రామాయణ కథలో ప్రతి పాత్రా మహోన్నతమైనదే! కొన్ని పాత్రలు రామాయణ గమనాన్నే మార్చేశాయి. రాముడికి పట్టాభిషేకం నిర్వహించాలని దశరథుడు అనుకోవడం, అదే సమయంలో మంధర రాక, కైకేయి మనసును వికలం చేయడం ఇవన్నీ కార్యకారణ సంబంధాలు కలిగి ఉన్న ఘట్టాలుగా అనిపిస్తాయి. లక్ష్మణుడి భార్య ఊర్మిళ పాత్ర కూడా వినూత్నంగా కనిపిస్తుంది. రాముడి వెంట అడవికి వెళ్తానంటే భర్తను వారించలేదు. అంతేకాదు, తన భర్త నిద్రాహారాలను తను తీసుకొని.. పద్నాలుగేండ్లు నిద్రావస్థలోనే ఉండిపోయింది. ఆమె చరిత్ర గురించి జానపద గాథలు కోకొల్లలుగా వినిపిస్తాయి. ఊర్మిళను ఆదిశేషుని శక్తిగా పురాణాలు కీర్తిస్తాయి. ఆమె తన భర్త లక్ష్మణుడి నిద్రాహారాలు తీసుకొని, ఆయన చేయబోయే లోకోత్తర కార్యానికి పరోక్షంగా సహకరించింది. అడవిలో సీతారాముల రక్షణ బాధ్యత లక్ష్మణుడు సమర్థవంతంగా నిర్వహించే అవకాశం కల్పించింది.
రావణ సంహారం జరిగిపోయింది. రాముడు సీతాసమేతుడై అయోధ్యకు చేరుకున్నాడు. సుగ్రీవుడు, విభీషణుడు, హనుమ, గుహుడు తదితర మిత్రుల సమక్షంలో, వశిష్ఠాది మహర్షుల ఆధ్వర్యంలో శ్రీరాముడు పట్టాభిషిక్తుడవుతాడు. కొన్నిరోజుల తర్వాత, ఒకనాడు రాముడు సభలో పరివారంతో కొలువుదీరి ఉంటాడు. చర్చోపచర్చల్లో రామరావణ యుద్ధం ప్రస్తావన వస్తుంది. ‘పద్నాలుగేండ్లు నిద్రాహారాల్లేని మనిషి మాత్రమే ఇంద్రజిత్తును చంపగలడని అతనికి వరం ఉన్నది. అందుకే లక్ష్మణుడి చేతిలో హతమయ్యాడు’ అని సభలోని ఒకరు గుర్తుచేశారు. అది విని రాముడు ఆశ్చర్యపడతాడు. అప్పుడు రాముడు లక్ష్మణుడి వంక చూసి, ‘నాయనా! పద్నాలుగేండ్లు నువ్వు క్షణం కూడా నిద్రించలేదని నాకు తెలుసు! నీ నిద్ర అయోధ్యలో అంతఃపురంలో ఉన్న ఊర్మిళ అనుభవించిందని కూడా తెలుసు. కానీ, రోజూ నీకు అందించిన ఆహారాన్ని నువ్వేం చేసేవాడివి?’ అని అడిగాడు. ‘ఆ ఆహారాన్ని చెట్ల తొర్రల్లో దాచేవాడిని’ అని సమాధానం ఇచ్చాడు లక్ష్మణుడు.
లక్ష్మణుడు ఎన్నడూ అసత్యం పలకడు. కానీ, తమ్ముడిని సరదాగా పరీక్షించాలనుకున్నాడు రాముడు. సేవకులను పిలిచి ‘వనవాస కాలంలో తాము విడిది చేసిన ప్రదేశాల్లో, లక్ష్మణుడు చెప్పిన చెట్ల తొర్రల్లో పద్నాలుగేండ్లకు సరిపడా ఆకులున్నాయో? లేవో?’ పరిశీలించమని చెప్పాడు. సేవకులు వెళ్లి ఆయా గుర్తుల ప్రకారం ఆకులను సేకరించారు. మొత్తం లెక్కకు ఏడు ఆకులు తగ్గాయని రాముడికి విన్నవించారు. అప్పుడు రాముడు, లక్ష్మణుడితో ‘ఈ 14 ఏండ్ల కాలానికి ఏడు రోజుల భోజనం మాత్రమే సరిపోయిందన్నమాట!’ అని అడిగాడు. దానికి లక్ష్మణుడు ‘అన్నా! ఆ ఏడు రోజులు మనం ఇద్దరమూ భోజనం చేయలేదు. అందుకే ఆకులు తక్కువగా ఉన్నాయి. మన తండ్రిగారి మరణ వార్త తెలిసిన రోజున ఆహారం తీసుకోలేదు. సీతమ్మ అపహరణం రోజున మనకు తిండి ధ్యాసే లేదు. మైరావణుడు మనల్ని పాతాళానికి ఎత్తుకుపోయిన నాడు ఆహారం తినే అవకాశమే లేదు. ఇంద్రజిత్తు బాణంతో నేను మూర్ఛిల్లిన రోజు నాలుగోది. ఆ మర్నాడు యుద్ధంతోనే గడిచిపోయింది. రావణుడు చనిపోయిన రోజున, ఆ మర్నాడు కూడా మనం ఉపవాసం చేశాం. ఈ ఏడు సందర్భాల్లో నాకు ఆహారం అందలేదు. అందుకే ఏడు ఆకులు తక్కువగా ఉన్నాయి’ అని చెప్పాడు లక్ష్మణుడు.
ఆ మాటలతో లక్ష్మణుడితో పాటు ఊర్మిళ చేసిన త్యాగం శ్రీరాముడి మనసు కరిగించింది. లక్ష్మణుడితో కలిసి అయోధ్యను పరిపాలించమని ఊర్మిళకు వరమిస్తాడు రాముడు. అందుకు నిరాకరించిన ఊర్మిళ ‘ప్రభూ! నీ పాదపద్మాలకు ఎవ్వరేమి సమర్పించినా అది నా చేతిమీదుగా వచ్చేలా వరమిస్తే చాలు’ అని కోరింది. ఆమె కోరిక కలియుగంలో నెరవేరింది. జగన్నాథుడు కొలువుదీరిన పూరి క్షేత్రానికి విమలాదేవి పాలకురాలు. ఆవిడే పూర్వజన్మలో ఊర్మిళ అని చెప్తారు. పూరిలో స్వామివారికి నివేదించే ప్రసాదాలన్నీ ముందుగా విమలాదేవికి నైవేద్యం పెడతారు. తర్వాతే జగన్నాథుడికి సమర్పిస్తారు. మొత్తానికి ఊర్మిళ త్యాగం.. ఇంద్రజిత్తుకు శాపంగా, లక్ష్మణస్వామికి వరంగా మారింది.
– టి.వి.ఫణీంద్రకుమార్