“గునపాలతో నీదు గుండెల్లో పొడిచినా కత్తులతో చీల్చినా కుత్తుకను నులిమినా ధీరుడిగా నిలిచావు ఠానూ తెలంగాణ జ్యోతివై వెలిగావు ఠానూ” అప్పట్లో ఆ గిరిజన వీరుడి త్యాగాన్ని స్మరిస్తూ ప్రజలు ఇలా పాడుకునేవారు. ఆయనే ఠానూ నాయక్. ఠానూ కుటుంబం నీతీ నిజాయితీ, నిబద్ధ్దతకు పెట్టింది పేరు. మాటిస్తే ప్రాణాలు పోయినా తప్పనితత్వం.. ఎవరికీ ఆపదొచ్చినా వెన్నంటి నిలిచే దయాగుణం. ప్రజలను దోచుకుంటున్న భూస్వామ్య వ్యవస్థపై తిరుగుబాటు చేసే ధీరత్వం. ఠానూ కుటుంబానిది పోరాట యోధుల వారసత్వం. ఠానూ నాయక్, దర్గ్యా నాయక్లు దళకమాండర్లు. ఒడిసెలతో రాళ్లు విసరటంలో, తుపాకీ ఎక్కుపెట్టడంలో రణధీరులు.
జాటోతు మంగి, హము దంపతులది ఉమ్మడి వరంగల్ జిల్లా ( ప్రస్తుతం జన గాం జిల్లా) దేవరుప్పల మండలంలోని ధర్మాపురం పడమటి తండా (ఇది పూర్వం నల్లగొండ జిల్లాలో ఉండేది). పల్లె పల్లెకూ చరిత్ర ఉన్నట్టు ఆ ఊరి చరిత్ర మామూలు చరిత్ర కాదు. ఉద్యమ చరిత్ర. విప్లవానికి తొలిపొద్దు ధర్మపురం. మంగి దంపతులకు ఆరుగురు కొడుకులు. జోద్య, సోమ్ల, సాంక్రు, దర్గ్యా, ఠాను, దాసు(కిషన్)లు. వీరంతా ఉద్యమం కోసం ప్రాణాలను ఫణంగా పెట్టారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వేగుచుక్కలై వెలుగొందారు.
నిజాం నిరంకుశ పాలనలో విసునూరు భూస్వామి రామచంద్రారెడ్డి లాగే ధర్మపురంలో రాఘవరావు పెద్ద భూస్వామి. విసునూరు దొరలాగే ప్రజల్ని పీడించేవాడు. పడమటి తండాలో గిరిజనులకు చెందిన భూమిపై దొర కన్నుపడింది. సారవంతమైన భూము ల్ని లాక్కునేందుకు భూస్వామి తన అనుచరుల్ని ఆ తండా మీదకు పంపాడు. హము కుటుంబం దీన్ని అడ్డుకున్నది. పక్కనే ఉన్న రామారం గ్రామానికి చెంది న బ్రాహ్మణుడి భూములూ ఉన్నాయి. నయానో భయానో ఆ బ్రాహ్మణుడి నుంచి లాక్కున్నప్పటికీ వ్యవసాయంపై అధార పడి జీవిస్తున్న గిరిజనులు భూమిని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. చావో.. రేవో.. తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. వారిని సంఘటితం చేసింది హము కుటుంబమే.
ఈ గ్రామంలో ప్రతిఘటనోద్యమం మొదలయ్యేనాటికి ఆంధ్రమహాసభ మహాసభలు గిరిజన బిడ్డల్ని పోరాటం వైపు మళ్లించాయి. ఆ వెలుగులోనే పడమటి తండాలో తిరుగుబాటు మొదలైంది. సంఘం అగ్ర నాయకులు ఆరుట్ల రాంచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు లాంటి ముఖ్య నాయకులు ఆ గ్రామంలో పర్యటించారు. పోరాటం తీవ్రరూపం దాల్చడంతో హము కొడుకులు ఆరుగురూ ఉద్యమం వైపు నిలబడ్డారు. ఠాను, దర్గ్యా నాయక్లు ఉద్యమం లో ముందు భాగాన నిలిచారు. ఆ తండాపై పోలీసు లు, దొరలు, రజాకార్లు కక్ష గట్టి దాడులు జరిపినా ఠా ను, దర్గ్యా మాత్రం వెనుకడుగు వేయలేదు. విసునూ రు నుంచి పోలీస్ బలగాలతో దేశ్ముఖ్ కొడుకు బాబుదొర తండాపై దాడి చేశాడు. నల్లగొండ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి, జిల్లా కలెక్టర్ సమక్షంలో గిరిజనుల్నీ, ఠానూ తల్లిదండ్రులనూ చిత్ర హింసలు పెట్టా రు. హము చేయి విరగ్గొట్టారు. ఇండ్లలోని వస్తువులనూ, నిల్వ చేసుకున్న పంటనూ దోచుకున్నారు. తండాకు నిప్పు పెట్టారు.
మరో రోజు రజాకార్లు పెద్ద ఎత్తున తండాను ముట్టడించి క్యాంపు పెట్టారు. మహిళలను చెరబట్టాలని ప్రయత్నించారు. కానీ హము కోడలు జాటోతు పూలీ (జోద్యా భార్య) పోలీసులపైనా, రజాకార్లపైనా తిరగబడింది. మరి కొందరు మహిళల సహాయంతో రజాకార్ల కండ్లల్లో కారం చల్లి, కొడవండ్లతో దాడి చేశారు. రోకలి బండలందుకుని తరిమికొట్టారు. దళకమాండర్గా ఉన్న ఠానూను పట్టుకునేందుకు భూస్వాములంతా మూకుమ్మడిగా మరోసారి తండాపై దాడి చేశారు. కమ్యూనిస్టు కేంద్రాలపై దాడులు చేయించారు. పోలీసుల్ని, రజాకార్లను ఉసిగొల్పారు. కేసులు పెట్టించారు. జోద్యా, సాంక్రులను అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకు పంపారు. ఠానూ, దర్గ్యాను పట్టించాలని బాబుదొర తండా ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. చిత్రహింసలు పెడుతూ మహిళలను వేధించారు. హము రెండో కొడుకు జాటోతు సోమ్లా (ఠానుకు రెండో అన్న) పోలీసులకు దొరికాడు. అప్పటికే కాలి బూడిదైన గూడాన్ని పునర్నిర్మించేందుకు కట్టెలు, కావాల్సిన దూలాలు సమకూర్చుకున్నారు. ఆ కర్రలతోనే చితిపేర్పించి సజీవ దహనం చేశారు. మరోఇద్దరిని దగ్గర్లో ఉన్న గుట్టల వద్ద కాల్చి చంపారు.
జూలై 4 న విసునూరు దేశ్ముఖ్ గుండాలు జరిపిన కాల్పుల్లో దొడ్డి కొమురయ్య వీరమరణం పొం దాడు. ఈ విషయం తెలిసి ఠానూ నాయక్ ముందు గా కడివెండికి చేరుకున్నాడు. ఆ గుండాలపై ఠానూ కొదమ సింహమై ప్రతి దాడి చేశాడు. ఆ తర్వాత ఠానూ నాయక్ విసునూరు, మొండ్రాయి, కడవెండి ఆ చుట్టు పక్కల గ్రామాల్లోని భూస్వాముల ఇండ్లపై దాడులు జరిపాడు. మొండ్రాయిలో గిరిజనుల భూ ముల్ని భూస్వామి కడారి నర్సింహరావు, రామచంద్రారావు లాక్కుంటుంటే వారికి వ్యతిరేకంగా ఉద్యమించారు. అక్కడే దొర రైస్మిల్లుపై దాడి చేసి ధాన్యా న్ని ఎత్తుకెళ్లారు. పోలీసు క్యాంపులపై దాడులు చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లారు. మరో దళనాయకుడు, ఆ ఏరియా నాయకుడు యర్రంరెడ్డి మోహన్రెడ్డిని కుట్ర చేసి పోలీసులు పట్టుకెళ్లి పోలీస్ క్యాంప్ లో బంధించారు. ఠానూ నాయక్ దళం ఆ పోలీస్ క్యాంప్ను ముట్టడించి మోహన్రెడ్డిని తీసుకెళ్లింది.
పోలీసులు, రజాకార్ల నుంచి ఎన్నోసార్లు తప్పించుకున్న ఠానూనాయక్ మొండ్రాయి దగ్గర నీలిబండ తండాలో 1950 మార్చి 20 న పోలీసు బలుగాలకు చిక్కాడు. అతన్ని దొర గడీలో బంధించి చిత్ర హింస లు పెట్టారు. ముఖ్య నాయకుల్ని పట్టిస్తే వదిలేస్తామని, కేసుల్లేకుండా చేస్తామని చెప్పినా ఠానూ నిరాకరించాడు. దొరల ఒత్తిడితో బండి చక్రానికి కట్టి ఠానూ నాయక్ను తుపాకితో కాల్చిచంపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఠానూ కుటుంబం మొత్తం త్యాగం చేసి చరిత్రలో నిలిచింది. వారి త్యాగాన్ని చరిత్రెప్పుడూ విస్మరించదు. ఠానూనాయక్ తమ్ముడు జాటోతు దర్గ్యా నాయక్ వందేండ్లు నిండి (107) నేటికి మన కండ్ల ముందు సజీవ సాక్ష్యంగా ఉద్యమ ప్రతిరూపంగా ఉన్నాడు.
– మామిండ్ల రమేశ్ రాజా
78932 30218
(వ్యాసకర్త : రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్)