‘భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం…’ ఈ ప్రతిజ్ఞ దేశంలోని ప్రతీ పౌరుడూ ఏండ్ల తరబడి నిత్యం పఠించిన దివ్యమైన పలుకులు. అయితే నేడు దేశంలో జరుగుతున్న అమానవీయ దాడులు, మానవత్వానికి మాయని మచ్చలా మారాయి.
ప్రపంచం ముందు మన దేశం పరువు పోయేలా ప్రవర్తిస్తున్నారు. మణిపూర్లో తండ్రి, తమ్ముడి కండ్ల ముందే ఇరవై ఏండ్ల యువతిని వివస్త్రను చేసి, నగ్నంగా ఊరేగించారు. మహిళలపై సామూహిక అత్యాచారాలకు ఒడిగట్టారు. ఈ ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్నదెవరు? ఈ దారుణాలకు పాల్పడిన మా నవ మృగాలను ఏమనాలి? వారిని ఎలా శిక్షించాలి? బరితెగించి భారతమాత గుండెలపై తం తున్న మూకల చర్యలను అరికట్టలేమా?
సృష్టికి మూలమైన స్త్రీ జాతిని ఇంతలా అవమానించిన తీరు బహుశా ఈ నాగరిక ప్రపంచంలో మరెక్కడా జరిగి ఉండకపోవచ్చు. ఇంత టి దురాగతానికి ఒడిగట్టిన మానవ మృగాలను అరెస్టు చెయ్యడానికి మణిపూర్ పోలీసులకు 70 రోజులు పట్టిందంటే ఏమనుకోవాలి. సాక్షాత్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, మణిపూర్లో జరిగిన సంఘటన పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనే అని చీఫ్ జస్టిస్ ఆందోళన వ్యక్తం చెయ్యడం గమనించాల్సిన విషయం.
మణిపూర్లో ఇంతటి ఘోరానికి బలైన మహిళలు భారతమాత బిడ్డలు కారా? వారికి ఈ దేశంలో బతికే హక్కు లేదా? సాక్షాత్తూ ఒక భారత సైనికుడి భార్యకే ఇంతటి ఘోర అవమానం ఎదురైందంటే ఇంతకు మించిన అవమానం మరొకటి ఉంటుందా?
నాడు కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరా డి దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా శత్రువులను మట్టుబెట్టిన సైనికుడు మీడియా ముందు వాపోయాడు. ‘దేశం కోసం ఒక పెద్ద యుద్ధాన్ని గెలిచాను. కానీ, నా భార్య ను, కుటుంబాన్ని, గ్రామాన్ని కాపాడుకోలేకపోయాను’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.
నిండు గర్భిణీ అని కూడా చూడకుండా బిల్కిస్ బానోపై అత్యాచారం చేసిన నిందితులకు పూలమాలలు వేసి ఊరేగించుకున్న సమాజంలో ఇంతకు మించిన ఘోరాలు కాక మరేం ఆశించలేం. ఒలింపిక్ విజేతలైన మహిళా రెజ్లర్లపై ఆ విభాగం చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష ణ్ లైంగిక దాడులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన దేశంలో ఇంతకన్నా మరే మంచి సంఘటనలు జరుగుతాయని ఊహించుకోలేం.
దేశం ఎటువైపు వెళుతున్నదో అర్థంకాని పరిస్థితి నెలకొన్నది. మణిపూర్ ఘోరం గురించి పార్లమెంటులో చర్చించాలని విపక్షాలు పట్టుబడితే కేవలం ఒక్క నిమిషం కూడా సమయం ఇవ్వని మన పాలకులు మహిళల పట్ల ఎలాంటి గౌరవం కలిగి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. రెండు నెలలుగా జరుగుతున్న అమానవీయ సంఘటనల్లో ఇప్పటికే 150 మందికిపైగా మరణించారు. అయినప్పటికీ మన పాలకులు చీమ కుట్టినట్టుగానైనా స్పందించలేదు. సభ్యసమాజం, ప్రపంచం యావత్త్తు సిగ్గుతో తలదించుకునేలా జరుగుతున్న ఈ దారుణాలు ఇంకెన్నాళ్లు? పాలకుల మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సాటి మనిషిని మనిషిగా గౌరవించని పరిస్థితుల్లో మనం ఉన్నామా?
అందుకే కుల, మత, ప్రాంత, పేద, ధనిక భేదాలు లేకుండా మహిళల కోసం ప్రత్యేక చట్టాలు చేసి, వారి భద్రతకు పనిచేసే వారే రాజకీయాలలోకి రావాలి. తరతరాలుగా మహిళల పట్ల జరుగుతున్న సాంఘిక దురాచారాలు, మూఢాచారాల పట్ల ప్రజలకు, ముఖ్యంగా మహిళాలోకానికి భరోసానిచ్చే నాయకులను ఎన్నుకోవాలి. ఓటు వేయించుకునే రాజకీయ నాయకులు అన్ని సందర్భాల్లోనూ మహిళలకు బాసటగా నిలువాలి. స్త్రీలను గౌరవించినప్పుడే దేశ గౌరవం కూడా పెరుగుతుందన్న సత్యా న్ని గ్రహించాలి. మహిళలకు రక్షణ కల్పించే చట్టాలను బలో పేతం చేయాలి. ఆ దిశగా ప్రభు త్వం చర్యలు చేపట్టాలి. అప్పుడే మహిళా లోకానికి నిజమైన స్వాతంత్య్రం సిద్ధించినట్టు. లింగ సమానత్వం కాపాడినట్టు అవుతుంది.
-దోరెపల్లి శ్వేత
99639 07909