ప్రకృతి ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా మానవులు మూర్ఖత్వాన్ని వీడటం లేదనడానికి జోషిమఠ్ పట్టణంలో నేల కుంగిపోయి ఇళ్ళు, బాటలు బీటలు వారడం తాజా ఉదాహరణ. మంచు పర్వతాలతో కూడిన సుందర తలమది. అనేక మందికి పవిత్రమైన దైవభూమి. కానీ అభివృద్ధి, మౌలిక వసతుల పేరిట చేపట్టిన విచక్షణ లేని అశాస్త్రీయ నిర్మాణాల వల్ల మొత్తం ఆ ప్రాంత ఉనికికే ప్రమాదం ఏర్పడుతున్నది. దేశమంతా గగ్గోలు పుట్టి, హడావుడిగా జనాలను సురక్షిత స్థానాలకు తరలిస్తున్న తరుణంలోనూ యంత్రాలతో కొండలను తొలవడం, పగులగొట్టడం వంటి కార్యకలాపాలు నిరంతరాయంగా సాగుతుండటం దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. భౌగోళికంగా- కొండచరియలు విరిగిపడి పేరుకుపోయిన పెళుసు ప్రాంతమిది. పర్యావరణపరంగా సున్నితమైన భూభాగం. దీనిని అపురూపంగా కాపాడుకోవాలే తప్ప విధ్వంసం చేయడం తగదు.
వేల ఏండ్లుగా రూపుదిద్దుకున్న కొన్ని ప్రకృతి అద్భుతాలు ధ్వంసమైతే మళ్ళా నిర్మించడం మానవుల తరం కాదు. మిగతా కొండల మాదిరిగా కాకుండా హిమాలయాలు పరిణామ క్రమంలో ఉన్న అరుదైన పర్వతాలు. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి కాపాడుకోవాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉత్తరాఖండ్ ప్రాంతంలోనే 2,850 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో 900 హిమనదులు ఉన్నాయి. హిమాలయాలలోని జోషిమఠ్ కుంగిపోయే ప్రమాదం ఉందని ఎం.సి.మిశ్రా కమిటీ 1976లో నివేదిక ఇచ్చింది. ఆ తరువాత ఇతర అధ్యయనాలు, నివేదికలు వచ్చాయి. వాతావరణ మార్పుల కారణంగా హిమాలయాలు- టిబెటన్ పీఠభూమి ప్రాంతంలో 1950 దశకం నుంచి ప్రతి దశాబ్దానికి 0.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో స్థానికంగానైనా మనవంతుగా పరిరక్షణ చర్యలు తీసుకోవలసింది.
ఉత్తరాఖండ్-హిమాలయాల ప్రాంతంలో ఇప్పటికే 18 సొరంగాల నిర్మాణం జరిగింది. మరో పదేండ్లలో మొత్తం 66 సొరంగాలను నిర్మిస్తారట! ఒక సొరంగ నిర్మాణం సందర్భంగా భూగర్భంలోని జలాశయానికి ఛిద్రం పడి భారీ వరద ఎగజిమ్మింది. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఇప్పటికే రహదారులు, రైల్వేట్రాక్ల నిర్మాణం వల్ల కొండచరియలు భారీగా విరిగిపడుతున్నాయి. ప్రకృతి వ్యవస్థల సమతుల్యత దెబ్బతింటున్నది. భూప్రకంపనలు, మేఘ విస్ఫోటాలు, వరదల వంటి బీభత్సాలు ఇప్పటికే పెరిగిపోయాయి. అయినా జలవిద్యుత్ కేంద్రాలను, ఆనకట్టలను, పట్టణాలను నిర్మించ తలపెట్టడం ఆశ్చర్యకరం. పకృతి ఆగ్రహిస్తే ఆ విలయాన్ని తట్టుకోవడం మానవుల తరం కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతతో వ్యవహరించాలి.