ప్రేమాభిమానాలకు అతీతంగా జీవించడం కత్తిమీద సాము వంటిదే. అయితే వదలడానికి సాధ్యం కాని ఈ ప్రేమాభిమానాలను ఎలా కలిగి ఉండాలో, ఎలా ప్రదర్శించాలో తెలుసుకుంటే చాలు. తమ కన్నా చిన్నవారిపై, తమతో సమాను లపై చూపే అభిమానాన్ని, ఆదరాన్ని ప్రేమ అని వ్యవహరిస్తారు. తమకన్నా పెద్దవారిపై ఉండే ప్రేమే భక్తి! ప్రేమ ఎల్లప్పుడూ స్వచ్ఛమైనదిగా ఉండాలి. ఇందులో స్వార్థం అనే మురికి చేరకూడదు. ప్రతిఫలాపేక్ష లేకుండానే మన ప్రేమాభిమానాలను ఇతరులకు పంచాలి. స్వార్థంతో చూపే ప్రేమ వ్యాపారం అవుతుంది.
గోపికలకు శ్రీకృష్ణుడిపై ఉన్నది నిజమైన ప్రేమ. రేపల్లెను వదిలి మథురానగరికి వచ్చిన శ్రీకృష్ణుడికి కొంతకాలం తర్వాత ఒకనాడు స్వల్పంగా అనారోగ్యం (తలనొప్పి) ఏర్పడింది. వైద్యులు ఇచ్చిన ఔషధాలతో తలనొప్పి తగ్గలేదు. శ్రీకృష్ణ దర్శనార్థం వచ్చిన నారదుడితో అందరూ చర్చించారు. చివరికి శ్రీకృష్ణుడు ‘నన్ను నిష్కల్మషంగా ప్రేమించే భక్తుల పాదధూళితోనే నాకు ఆరోగ్యం సిద్ధిస్తుంది’ అన్నాడు. శ్రీకృష్ణుడిపై నిండుగా, మెండుగా భక్తి కలవా రిలో ప్రసిద్ధులైన రుక్మిణీదేవి, నారద మహర్షి తదితరులంతా తమ పాదధూళిని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. పూజ్యుడైన శ్రీకృష్ణుడి పాదస్పర్శతోనే కదా మనమం తా క్షేమంగా ఉండగలిగేది, అలాంటి మహనీయుడికి తమ పాదధూళి ఇవ్వడం అంటే ప్రబలమైన పాపం చుట్టుకుంటుందని వారి అభిప్రాయం.
రేపల్లె వాసులైన గోపికలకు ఈ విషయం తెలిసింది. ‘అయ్యో! అంతపెద్ద నగరం మథురలో శ్రీకృష్ణుడిపై భక్తి కలవారే లేరా?’ అని ఆవేదన చెందారు గోపికలు. శ్రీకృష్ణుడి ఆరోగ్యాన్ని కోరుకుంటూ మట్టికుప్పలపై తమ పాదాలను ఉంచుతూ, ఆ పాదధూళిని పోగు చేసి, సంచులలో నింపి మథురా నగరానికి పంపారట. ఇలాంటి గోపికల నిస్వార్థభక్తి దేశకాల వయో లింగ భేదం లేకుండా అందరికీ ఆదర్శప్రాయం.
విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఈ లోకంలో సుప్రతిష్ఠితం చేయడానికి వెయ్యేండ్ల కిందట ఉద్భవించిన జగదాచార్యులు భగవత్ రామానుజాచార్యులు. వారు ప్రధాన మంత్ర, మంత్రార్థాలను గురువు ద్వారా ఉపదేశం పొందడానికి శ్రీరంగం నుంచి కాలినడకన తిరుక్కోట్టియార్ వెళ్లారు. అక్కడ తిరుక్కోట్టియార్ నంబి అనే గురువర్యులను దర్శించి మంత్ర రహస్యాలను ఉపదేశించమని ప్రార్థించారు. కానీ, తిరుక్కోట్టియార్ నంబి వెంటనే మంత్రోపదేశం చేయలేదు. రామానుజులు కొంత కాలం తర్వాత మళ్లీ వెళ్లారు. అలా 18సార్లు వెళ్లాక రామానుజులకు శ్రద్ధాసక్తులు సంపూర్ణంగా ఉన్నాయని విశ్వసించి తిరుక్కోట్టి యార్ నంబి మంత్ర రహస్యాలు ఉపదేశించారు. ‘ఈ విషయాలను యోగ్యత లను బట్టి, ఒకటికి పదిసార్లు పరీక్షించిన తర్వాతే ఆసక్తి కలవారికి ఉపదేశించు. వెంటనే ఎవరికీ తెలియజెప్పకు’ అని గురువు ఆదేశించారు. కానీ, దయార్ద్ర హృదయుడైన రామానుజులు తాను ఉపదేశం పొందిన మంత్రాన్ని పరమ ప్రేమతో ఆ క్షేత్రంలోని దేవాలయ గోపురం ఎక్కి అక్కడి భక్తజన సముదాయాని కి ఉపదేశించారు. ‘నాకు నరకం వచ్చినా సరే, ఇంతమంది మోక్షార్హతను పొందడం కోసం మీ ఆజ్ఞను ధిక్కరించాను’ అని గురువుకు నివేదించి, వారి ఆశీస్సులను, ‘ఎంబెరుమానార్’ (భగవంతునితో సమానంగా అతి విశాలమైన హృదయం కలవారు) అనే బిరుదాన్ని పొందారు. ఏ విధమైన స్వార్థ సంకోచా లు లేకుండా, తరతమభేదాలు లేకుండా అందరూ మోక్షాన్ని పొందాలనే ప్రేమ భావనతో భగవత్ రామానుజులు చేసిన మహోపదేశం తరతరాలకూ ఆచరణ యోగ్యమైనది.
మహర్షులు తాము ప్రతినిత్యం ఆచరించే యజ్ఞ యాగాది వైదిక క్రియల కోసం తెచ్చిన దర్భలను జింకలు తింటున్నా, తమ ఒడిలో కూర్చోబెట్టుకునేవారట. ‘ఆశ్రమాల్లోకి ప్రవేశించిన క్రూరమృగాలు ప్రేమస్వభావం, సాత్తిక జీవన విధానం కలిగిన మహర్షుల తపస్సు ప్రభావంతో హింసా ప్రవృత్తిని వదిలి వైరి జంతువులతో ప్రేమతో సఖ్యతతో ప్రవర్తించేవి’ అని కాళిదాసు మహాకవి రఘువంశ మహాకావ్యంలో ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకంలో వర్ణించాడు. భగవంతుడు, గురువులు, తల్లిదండ్రులు, భక్తులు, సాటి మానవులు, పశు పక్ష్యాదులు, సకల ప్రాణులపై స్వార్థం లేని ప్రేమను కలిగి ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అనే వాస్తవాన్ని గుర్తిద్దాం. ఆచరించేందుకు కృషి చేద్దాం.
– సముద్రాల
శఠగోపాచార్యులు
98483 73067