అందమైన పల్లెటూరు. హఠాత్తుగా ఆ ఊరిలో ఓ ఇంటికి నిప్పంటుకున్నది. నిప్పంటుకున్న ఇంటి యజమాని మాత్రమే ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ ఊరిలోని మిగతా ప్రజలంతా తమ తమ ఇండ్ల వద్ద బకెట్లలో నీళ్లు పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు, వారింటికి నిప్పంటుకుంటే అర్పుకోవడానికి మాత్రమే. బాధితునికి మాత్రం ఎవరూ సాయం చేయట్లేదు. దీన్ని గమనించిన ఆ ఊరి పెద్దమనిషి వెంటనే వారిని గద్దించి వారందరిని పురిగొల్పి ఆ ఊరు అగ్నికి ఆహుతి కాకుండా కాపాడారు.
ఇక గంజాయి విషయానికి వస్తే దానికి సంబంధించిన ఎన్నో వార్తలు చదువుతున్నాం, చూస్తున్నాం. ప్రభుత్వం గంజాయిని అరికట్టేందుకు అక్రమంగా రవాణా చేసేవారిపై ఉక్కుపాదం మోపి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. రోజూ పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకొని, సరఫరా చేస్తున్నవారిని అరెస్టు కూడా చేస్తున్నది. ఈ గంజాయి రక్కసి నుంచి రాష్ర్టాన్ని కాపాడటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి కృతజ్ఞతలు.
మత్తుకు బానిసవుతున్న బాల్యాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిది. కొవిడ్ మహమ్మారి బడులను మూయించింది. రోజంతా బడిలో ఉండే బాల్యం వీధిపాలైంది. మన మహానగరంలో రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు కోకొల్లలు. తల్లిదండ్రులు పనికెళ్తే, ఈ పిల్లలు పగలూ, రాత్రి రోడ్లపై తిరగడం, సందుల్లో, మైదానాల్లో గంజాయి తాగడం, వైట్నర్ పీల్చడం, ఆడపిల్లలు, మహిళలను వేధించడం, ఎవరైనా ‘బాబు ఇది తప్పురా’ అని చెప్తే వారిపై కక్ష పెంచుకోవడం సర్వసాధారణమైపోయింది. గంజాయి డిమాండ్ వెనుక యువత దుర్వ్యసనం దాగి ఉందనడంలో సందేహం లేదు. గంజా యి కోసం వారు పడే పాట్లు తల్లిదండ్రులను పెడుతున్న హింస వర్ణనాతీతం. తండ్రి లేని కుటుంబాల పరిస్థితి మరీ దారుణం. బాధ్యత కలిగిన కొడుకు ప్రయోజకుడై ఇంటిభారాన్ని మోస్తాడనుకుంటే రాత్రంతా తాగి గొడవలు పడి పోలీస్స్టేషన్ల చుట్టూ ఆ తల్లులనూ తిప్పే స్థితికి తీసుకువచ్చారు. చేసిన తప్పులకు తామే బాధ్యులమని కుమిలి కుమిలి సమాజ సహాయ సహకారాలు లేక కృశించిపోతున్న తల్లిదండ్రులెందరో..
పండగల పేర్లతో, పుట్టినరోజుల పేర్లతో వీరు రోడ్లపై చేస్తున్న అల్లర్లకు అడ్డుకట్ట వేయాలి. ఇందులో సమస్య తీవ్రతరమై రిపోర్టు చేసిన కేసులు మాత్రమే మనకు తెలుస్తున్నాయి. మన దృష్టికిరానివి ఇంకెన్నో. సమాజంలో ఉన్న ప్రతిఒక్కరూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన స్థలాలను పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలి. మాదక ద్రవ్యాల సమస్యను తొలగించి మన పిల్లలను సంరక్షించుకునే బాధ్యత సమాజంలోని ప్రతి పౌరునిది. మాదకద్రవ్యాల వినియోగంపై యువతలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిది.
అన్ని నగరాల్లో డీ అడిక్షన్ సెంటర్లను స్థాపించడానికి కార్యాచరణ రూపొందించాలి. ఆరోగ్యశాఖతో సమన్వయం కావాలి. మాదకద్రవ్యాల వినియోగంపై ప్రొఫెషనల్ కౌన్సిలర్లు యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాలె. స్కూళ్లు, కళాశాలల్లో తాత్కాలిక కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటుచేయాలి. గ్రామాల్లో కూడా సామాజిక కార్యాచరణ కమిటీల ఏర్పాటు కోసం కృషిచేయాలి. ప్రెజర్ గ్రూపులను ఏర్పాటుచేసి తరచూ సమావేశాలు నిర్వహించాలి. మాదకద్రవ్యాల వినియోగ పర్యవసానాలను వివరించడం ద్వారా యువతలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. నా పిల్లలు బాగున్నారు, మిగతావారి పిల్లలు ఎటుపోతే నాకేం సంబంధం అనుకుంటే ఆ కాలనాగు మీ పిల్లల్ని కూడా కాటు వేయవచ్చు. తస్మాత్ జాగ్రత్త…!
–చందన మరిపల్లి, 92055 85962