అయోధ్య వివాదం నేపథ్యంలో.. దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా, ప్రార్థనాస్థలాల యథాతథస్థితిని కాపాడేలా 1991లో నాటి కేంద్ర ప్రభుత్వం ‘ప్రార్థన స్థలాల (ప్రత్యేక నిబంధనల)-1991 చట్టం’ తీసుకొచ్చింది. దీనినుంచి అయోధ్యకు మినహాయింపునిచ్చింది. ప్రస్తుత ‘కాశీ విశ్వనాథ ఆలయం-జ్ఞానవాపి మసీదు వివాదం’ నేపథ్యంలో ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక వ్యాజ్యం దాఖలైంది. చట్టంలోని అంశాలు హిందువులు తదితరులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని పిటిషన్దారు స్వామి జితేంద్రానంద్ సరస్వతి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చట్టంతోపాటు, సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు..
1991 నాటి ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనల) చట్టం ప్రకారం.. 1947 ఆగస్టు 15 నాటికి ఉనికిలో ఉన్న ఏ ప్రార్థనా స్థలాన్ని మార్చకూడదు. ఆ ప్రార్థనా స్థలం మత స్వభావాన్ని కాపాడే ఏర్పాటుచేయాలి. ఏదైనా ప్రార్థనా స్థలాన్ని మరో మతానికి చెందిన స్థలంగా లేదా అదే మతంలోని మరో శాఖకు చెందిన స్థలంగా మార్చడాన్ని ఈ చట్టంలోని సెక్షన్-3 నిషేధిస్తున్నది.
1947 ఆగస్టు 15 నాటికి ఏదైనా మత స్థలం ఏ లక్షణాన్ని కలిగి ఉన్నదో అదేవిధంగా కొనసాగాలని సెక్షన్-4 (1) నిర్దేశిస్తున్నది. ప్రార్థనా స్థలాల మత లక్షణాన్ని మార్చడానికి ఉద్దేశించిన ఏ కేసు అయినా, న్యాయ విచారణ అయినా 1947 ఆగస్టు 15 నాటికి పెండింగ్లో ఉన్నట్టయితే, దాన్ని పరిష్కరించాలనీ, కొత్త కేసులు వేయకూడదనీ, విచారణలు చేపట్టకూడదని సెక్షన్-4 (2) నిర్దేశిస్తున్నది. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసుకు సంబంధించిన కేసు, అప్పీలు, విచారణలకు ఈ చట్టం వర్తించదని సెక్షన్- 5 నిర్దేశిస్తున్నది.
ఏ పరిస్థితుల్లో 1991 చట్టం వచ్చింది? కేంద్ర ప్రభుత్వం దానికి ఎలా న్యాయం చేసింది?
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1991లో ఈ చట్టం వచ్చింది. అప్పుడు రామ జన్మభూమి ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నది. ఎల్కే అద్వానీ రథయాత్ర, బీహార్లో అతని అరెస్టు, యూపీలో కరసేవకులపై జరిగిన కాల్పులు దేశవ్యాప్తంగా మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీశాయి.
ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతూ నాటి హోంమంత్రి ఎస్బీ చవాన్.. ‘దేశంలో రోజుకో రూపం లో వివాదాలూ, మత ఉద్రిక్తతలు చెలరేగుతున్న స్థితిలో ఈ బిల్లును ఒక అనివార్య నివారణ చర్యగా ముందుకు తెస్తున్నాం. భవిష్యత్తులో పవిత్ర స్థలాల పేరుతో మరే ఇతర వివాదాలు సృష్టించకుండా ఈ బిల్లు నిలువరిస్తుంది’ అని అన్నారు.
అప్పుడు బీజేపీ ఈ బిల్లు గురించి ఏమన్నది? అలాగే ‘కాశీ విశ్వనాథ్ దేవాలయం-జ్ఞానవాపి మసీదు’ వివాదం పై బీజేపీ స్పందన ఏమిటి?
నాడు ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ బిల్లును వ్యతిరేకించింది. ఈ సందర్భంగా ‘ప్రార్థనా స్థలాలకు 1947 నాటి యథాతథస్థితిని కొనసాగించటమంటే కండ్లుమూసుకొని పావురం పిల్లికి ఎదురుగా పోవటం లాంటిదే’ అని బీజేపీ ఎంపీ ఉమాభారతి అన్నారు. ఈ చట్టంతో ‘ఈ ఉద్రిక్తతలను వచ్చేతరాలకు భద్రపర్చటమే’నని చెప్పారు. ‘కాశీ విశ్వనాథ్ దేవాలయం-జ్ఞానవాపి మసీదు’ వివాదాన్ని ప్రస్తావించారు. ‘చరిత్రలో తమ దుస్థితి ఏమిటో హిందువులు తెలుసుకోవాలని, అలాగే భవిష్యత్ తరాల ముస్లింలకు తమ శక్తిని, ఘనతను గుర్తు చేసేందుకే ఔరంగజేబు.. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసి వాటి శిథిలాలను వదిలిపెట్టాడు’ అని ఉమాభారతి అన్నారు.
అయోధ్య ఉద్యమం సాగుతున్న సందర్భంలోనే వీహెచ్పీ-బీజేపీ తరచుగా వారణాసి, మథురలను కూడా విముక్తి చేస్తామని ప్రకటించేవారు. అప్పుడొక నినాదం అంతటా వినిపించేది. ‘అయోధ్య తొ బస్ ఝాంకీ హై- కాశీ మథుర బాకీ హై’ (అయోధ్య ప్రివ్యూ మాత్రమే. ఇక కాశీ, మథుర మిగిలి ఉన్నాయి).
అయోధ్య అంశంపై.. వివాదాస్పద భూమి హిందువులకు చెందుతుందని 2019లో సుప్రీంకోర్టు తుది తీర్పునిచ్చింది. అప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక ప్రకటన జారీ చేస్తూ.. వారణాసి, మథురపై జరిగే ఉద్యమాలకు తాము దూరంగా ఉంటామని తెలిపింది. అయోధ్యకు మాత్రమే మినహాయింపు ఇచ్చామని పేర్కొంది. ఆర్ఎస్ఎస్ అధిపతి మోహన్ భగవత్ను మీడియా వివరణ అడిగినప్పుడు.. ‘సంఘ్ ఏ ఉద్యమంతోనూ అనుసంధానమై లేదు. మానవాభివృద్ధికి మాత్రమే కట్టుబడి ఉన్నది. చారిత్రక అంశంగా మాత్రమే రామజన్మభూమి విషయంలో ఆర్ఎస్ఎస్ భాగస్వామ్యమైంది. ఇది ఒక ప్రత్యేక సందర్భం. ఇప్పుడు మేం మానవాభివృద్ధి కోసమే పునరంకితమవుతాం. ఇక ఇతర ఉద్యమాలతో మాకు ఏ సంబంధం లేద’ని స్పష్టం చేశారు.
ప్రార్థనా స్థలాల చట్టం గురించి అయోధ్య వివాదంపై తీర్పులో సుప్రీంకోర్టు ఏమన్నది?
1947 ఆగస్టు 15 నాటికే ఉన్న ప్రార్థనా స్థలాల మత లక్షణాలను కాపాడటానికి తీర్పు హామీ ఇచ్చింది. ప్రార్థనా స్థలాలను మార్చడాన్ని నిరోధించడం ద్వారా- ప్రార్థనా స్థలాల పరిరక్షణ జరుగుతుందనీ, వాటి మత లక్షణాలను మార్చ డం జరగదనే నమ్మకాన్ని కలిగించింది.
‘ఈ చట్టం చేయడం ద్వారా రాజ్యం తన రాజ్యాంగ బాధ్యతను నెరవేర్చింది. రాజ్యాంగ మౌలిక లక్షణమైన లౌకికత్వాన్ని, సర్వమత సమభావనను దృఢపరుస్తూ రాజ్యాంగ బాధ్యతను ఆచరణలో పెట్టింది. రాజ్యాంగంలోని లౌకికత్వం పట్ల అపరిమిత నిబద్ధతను ప్రార్థనా స్థలా ల చట్టం శిరోధార్యం చేసింది. రాజ్యాంగ మౌలిక లక్షణమైన భారత లౌకిక రాజకీయ వ్యవస్థను కాపాడటానికి ఈ చట్టం ఒక శాసనపరమైన సాధనం. లౌకిక విలువల లక్షణాన్ని కాపాడటానికి ఈ చట్టం ఒక శాసనపరమైన చొరవ’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.