భారతదేశ చరిత్రలో 1947 ఆగస్టు 15వ తేదీకి ఎంత ప్రాముఖ్యం ఉన్నదో 2019, ఆగస్టు 5వ తేదీకీ అంతే ప్రాముఖ్యం ఉన్నది. ఆనాడు విదేశీ శృంఖలాల నుంచి విముక్తి పొందితే, ఈనాడు రాజ్యాంగ 370 ప్రకరణం రద్దు ద్వారా భారత పార్లమెంట్ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసి కశ్మీర్, లద్ధాఖ్ ప్రాంతాలకు కేంద్రపాలిత హోదా కల్పించింది. తద్వారా భారత పార్లమెంట్ కశ్మీర్ ప్రజలను భారత జనజీవన స్రవంతిలో భాగం చేసి జాతీయ ఐక్యతను, సమగ్రతను కాపాడింది. ఈ పార్లమెంటు చట్టాన్ని వ్యతిరేకిస్తూ కశ్మీర్లోని ఫారూఖ్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, మెహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు గుప్కార్ కూటమిగా ఏర్పడి కశ్మీర్కు ప్రత్యేక హోదా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాయి.
భారత అంతర్భాగమైన కశ్మీర్ సమస్య పరిష్కారానికి అక్కడి ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్థాన్తో చర్చలు జరపాలని ఉచిత సలహాలు ఇస్తున్నాయి. ప్రత్యేక హోదా రద్దువల్ల కశ్మీర్లో రక్తపుటేరులు పారుతాయని, దేశం విచ్ఛిన్నమౌతుందని కూడా వీరు దురాశతో రెచ్చగొట్టాలని చూసి భంగపడ్డారు. కశ్మీరియత్ అనేది కశ్మీర్ ప్రత్యేక సంస్కృతీ అనీ అందువల్ల కశ్మీర్ ప్రత్యేక ప్రతిపతి కొనసాగాలని ఈ జాతీయ పార్టీలతో పాటుగా భారత దేశం నుంచి సంపూర్ణ ఆజాదీ (విముక్తి) పొందాలని ఉగ్రదాడులకు తెగబడే జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ తదితర తీవ్రవాద సంస్థలు పార్లమెంట్ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
Kashmir | కశ్మీరియత్ లేదా కశ్మీర్ ప్రత్యేక సంస్కృతినీ కశ్మీర్ చరిత్ర అధ్యయనం ద్వారా తెలుసుకుందాం. నాగ తెగల ప్రజలు మొదటగా కశ్మీర్లో స్థిరపడ్డారని, కశ్మీర్ చరిత్ర గురించి క్రీస్తుశకం 6వ శతాబ్దంలో రాసిన ప్రాచీన గ్రంథం నాగమత పురాణం వివరిస్తున్నది. ప్రాచీన కశ్మీర్ మూలాధారాలను ఈ గ్రంథం ఎంతగా వివరిస్తున్నదంటే, ఇందులో పేర్కొన్న యాభైకి పైగా దేవాలయాలు, క్షేత్రాలు ఇప్పటికీ కశ్మీర్లో ప్రసిద్ధమే!
మధ్యయుగాల నాటి భారత చరిత్రను యథాతథంగా వాస్తవిక దృక్పథంతో రాసిన ప్రముఖ సంస్కృత కవి, చరిత్రకారుడు కల్హణుడు కశ్మీర్ ప్రాచీన చరిత్రను మహాభారత కాలం నుంచి తన సమకాలీన (క్రీస్తు శకం 1149 వరకు) రాజవంశాల వరకు సమగ్రంగా ‘రాజతరంగిణి’ గ్రంథం ద్వారా అందించాడు. కల్హణుడు తాను అనుసరించిన శాస్త్రీయ చారిత్రక రచనా పద్ధతిని సొంత మాటల్లోనే ఇలా వివరించాడు. ‘గతకాలపు ఘటనలను పక్షపాతరహితంగా, ఎలాంటి వివక్షలేకుండా న్యాయాధీశునిలా నమోదు చేసే వ్యక్తి మాత్రమే ప్రశంసకు అర్హుడు (1వ తారంగం: 7వ శ్లోకం).’ కల్హణుడు అంతకుపూర్వం ప్రాచీన కశ్మీర్ చరిత్ర రాసిన సువ్రతుని గ్రంథాలను, నీల ఋషి రాసిన నీలమత పురాణాన్నీ, అట్లాగే క్రీస్తుశకం 990లో జన్మించిన క్షేమేంద్రుని లోక ప్రకాశ, చారుచర్య, బోధిసత్వ ధమ్మా, కల్పలత తదితర గ్రంథాలను అధ్యయనం చేసి ఆయా గ్రంథాల్లోని దోషాలను పరిహరించి రాజతరంగిణి రాశానని చెప్పాడు (1వ తారంగం: 9 నుంచి 14వ శ్లోకాలు). అంతేకాకుండా తాను కశ్మీర్ చరిత్రకు సంబంధించిన గతకాలపు రాజ శాసనాలు, రాజ దానపత్రాలు, శాసన దస్తావేజులను కూలంకషంగా పరిశీలించి నిర్ధారించుకున్న తర్వాతే రాజతరంగిణి రాశానని కూడా స్పష్టం చేశాడు.
కల్హణుడు భారతదేశాన్ని ఆర్యావర్తమని పేర్కొంటూ ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన వింధ్య పర్వతాల వరకు విస్తరించిన దేశమని వర్ణించాడు (5వ తారంగం: 152వ శ్లోకం). భారతదేశాన్ని ఆర్యుల భూమి అని (1వ తారంగం: 34వ శ్లోకం)చెప్తూనే ఆర్యులంటే జాతిగా కాకుండా శిష్టులుగా పరిగణించారు (3వ తారంగం: 310వ శ్లోకం). నాగ తెగ ప్రజలు వితస్తా (జీలం) నదీ తీరంలో సర్పరాజు నీలుని పేరున నీలకుంద తీర్థాన్ని నిర్మించారని చెప్పాడు. మహాభారత యుద్ధం తర్వాత కశ్మీర్ను పాలించిన 37 మంది రాజులను ప్రస్తావించి, ఆ తర్వాత వచ్చిన 38వ రాజు ఖగేంద్రుడు నాగరాజ వంశాన్ని అంతం చేశాడని రాశాడు (1వ తారంగం: 89వ శ్లోకం).
మహాభారత యుద్ధంలో విజయం తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం జరిగినప్పటి ఖగోళ సంబధమైన ఘటనను ప్రస్తావిస్తూ శక సంవత్సరానికి పూర్వం 2026 సంవత్సరంలో సప్తర్షి మండలం మాఘ నక్షత్ర రాశిలో ప్రవేశించినపుడు ధర్మరాజు పట్టాభిషేకం జరిగిందని కల్హణుడు లెక్కతేల్చాడు. (1వ తారంగం: 56వ శ్లోకం).
సప్తర్షులలో ఒకరైన కశ్యప మహర్షి పేరుతో కశ్మీర్ భూమి పిలవబడుతోందని కల్హణుడు స్పష్టం చేశాడు (1వ తారంగం: 191వ శ్లోకం). ఒకప్పుడు పూర్తిగా జలమయమైన ఈ ప్రాంతాన్ని పర్వతరాజు హిమవంతుని కూతురు సతీదేవి (పార్వతి) పేరుతో సతిస్తర్ అని పిలిచేవారు. దీన్ని జనావాసయోగ్యంగా చేసిన కశ్యపుని పేరుతో ‘కశ్యపమార్’ ఏర్పడిందని నీలమత పురాణం వివరిస్తుంది. నాగరాజు నీలుని పాలనలోని ఈ ప్రదేశంలోనే కొండ ప్రాంతాల నాగులు, మైదానం ప్రాంతాల జనులు సహజీవనం ఆరంభించారని నీలమత పురాణం చెప్తున్నది. కశ్మీర్లోని మధుమతి నదీతీరంలోనే శారదాదేవి(సరస్వతి) ఆలయం ఉన్నదని రాజ తరంగిణి పేర్కొన్నది (1వ తారంగం: 37వ శ్లోకం). ఇక్కడే శారదా విశ్వవిద్యాలయ పీఠం ఉండేదని చెప్తారు. కశ్మీర్ను శారదా దేశంగా పిలవడాన్ని బట్టి దీని ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ సంస్కృత కవి, చరిత్రకారుడు బిల్హణుడు కశ్మీర్ను శారదా దేశంగా కీర్తిస్తూ ప్రపంచంలో వేరెక్కడా లేని అందమైన కవిత్వం, కుంకుమ పువ్వు సౌరభం కశ్మీర్ ప్రత్యేకతలని అన్నాడు. కర్ణాటక మహారాజు విక్రమదేవుని చరిత్రను విక్రమదేవ చరిత్రగా రాయడమే గాక తన ఆత్మకథ బిలహణీయం రాశాడు.
సంస్కృత భాషకు వ్యాకరణ భాష్యాన్ని అందించిన పాణిని క్రీస్తుపూర్వం 400 సంవత్సరంలో కశ్మీర్లో జన్మించాడని చెప్తారు. చరక సంహితను రాసిన ఆయుర్వేద పితామహుడైన చరకుడు (క్రీ.పూ.200) కశ్మీర్ ప్రాంతీయుడే. మరో ప్రముఖ కశ్మీర్ మహాకవి క్షేమేంద్రుడు దశావతార చరిత్ర, బృహత్ కథామంజరి వంటి మహాగ్రంథాలను రచించాడు. ఇతను క్రీ.శ.1028లో కశ్మీరుని పాలించిన అనంతుని సమకాలికుడు. క్రీస్తుశకం 11వ శతాబ్దంలో కావ్య ప్రకాశిక వంటి సాహిత్య గ్రంథం రాసిన ప్రముఖ అలంకార శాస్త్రవేత్త ముమ్మటుడు కూడా కశ్మీరీయుడే.
కశ్మీర్లో బౌద్ధమత వికాసం: క్రీస్తు పూర్వం 304 నుంచి క్రీస్తుపూర్వం 232 వరకు జీవించి ఆఫ్గనిస్థాన్ నుంచి ఆంధ్ర దేశం వరకు భారతావనిని పాలించిన మౌర్య అశోకుడు శ్రీనగర్ పట్టణాన్ని నిర్మించాడని చెప్తూ బుద్ధుని బోధనలను అనుసరించి కశ్మీర్లో అనేక బౌద్ధ స్తూపాలను, విహారాలను కట్టించడమే కాకుండా లక్షలాది జనుల ఆవాసం కోసం శ్రీనగర్ పట్టణాన్ని నిర్మించాడని కల్హణుడు పేర్కొన్నాడు (1వ తారంగం: 104వ శ్లోకం).
(ఇంకా ఉంది..)
– ఆనందేశి నాగరాజు
98488 38323