పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు క్రమంగా తగ్గుతున్నది. అన్ని వయసుల మహిళల్లో గర్భధారణ రేటు తగ్గుతున్నది. 2.1కన్నా సంతానోత్పత్తి రేటు ఎక్కువ ఉన్న ఐదు రాష్ర్టాల్లో మహిళల్లో నిరక్షరాస్యత, 18 ఏండ్ల లోపు పెండ్లిళ్లు, గర్భధారణ నివారణ చర్యలు పాటించక పోవటం వంటివి కనిపిస్తున్నాయి. ఈ వివరాలు ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అధ్యయనం’లో వెల్లడయ్యాయి.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్-5) తాజాగా వెల్లడించిన గణాంకాలు.. దేశంలో జనాభా పెరిగిపోతున్నదనే మన రాజకీయ నేతలు చెబుతున్న దాన్ని పూర్వపక్షం చేశాయి. గత కొంత కాలంగా దేశంలో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతున్నది. 2019-21 గణాంకాల ప్రకారం.. గతం లో ఎన్నడూ లేని విధంగా ఒక స్త్రీకి ఇద్దరు పిల్లలుగా కనిష్ఠస్థాయికి సంతానోత్పత్తి పడిపోయింది. నిజానికి సంతానోత్పత్తి రేటు 2.1 ఉంటేనే జనాభా స్థిరంగా ఉంటుంది. మరణాల్ని జననాలు భర్తీ చేస్తాయి. దీన్నే ‘జనాభా భర్తీ రేటు’ అంటారు.
ఈ మధ్యనే ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారు శిక్షార్హులని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రకటన పెద్ద దుమారాన్నే లేపింది. కానీ అక్కడ కూడా సంతానోత్పత్తి రేటు 2.4కు పడిపోయింది. జనాభా భర్తీ మార్కు కన్నా ఎక్కువ సంతానోత్పత్తి రేటు ఉన్న రాష్ర్టాలు కేవలం ఐదు. వీటిలో యూపీ ఒకటి. ఈ నేపథ్యంలోనే దేశంలో జనాభా పెరుగుదల, సంతానోత్పత్తిరేటుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది.
1992-93లో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి రేటు 3.7 ఉంటే, పట్టణాల్లో 2.7గా ఉండేది. గత 30 ఏండ్ల కాలంలో ఈ తేడా 0.5కి పడిపోయింది. 1971లో దేశ గ్రామీణ ప్రాంతాల్లో 5.4గా ఉన్న సంతానోత్పత్తి రేటు కాల క్రమంలో తగ్గుతూ వస్తున్నది. కుటుంబ, ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు జరుగుతున్నా జనాభా రేటు పెరగటం లేదు. బాల్య వివాహాలను, కౌమార దశలో గర్భధారణను అరికట్టడం, కుటుంబ నియంత్రణ పద్ధతులతో గ్రామీణ ప్రాంతాల సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నది.
గర్భధారణకు అవకాశాలు అధికంగా ఉండే 20-24 ఏండ్ల వయస్సునుంచి 25-29 ఏండ్లున్న వారిలో కూడా గర్భధారణ రేటు క్రమంగా తగ్గుతున్నది. ముఖ్యంగా 15-19 ఏండ్ల యువతుల్లో గర్భధారణ ఈ మధ్య కాలంలో చాలావరకు తగ్గిపోయింది. మరో వైపు.. గర్భధారణ సగటు వయస్సు 2011లో 26.5 ఏండ్లు కాగా.. 2018 నాటికి 28.4 ఏండ్లకు పెరిగింది. నగర ప్రాంతాల్లో వివాహాలు ఆలస్యంగా కావటం కూడా సంతానోత్పత్తి గణాంకాల్లో మార్పునకు కారణమవుతున్నది. గ్రామాల్లో సగటున 18.1 ఏండ్లకు వివాహాలు అవుతుంటే, నగరాల్లో 19.8 ఏండ్లకు పెండ్లిళ్లు అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నగరాల్లో 30 ఏండ్లకు పైబడిన వయసులో మహిళలు గర్భం దాల్చటం పెరుగుతున్నది. ఈ కారణాలతోనే నగరాల్లో జననాల రేటు తగ్గుతున్నది.
వెనుకబడిన రాష్ర్టాలుగా చెప్పుకొంటున్న బీహా ర్, మేఘాలయ, యూపీ, జార్ఖండ్, మణిపూర్ లలో మాత్రమే సంతానోత్పత్తి రేటు జనాభా భర్తీ రేటు కన్నా ఎక్కువగా ఉన్నది. చారిత్రకంగా చూసినా ఈ ఐదు రాష్ర్టాల్లో మిగతా దేశంతో పోలిస్తే.. సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉంటున్నది. 2015-16లో మిగతా రాష్ర్టాల్లో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతున్నా, బీహార్లో మాత్రం పెరిగింది. 1992-93లో జాతీయ సగటు 2.8 ఉంటే, బీహార్లో 4.0గా నమోదైంది. జనాభా స్థిరీకరణను సాధించాలంటే.. ప్రజల మౌలిక అవసరాలైన విద్య, ఆరోగ్యం, వైద్యం తదితర అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు పెద్ద ఎత్తున ఖర్చు చేయాలని ఆరోగ్య నిపుణురాలు సంఘమిత్ర సింగ్ అన్నారు. వీరు పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్నారు.
దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గిపోవటానికి అక్షరాస్యత పెరగటం, వివాహ వయస్సు పెరగటం, కుటుంబ నియంత్రణ పాటించటం లాంటి మార్పులన్నీ కారణమయ్యాయి. 2018లో నిరక్షరాస్యులైన మహిళల్లో సంతానోత్పత్తి రేటు 3.0 ఉంటే చదువుకున్న వారిలో 2.1గానే ఉన్నది.
వెనకబడిన రాష్ర్టాలుగా పిలువబడుతున్న ఐదు రాష్ర్టాల్లోనే సంతానోత్పత్తి ఎక్కువగా ఉండటం గమనార్హం. బీహార్, జార్ఖండ్లలో మహిళల అక్షరాస్యతా రేటు కనిష్ఠం. చిన్న వయస్సులోనే వివాహాలు జరుగటం, కుటుంబ నియంత్రణ పాటించే అవకాశాలు తక్కువగా ఉండటం కూడా ఒక కారణం. ఉత్తర ప్రదేశ్ కూడా ఈ మూడు విషయాల్లో వెనకబడే ఉన్నది. మేఘాలయ, మణిపూర్ రాష్ర్టాలు ఈ మూడింటిలో జాతీయ సగటు కన్నా మెరుగ్గా ఉన్నా, కుటుంబ నియంత్రణ విషయంలో వెనుకబడి ఉన్నాయి.
జాతీయ కుటంబ ఆరోగ్య సర్వే అధ్యయనంలో తేలిందే మంటే.. కుటుంబ నియంత్రణ భారమంతా స్త్రీలదే అనే భావన ఈ రాష్ర్టాల్లో ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు కోసం పురుషుల్లో అవగాహన కలిగించాల్సిన అవసరం ఉన్నది.