తెలంగాణ నుంచి ప్రపంచదేశాల దాకా ఎక్కడ ఎవరు చెప్పినా, చెప్పినదాంట్లో విషయం, వరుస క్రమం కుదిరితే అది కథ అవుతుంది. రూపులేని మనిషి ఉండనట్లే, సంవిధానం లేని ‘కథ’ ఉండదు. జీవితంలో జరిగే సంఘటనల మధ్య కార్యకారణ సంబంధం ఉంటుంది. అలాంటి సంబంధం ఒక జీవిత విధానంగా రూపొందుతుంది. జీవితాలను చిత్రించే కథకు కూడా సంవిధానం ఉంటుంది. ఒక్కో జీవిత విధానం ఒక్కోరకంగా ఉన్నట్లే.. కథలకు కూడా అనేక సంవిధానాలుంటాయి. చిత్రించే జీవితాన్ని బట్టే, రాసే విధానం, భాష మారుతుంది. చెప్పే విషయమే చెప్పాల్సిన సంవిధానాన్ని సమకూర్చుకుంటుంది. మొత్తానికి సంవిధానం కలిగిన కథ పాఠకుడిని చేరుతుంది. అలా కానిది పాఠకుణ్ణి ఆకట్టుకోలేదు.
కథకు శైలి, శిల్పం అనేవి రెండు కండ్ల లాంటివి. ఇందులో ఏ ఒక్కటి లోపించినా కథ అవిటిదవుతుంది. పదజాలం, నుడికారం,ప్రతీకలు, రూపకాలు, భాష ఇవన్నింటి సమాహారంగా కనిపించేది శైలి. స్పష్టంగా సరళంగా, సంక్షిప్తంగా ఉన్న వాక్యరచన ఉత్తమ శైలికి నిదర్శనం.పాఠకులను చకితులను చేయడం, అయోమయానికి గురిచేయడం కన్నా అర్థమయ్యేవిధంగా రాయడం మిన్న.
కథకు ముడిసరుకు వస్తువు. దేనిగురించి చెప్పాలనుకుంటున్నామో అది వస్తువు. వస్తువును అందంగా తయారుచేసి పాఠకునికి అందివ్వడం రచయిత బాధ్యత. అందు కు సృజనకారుడికి నైపుణ్యం అవసరం. తెలిసిన సమాచారం రాస్తే వార్త. సమాచారానికి ముందు, వెనకాల జోడించి చెబితే వార్తా కథనం. ఇవేవి కథ అనిపించుకోవు. రాసిన సమాచారంలోని విషయం బుద్ధిని వికసింపజేస్తూ హృదయాన్ని స్పందింపజేస్తూ పాఠకుడిని కదిలించేదిగా ఉంటే ‘కథ’ అవుతుంది. సంఘజీవితం, వ్యక్తిగత జీవితం, ఈ రెండూ పరస్పరం ప్రభావితం చేసుకునే సందర్భాల నుంచి వస్తువు ఉత్పత్తి అవుతుంది. ఆ ముడిసరుకును పుటం పెట్టి ఆభరణంగా మార్చడం కథకుడి పని. రాయబోయే కథకు చెంది న విషయంపై రచయితకు పట్టు, సం పూర్ణ అవగాహన ఉండాలి. విషయం జరిగిన చోటు నుంచి మొదలుపెట్టడం ఒక సులువైన పద్ధతి.
రచయిత ఎక్కడ, ఎలా ప్రారంభిస్తే బాగుంటుందో నిర్ణయించుకోవాలి. కథకుడికి రాస్తున్న జీవితం సుపరిచితమై ఉండాలి. ఎందుకు రాస్తున్నాడో స్పష్టత ఉండాలి. కథ ద్వారా జీవితం ఎలా ఉందో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో చెప్పగలగాలి. అందుకు సమకాలీన అంశాల పట్ల శాస్త్రీయ వైఖరి, అవగాహన ఉండాలి. జీవితం లోతు తెలిసినవాడే కథను చిక్కగా అల్లుతాడు. కథా రచనలో ఊహకు ప్రాధాన్యం ఉంది. ఊహ ఎప్పుడూ వాస్తవిక పరిధుల్లో సాగితేనే కాల్పనిక కథకు జవం, జీవం అందుతాయి. ఇందుకు సామాజిక పరిణామాల పట్ల తగినంత చైతన్యం ఉండాలి.
జీవితం సంఘటనామయం. సంఘటన ఏదో ఒకచోట (స్థలం) ఏదో ఒకపూట (కాలం) జరుగుతుంది. సంఘటనలకు బాధ్యులుగానో, బాధితులుగానో (పాత్రలు) మనుషులుంటారు. వారు అనుభవించిన జీవితాన్ని రాసేక్రమంలో ఘటనల చిత్రణ సులభమవుతుంది. సంఘటనలు అభూత కల్పనలుగా ఉండకూడదు. సంఘటన చుట్టూ అనేకం అల్లుకొని ఉంటాయి. ఏదో ఒక సన్నివేశంలో సంఘటన జరుగుతుంది. అందులోని మనుషులు పాత్రలుగా కథలోకి వస్తారు. వారి మాటల ద్వారా భాష, సంస్కారం బయటపడతాయి. సంఘటనల పర్యవసానం ముగింపునకు దారితీయవచ్చు. జీవితంలో సంఘటనలకు ప్రాముఖ్యం ఉన్నట్లే, కథలో కూడా అధిక ప్రాధాన్యం ఉం టుంది.
రచయిత చెప్పదలచుకొన్న విషయానికి సంబంధించిన సన్నివేశాలను ఎంచుకోవాలి. కథలో వర్ణనలు విషయానికి లోబడి ఉండాలి. కథారంభం ముగింపుల్లో వర్ణనలు ఉపయోగించవచ్చు. వీటితో కథకు బలం చేకూరుతుంది. పాత్రలు, సన్నివేశాల వర్ణన తగినట్లుగా ఉండాలి. స్థల కాలాలు లేని కథ ఉండదు. స్థల నేపథ్యంగా, కాల నేపథ్యంగా కథ రాణిస్తుంది. స్థల కాలాలకతీతంగా జీవి తం ఉండదు. కథ కూడా వాటికి అతీతం కాదు.
పాఠకుడితో రచయిత చేసే సంభాషణే కథనం. పాత్రల మధ్య సంభాషణలు కథను నడిపిస్తాయి. అనవసర సం భాషణలు కథకు హాని చేస్తాయి. సంభాషణల వల్ల కథకు నాటకీయత చేకూరుతుంది. కథలో సంభాషణలు చిన్నగా శకిమంతంగా ఉండాలి. మాటకు భాష ప్రాణం. భాషను తెలిసి వాడాలి. మాటను ఓ శక్తిగా ప్రయోగించాలి. ముగింపు కథ నుంచి పుట్టుకురావాలి. కృతకంగా ఉండకూడదు. కొన్ని కథలు కొసమెరుపుతో ముగుస్తాయి. మెరుపు కథకు అనుసంధానమై ఉంటేనే కథ రాణిస్తుంది. మంచి ముగింపులు మరొక కథకు ప్రారంభాన్నిస్తాయి. ముగింపు నేలవిడిచి సాము చేయకూడదు. ప్రారంభానికి ముగింపునకు సమన్వయం కుదరాలి. ఈ రెండింటి మధ్య గల కొనసాగింపునకు చివరి దశ పరాకాష్ఠ. ముగింపు వల్ల పాఠకుడికి ఒక ఎరుక కలగాలి.
వస్తుశిల్పాల సమన్వయమే కథ. రూపంలేని జీవం, జీవం లేని రూపం రెండూ అవాంఛనీయాలు. చక్కగా అమరిన వస్తుశిల్పాల సమ్మేళనం చెరకు గడలాంటిది. రెండింటిలో ఏ ఒక్కటి లోపించినా అది చొప్పబెండు లాం టిది. వస్తువుతో పాటు శిల్పం కూడా ముఖ్యమే. ఎక్కడ మొదలుపెట్టాలి, ఎక్కడ ముగించాలి, ఎంత చెప్పాలి, ఎవ రి ద్వారా చెప్పించాలి (కథకుడు లేక పాత్ర ద్వారా చెప్పించడం) అనే ప్రశ్నలకు జవాబుగా నిలిచేది శిల్పం.
చెప్పాలనుకున్న విషయాన్ని (వస్తువును) కథగా మలి చే క్రమంలో రచయిత కనబరిచే పనితనమే శిల్పం. పాత్రలకు, సంఘటనలకు, సన్నివేశాలకు క్రమప్రాధాన్యం ఇవ్వడమే శిల్ప రహస్యం. ఎత్తుగడ, కొనసాగింపు, ముగింపు అనే మూడింటిని సమర్థంగా నిర్వహించడం ద్వారా శిల్పం సిద్ధిస్తుంది. విల్లు నుంచి వదిలిన బాణం లక్ష్యాన్ని తాకినట్లు, శిల్పం ద్వారా కథ పాఠకుణ్ణి చేరుతుంది. అప్పుడే పాఠకుడికి ఒక ఎరుక కలుగుతుంది. వస్తువు దృశ్యమానమవుతుంది. అవసరం లేని వర్ణనలను కథలో చొప్పించకూడ దు. కథలోని ప్రతి అంశం ప్రధాన వస్తువును వెలిగించేది గా ఉండాలి. వస్తువును మింగేసేదిగా ఉండరాదు.
జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవం, ఇతరుల అనుభవాలు మనల్ని ఆలోచనల్లో పడవేస్తయి. వీటన్నిటిలో గల సమస్యలకు మూలకం ఒకటి ఉంటుంది. ఆ మూలకాన్ని పట్టుకోవడమే రచయిత పని. సాహిత్య పరిభాషలో ఆ మూలకాన్ని వస్తువు అంటారు. కథకు జీవం పోసేది వస్తువు. రచయితలకు వస్తువు కొరత లేదు. జీవిత శకలమే కథగా కొలువు దీరుతుంది. జీవితంలోని అనేక చిక్కుముడుల వల్ల మనసంతా అతలాకుతలమై దుఃఖం గొంతులో గూడుకట్టుకొంటుంది. ఇవన్నింటి నుంచి బయటపడి సేద తీరటానికి, సమాధానం వెతుక్కోవటానికి మనిషి సాహిత్యాన్ని ఆశ్రయిస్తాడు. కథను చదువుతాడు. కథ మనిషికి సాంత్వన కలిగించేదిగా ఉండాలి. సమాధానపరచేదిగా నిలబడాలి.
వస్తువును పట్టుకున్నాక దానికి నగిషీలు చెక్కడంలో భాగంగా పాత్రలను, సంఘటనలను, సన్నివేశాలను సృష్టించాలి. వాటితో మాట్లాడించాలి. ఇవన్నీ జరగడానికి తగిన స్థలకాలాలను చేకూర్చాలి. వస్తువు లేదా విషయ ప్రభావాలు జీవితాలపై ఏ విధంగా పడుతున్నాయో, అవి ఏ విధంగా తిరస్కరణకు, సంస్కరణకు గురవుతున్నాయో చెప్పాలి. పాత్రల ఆనంద, విషాదాల ప్రతిఫలనాలు చూపాలి. ఇదంతా చదువుతుంటే పాఠకుడికి తెలిసిన జీవితమో, తెలుసుకోవాల్సిన జీవితమో అనే భావన కలగాలి. అలా కలిగినప్పుడే కథ అవుతుంది. అప్పుడే కథ కళగా భాసిస్తుంది.
– డాక్టర్ బి.వి.ఎన్.స్వామి
92478 17732