది? దేశ పరిస్థితిలో, ప్రజల జీవితాల్లో ఏం మార్పు వచ్చింది మనం ఒక కొత్త పార్లమెంటు భవనం నిర్మించుకున్నంత మాత్రాన? బిల్డింగులు కట్టడం సరే, వ్యవస్థలను బలోపేతం చేయాలి కదా? బలమైన వ్యవస్థలుంటేనే కదా ప్రజల అవస్థలు తీరేది. పటిమగల వ్యవస్థలతోనే సుపరిపాలన జరగాలి, ప్రజల జీవితాల్లో వెలుగులు చిమ్మాలి. అదే పార్లమెంటుకు, ప్రజాస్వామ్యానికీ నిజమైన పండుగ రోజు. ఇల్లు అలకగానే పండుగ కాదు కదా, భవనం కొత్తదైనా భావాలు పాతవే కదా? అందువల్ల కొత్త భవనం కట్టినంత మాత్రాన దేశానికి ఒనగూడిన ప్రయోజనమేంటి? ఇది వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకునే కవాతు. ఏం మార్పు వస్తుంది ప్రజల స్థితిగతుల్లో? నిత్యావసర సరుకుల ధరలు ఏమైనా తగ్గించగలిగామా? ఇటీవలే టమాటో ధర కిలో 200 పలికినప్పుడు సామాన్య మనిషి విలవిల్లాడాడు. ఇప్పుడు కిలో 20 రూపాయలు కూడా లేక రైతు విలవిల్లాడుతున్నాడు. ఈ విషయంలో ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఎక్కడున్నది సమస్య? ఎందుకని నిత్యావసరాల ధరలను అరికట్టలేకపోతున్నాం? రెండేండ్ల కిందట నెలకు ఐదు వేలు సరిపోయిన కుటుంబానికి నేడు పదివేలు సరిపోవడం లేదు ఇల్లు గడవటానికి! కాకపోతే డిజిటల్ చెల్లింపుల పుణ్యమాని సగటు మనిషికి అంతగా తెలియటం లేదు ధరల తీవ్రత. నగదు చెల్లించినప్పుడు పరిస్థితి వేరు. డిజిటల్ చెల్లింపులు బాగా అలవాటైపోయాయి సగటు మనిషికి.
మన ఆర్థిక విధానాలతో విదేశీ పెట్టుబడులు ఆకర్షించగలిగామా? పరిశ్రమలు స్థాపించామా? ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగైనవా? విద్య, వైద్యం వంటి విషయాల్లో మెరుగైన సేవలను అందించగలిగామా? ఇవే ప్రజల జీవితాలను తాకే విషయాలు. ప్రజలు మెరుగైన జీవితాన్ని పొందినప్పుడే ఒక జాతిగా ఐకమత్యాన్ని సాధిస్తాం, ప్రగతిపథంలో పయనిస్తాం. ప్రజల కనీస అవసరాలు తీరకపోతే, కులం, మతం, ప్రాంతం, అనే విభజించే అంశాల మీదికి దృష్టి మరలుతుంది. ఆ ధోరణిని అరికట్టాలంటే మనం అనేక విషయాల్లో నూతనంగా ఆలోచించి, సంస్కరణలు చేపట్టాలి. అప్పుడే నూతన పార్లమెంటు భవనం సార్థకమవుతుంది. సాంఘిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు, పాలనా సంస్కరణలు, ఎన్నికల సంస్కరణలు, న్యాయవ్యవస్థ సంస్కరణలు, రాజ్యాంగ సంస్కరణలు చేపట్టాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలకు ఒక పవిత్రత ఉంది. చట్టసభల్లో జరిగే చర్చల్లో ప్రజల ఆశలు, ఆశయాలు, భయాలూ, ఆందోళనలు కూడా ప్రతిబింబించాలి. ప్రభుత్వ దృష్టిని ఈ విషయాల మీదికి మరల్చాలి. ప్రభుత్వ విధానాలు ప్రజల ఆశయాలకు ఆకాంక్షలకు తగువిధంగా ఉండేలా సభ్యులు చూడాలి. ఇది జరగాలంటే సంస్కరణలు కావాలి.
చట్టసభ అంటే ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీ చేసే ఒక పవిత్ర వేదిక. ఇక్కడ ప్రజాప్రతినిధులు నిర్భయంగా పార్టీలకతీతంగా ప్రజల పక్షాన నిలవాలి. ప్రజాస్వామ్యంలో చట్టసభలు, కార్యనిర్వాహక శాఖ, న్యాయవ్యవస్థ అనే మూడు విభాగాలకు రాజ్యాంగం నిర్దిష్టమైన అధికారాలు, బాధ్యతలు నిర్ణయించింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం పార్లమెంటు నుంచే ఏర్పడినా కూడా, ప్రభుత్వాన్ని నియంత్రించటం పార్లమెంటు కీలక బాధ్యతల్లో ఒకటి. అందుకు, సభ్యులకు ప్రశ్న అనేది ఒక ఆయుధం, బడ్జెట్ను ఆమోదించటం ఒక ఆయుధం, చట్టాన్ని ఆమోదించడం ఒక ఆయుధం. ఇవన్నీ ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీ చేయటానికి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు. కానీ ప్రజాప్రతినిధులు రాజ్యాంగం ప్రసాదించిన అధికారాలను వాడుకోటానికి అవరోధాలున్నాయి. దాన్నే పార్టీ క్రమశిక్షణ అంటారు. అది ఉల్లంఘిస్తే వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ రాదనే మీమాంస అందరిలో ఉంటుంది. అంటే చట్టసభలు రాజకీయపార్టీల గుప్పెట్లో బందీలవటం కాదనలేని సత్యం.
ఇక్కడ రాజకీయ సంస్కరణ అవసరమున్నది. ఒక వ్యక్తి ఏ సభలోనూ రెండు పర్యాయాలు మించి సభ్యులుగా ఉం డరాదు. కనీసం రెండో పర్యాయమైనా సభ్యులు ఏ మీ మాంస లేకుండా పార్టీ నియమావళి అనే అవాంతరాన్ని అధిగమించి వారి మనస్సాక్షి ప్రకారం వ్యవహరించగలరు. తద్వారా నిర్భయంగా ప్రజల పక్షాన ఉండగలరు. ఇప్పుడున్న వ్యవస్థలో ఒకే వ్యక్తి ఎన్నో పర్యాయాలు ఒక నియోజకవర్గంలో మర్రిచెట్టులా పాతుకుపోయి ఇతరులకు అవకాశాల్లేకుండా చేస్తున్నారు. ఒక్క వ్యక్తి ఏడెనిమిది సార్లు ఎన్నికవుతున్నారు. ఇదెలా సమంజసం? పనిచేసే శక్తి ఉన్నా కూడా ఉద్యోగులను 60 ఏండ్లకు ఇంటికి పంపుతున్నారు. నాయకులకు కూడా ఒక పరిమితి అంటూ ఉండాలి కదా.
నూతన పార్లమెంటు భవనంలో కార్యకలాపాలు మొదలుపెట్టిన తొలిరోజే చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును చేపట్టడం, తదుపరి బిల్లును పార్లమెంటు ఆమోదించటం నిజంగా చారిత్రక పరిణామం. ఇది మహిళలు ఎన్నో ఏండ్లు ఎంతో ఆశగా ఎదురుచూసిన అంశం. ఇన్నాళ్లకు వారి కల నెరవేరటం హర్షించదగిన విషయం. అయితే సెన్సస్తో ముడి పెట్టకుండా 2024లో జరిగే ఎన్నికలకే ఈ చట్టాన్ని అమలుచేయాలన్న మహిళల సమంజసమైన కోరిక నెరవేరలేదు. 2023లో చేసిన చట్టం అమలుకు మరో ఆరేండ్లు నిరీక్షించటం నీరసం కలిగించే విషయమే. ఒక నియోజకవర్గాన్ని శాశ్వతంగా మహిళలకు రిజర్వ్ చేయటం కన్నా కూడా ప్రతి ఐదు లేక పదేండ్లకు మహిళా నియోజకవర్గాలను మార్చాలి. అప్పుడు ఎక్కువ మందికి అవకాశం దక్కుతుంది. రాజకీయ సంస్కరణలు ఇంతటితో ఆగకూడదు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక సింబాలిజంగా మిగిలిపోకూడదు. ఎన్నికల ఖర్చును నియంత్రించటం అత్యవసరం. నేడు సామాన్య మనిషి ఊహించలేనంతగా ఉన్నది ఎన్నికల వ్యయం. ఈ పరిస్థితిలో ఎంతమంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేయగలరనేది పెద్ద ప్రశ్న. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది.
న్యాయదేవత సంస్కరణల కోసం నిరీక్షిస్తున్నది ఎన్నో ఏండ్లుగా. కక్షిదారు కోర్టు మెట్లెక్కితే కేసు ఎప్పటికి తేలుతుందో తీర్పు ఎప్పుడు వస్తుందో ఎవరూ చెప్పలేరు. ఇది మారాలి. సామాన్య మనిషికి న్యాయం అందుబాటులో ఉండాలి. న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలి. తద్వారా కోర్టును జవాబుదారీ చేయాలి. ఇందుకు ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వం మీద ఒత్తిడి రావాలి. మీడియా కూడా ఈ అంశం మీద ప్రజల్లో చైతన్యం కలిగించాలి. కోర్టు పట్ల గౌరవం పనితీరు ఆధారంగా ఉండాలి కానీ కంటెంప్ట్ ఆధారంగా కాదు. ప్రతి కేసుకు ప్రతి వాయిదాకు కాలపరిమితి ఉండాలి. అప్పుడే సత్వర న్యాయం జరుగుతుంది. న్యాయస్థానాలను బాగా పెంచాలి. న్యాయాధికారులను సత్వరం నియమించాలి. తద్వారా ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుంది, న్యాయవాదులకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. దీనిమీద విస్తృత చర్చ జరగాలి. ప్రజల్లో అవగాహన కలిపించాలి. దీనితోపాటు కోర్టుల మీద కేసుల భారం కూడా తగ్గించే చర్యలు చేపట్టాలి.
ప్రజలు భయపడినట్టు ఈ సమావేశాల్లో జమిలి ఎన్నికలు, ఉమ్మడి పౌరస్మృతి, భారత శిక్షా స్మృతి, దేశం పేరు మార్పు అనే అంశాలు నిన్నటివరకు తెరమీదికి రాలేదు. నేటితో ఐదురోజుల ప్రత్యేక సమావేశాలు ముగుస్తాయి. ఈరోజు అనూహ్యమైన నిర్ణయాలు లేకపోతే ఈ ఐదురోజుల సమావేశాలు సాఫీగా ముగిసినట్టే! మరి. ఈ కోవింద్ కమిటీని హడావుడిగా ఎందుకు ఏర్పాటు చేశారో! కమిటీలో కీలక సభ్యుడొకరు, కొత్త పెళ్లికొడుకు, హరీష్ సాల్వే విదేశీ విహారయాత్రలో ఉన్నారు. ఆయన స్వదేశం రావాలి, కమిటీ సమావేశాల్లో పాల్గొనాలి. అంటే, ఈ కమిటీ పని ఇప్పట్లో ముగియకపోవచ్చు. వివాదాస్పద అంశాలను ఈ సమావేశాల్లో హడావుడిగా చేపట్టనందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి.
ఈ ప్రత్యేక సమావేశాల్లో మొదటిరోజు 75 వసంతాల పార్లమెంటరీ యాత్ర అనుభవాలు అన్న దానిమీద చర్చ జరగాల్సి ఉంది. అయితే లోతైన చర్చ జరిగినట్టు లేదు. నూతన పార్లమెంటు భవనంలో నూతనంగా ఆలోచించాలి. దీనికి రాజకీయపార్టీలు అనువైన వాతావరణాన్ని కలిగించాలి. సభ్యులు నిర్భయంగా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే స్వేచ్ఛాయుత వాతావరణం చట్టసభల్లో ఉండాలి. అప్పుడే చట్టసభలు ప్రజల ఆశలు, ఆకాంక్షలు ప్రతిబింబించే వేదికవుతాయి. అది జరిగినప్పుడే పార్లమెంటుకు, ప్రజాస్వామ్యానికి నిజమైన వేడుక. ఆ రోజు ఎప్పుడు వస్తుందో కదా?
– గుమ్మడిదల రంగారావు