అంతర్జాతీయ జనాభా దినోత్సవాన్ని ఏటా జులై 11న జరుపుకుంటున్నాము. ఈ రోజున జనాభా పెరుగుదల సమస్యలు, ఆవశ్యకత, ప్రాముఖ్యతపై ఐక్యరాజ్యసమితి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నది. 1987 జూలై 11నప్రపంచ జనాభా ఐదు బిలియన్లకు పెరిగినట్టు గుర్తించారు. నాటి నుంచి జనాభా సమస్యలపై అవగాహన పెంచడానికి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయించింది.
1990 జూలై 11న తొలిసారి 90కి పైగా దేశా ల్లో జనాభా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించారు. ఆ రోజు నుంచి ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలతోపాటు, ఇతర సంస్థలు, ప్రభుత్వాలు, పౌర సమాజ భాగస్వామ్యంతో ప్రపం చ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. పెరుగుతున్న జనాభావల్ల దేశాలు, సమాజం, పర్యావరణంపై దాని ప్రభావాల గురించి అవగాహన కల్పించడానికి దీన్ని నిర్వహిస్తున్నారు. అదే విధంగా జనాభాను నియంత్రించడానికి తీసుకోవలసిన చర్యల గురించి చర్చించడానికి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఒక్కో థీమ్తో జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా 2023 ప్రపంచ జనాభా దినోత్సవానికి సంబంధించి ‘సంతోషం, శ్రేయస్సు, కుటుంబ నియంత్రణ’ అనే థీమ్ను ఎంపిక చేసుకున్నది. 1987నాటికి ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకున్నది. ఈ సంఖ్య భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి భావించింది. ప్రపంచ జనాభాను నియంత్రించడానికి తీసుకోవలసిన చర్యలు, నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించే ఉద్దేశంతో ఏటా పలు కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది.
యునైటెడ్ నేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ ప్రకారం రాబో యే దశాబ్దాల్లో జనాభా వృద్ధి రేటు తగ్గుతున్నప్పటికీ, 2020 కంటే 2050లో 20-30 శాతం పెరుగుదల ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపింది. పెరుగుతున్న ప్రపంచ జనాభా మానవ మనుగడకే ముప్పుగా పరిణమించనున్నది. 2017నాటికి 700 కోట్ల కు చేరుకున్న ప్రపంచ జనాభా ఈ ఏడాది(2023) మొదటి త్రైమాసికానికి 800 కోట్లకు చేరుకున్నది. భారతదేశ జనాభా కూ డా విపరీతంగా పెరిగి ప్రపంచం లో అత్యధిక జనాభా కల్గిన దేశంగా అవతరించింది. అధిక జనాభా కారణంగా ప్రపంచంలోని సహజ వనరులు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఆరోగ్యశాస్త్రం, సాంకేతికత పురోగతి తల్లిబిడ్డల మరణాలను తగ్గించి జీవిత కాలాన్ని పెంచింది. ఏదేమైనప్పటికీ పెరుగుతున్న జనాభా వాతావరణ మార్పులకు సవాలుగా మారిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాభా పెరుగుదల వల్ల లింగ, జాతి, తరగతి, మతం, లైంగిక పరమైన వివక్ష మరింత పెచ్చరిల్లుతున్నాయి. దీన్ని అరికట్టడానికి. రాబోయే తరానికి మెరుగైన, స్థిరమైన భవిష్యత్తును అందించడానికి, అధిక జనాభాతో కలిగే పర్యవసనాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్న ది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా పెరుగుదల తక్కువగాను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెరుగుదల ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఎనిమిది బిలియన్ల ప్రపంచ జనాభాను చేరుకోవడం ఒక సంఖ్యాపరమైన మైలురాయి. కానీ ప్రజల అవసరాలు ఎంతవరకు పరిష్కారమవుతున్నాయన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న.
ప్రపంచ జనాభా 1 బిలియన్కు చేరడానికి వందల వేల సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత కేవలం 200 ఏండ్లలో ఆ జనాభా ఏడు రెట్లు పెరిగింది. 2011లో ప్రపంచ జనాభా 7 బిలియన్ల మార్కుకు చేరుకున్నది. 2100నాటికి 10.9 బిలియన్లకు చేరుతుందని అంచనా. సగటు మనిషి జీవిత కాలం 1990లో 64.6 సంవత్సరాలుంటే 2019 నాటికి 72.6 సంవత్సరాలకు పెరిగింది. ఈ పోకడలు రాబోయే తరాలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇటీవలి కాలం లో సంతానోత్పత్తి రేట్లు, జీవన ప్రమాణాల్లో అపారమైన మా ర్పులు చోటు చేసుకున్నాయి. దీనివల్ల జనాభా పెరుగుదల రేటు తక్కువగా కనిపిస్తున్నది. ఏదేమైనా రానున్న రోజుల్లో జ నాభా విస్పోటనాన్ని నివారించడానికి అందరూ కృషి చేయాలి.