న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరొచ్చా? అనే ప్రశ్న మన రాజ్యాంగం ఊపిరి పోసుకున్న నాటి నుంచీ ఉన్నది. జడ్జిలు పరిపాలన పరమైన పదవులు చేపట్టకుండా నిషేధం విధించాలనే సూచన అప్పట్లోనే వచ్చింది. కానీ రాజ్యాంగసభ అందుకు సమ్మతించలేదు. బయటినుంచి నిబంధనలు రుద్దడం వల్ల న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసినట్టవుతుందని భావించడమే అందుకు కారణం. జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ వంటివారు భవిష్యత్తులో న్యాయవ్యవస్థను ఇరకాటంలో పడేస్తారని బహుశా వారు ఊహించి ఉండరు.
గంగోపాధ్యాయ కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి పదవికి ఇలా రాజీనామా చేసి, అలా బీజేపీలో చేరిపోవడం దేశవ్యాప్తంగా చర్చాంశమైంది. ‘పార్టీ కోసం సైనికుడిలా పనిచేస్తానని’ ఆయన ప్రకటించడం విమర్శలకు దారితీసింది. గంగోపాధ్యాయకు వివాదాలు కొత్తకాదు, హైకోర్టు న్యాయమూర్తిగా ఉంటూనే ఆయన ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పశ్చిమబెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ సర్కారును విమర్శించారు. ముడుపులకు బడి ఉద్యోగాలు కేసును ప్రస్తావించారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు విచారణలో ఉన్న కేసులపై జడ్జిలు టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వడం సబబు కాదని స్వయం గా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఘాటుగానే మందలించారు.
న్యాయమూర్తుల తీరుతెన్నులపై నియంత్రణలు ఉండాలా, వద్దా అనే ప్రశ్న గంగోపాధ్యాయ ఉదంతంతో మరోసారి ప్రముఖంగా ముందుకువచ్చింది. ఒక న్యాయవాది.. న్యాయమూర్తి పదవిని అంగీకరించారంటే వ్యక్తిగత స్వేచ్ఛను త్యాగం చేసినట్టే. ఎందుకంటే న్యాయమూర్తి పదవిని చేపట్టినవారు అన్ని విషయాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. అలాగే వ్యక్తిగత ఆకాంక్షలనూ వదులుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో రాజ్యాంగబద్ధ న్యాయపీఠాన్ని అధిష్ఠించే న్యాయమూర్తికి అపరిమితమైన అధికారాలు, గౌరవాలు దక్కుతాయి. ఉన్నత న్యాయస్థానాల జడ్జిలను పార్లమెంటు అభిశంసన ద్వారా మాత్రమే తొలగించవచ్చు. ఇది కష్టసాధ్యమైన విషయమని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇంతటి విశిష్టమైన పదవిని చేపట్టేవారు రాత్రికిరాత్రే రాజకీయ కండువాలు కప్పుకోవడం విడ్డూరంగానే కనిపిస్తున్నది. గంగోపాధ్యాయ ఆ పనే చేసి చూపించారు.
న్యాయపీఠానికి న్యాయమూర్తి వర్తనే వన్నె తెస్తుందని న్యాయవేత్తలు అంటారు. ఆ వర్తన స్వచ్ఛంగా, సమున్నతంగా ఉండాలి. రాజకీయ పదవులను ఆశించడమనేది ఏ మాత్రం సరిపడే విషయం కాదు. గతంలో కోకా సుబ్బారావు, బహారుల్ ఇస్లాం రాజకీయ ఎన్నికల కోసం న్యాయపదవుల నుంచి వైదొలిగారు. ఇటీవల ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన అనతికాలంలోనే రంజన్ గొగోయ్ రాజ్యసభలోకి ప్రవేశించారు. ఇప్పటిదాకా మినహాయింపులుగా ఉన్న ఈ తరహా రాజకీయ ప్రవేశాలు సాధారణ అంశాలుగా మారితే న్యాయవ్యవస్థ పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. ఈ జాడ్యం మరింత ముదరకముందే సుప్రీంకోర్టు, పార్లమెంట్ సకాలంలో సరైన చికిత్స చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.