స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడచినా బీసీల జన గణన చేయకపోవడంతో బీసీ రిజర్వేషన్లు అమలు కాలేకపోతున్నాయి. దేశ జనాభాలో సుమారు 56 శాతంగా ఉన్న 70 కోట్ల మంది బీసీల స్థితిగతులు తగిన రిజర్వేషన్లతోనే మెరుగుపడతాయి. ఈ విషయమై రాజకీయ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలి. బీసీలు ఐక్యం గా ఉద్యమించాలి. కేంద్ర ప్రభుత్వం రాబోయే దేశ జన గణనలో బీసీల జనాభా వివరాలను సేకరించాలి.
ఎవరి కుల జనాభా ప్రకారం వారు హక్కులు పొందటమే ప్రజాస్వామిక సామాజిక న్యాయమని భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అభిప్రాయం. పదేండ్లకు ఒకసారి దేశ జనాభాను లెక్కిస్తున్నారు. అందులోదళితులు, ఆదివాసీలకు సంబంధించిన స్పష్టమైన సమాచారాన్ని మాత్రమే సేకరిస్తున్నారు. కానీ బీసీలతో పాటు ఏయే కులాలవారు ఎంత మంది ఉన్నారనే సమాచారం మాత్రం సేకరించడం లేదు. కానీ ఈ సమాచారం ఉంటేనే ఆయా వర్గాల జనాభా అవసరాలకు అనుగుణంగా రిజర్వేషన్లు, ప్రభుత్వ పథకాలను అమలు చేయవచ్చు. ప్రజాస్వామ్య భారతంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక, పారిశ్రామిక రంగాలతో పాటు వివిధ రంగాల్లో వెనకబడిన కులాలకు తగిన ప్రాతినిధ్యం లభించినప్పుడే సామాజిక న్యాయం అనే మాటకు సంపూర్ణత చేకూరుతుంది.
స్వాతంత్య్రానికి పూర్వం 1884లో జ్యోతిబాపూలే హంటర్ కమిషన్కు బీసీల దుస్థితిని వివరించి రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఆయన సుదీర్ఘ ఉద్యమం ఫలితంగా 1902లో కొల్హాపూర్ సంస్థానం, 1924లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశాయి. కానీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లను కొట్టివేశారు. 1979లో జనతా పార్టీ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లకు సంబంధించి మండల్ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఆ కమిటీ కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది. మండల్ కమిషన్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వాలు అమలు చేసి ఉంటే దేశంలో బీసీలు ఇప్పుడు ఉద్యమాలు చేయాల్సిన అవసరమే ఉండేది కాదు.
కానీ దేశంలో ఇప్పటి వరకు బీసీల జన గణన చేయకపోవడంతో బీసీ రిజర్వేషన్లు అమలు చేయలేరని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఎవరూ ఎలాంటి పోరాటాలు చేయకపోయినా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. కానీ బీసీ రిజర్వేషన్ల అమలును మాత్రం పక్కకు పెట్టింది. 90 సంవత్సరాల క్రితం సేకరించిన గణాంకాల ప్రకారం నేటికీ బీసీలకు కలుగుతున్న ప్రయోజనాలు అంతంత మాత్రమే. ఈ 90 ఏండ్ల కాలంలో బీసీల జనాభా బాగా పెరిగింది.
ఎన్నో రాజకీయ పార్టీలు వాళ్ల ఓటు బ్యాంకు పెంచుకోవడం కోసం ఎన్నో కులాలను బీసీల్లో కలిపారు. కానీ ఇప్పటికీ 27 శాతానికి బీసీల రిజర్వేషన్లు మించలేదు. అడుగుల ఆధారంగా అడవిలో పులులను లెక్కిస్తారు. రోడ్డుపై తిరుగుతున్న పశువులను కూడా లెక్కిస్తారు. మరి బీసీల జన గణన ఎందుకు చేయరు? కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు బీసీలంటే భయమా.. చులకనా లేదా నిర్లక్ష్యమా? బీసీలకు రిజర్వేషన్లు ఎంత అవసరమో, వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎంత వెనకబడి ఉన్నారో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం రాసిన చెంచా యుగం పుస్తకం చదివితే తెలుస్తుంది.
దేశంలో ఎంతోమంది బీసీ ముఖ్యమంత్రులున్నారు. జాతీయ స్థాయి నాయకులున్నారు. వారందరూ
ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని బీసీలు మనవి చేస్తున్నారు. బీసీల ప్రయోజనాల కోసం పని
చేయాలనేదే బీసీ నాయకుల లక్ష్యమైతే వారు ఆలోచించాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఈ
దేశంలో బీసీల జనాభా ఎంత? విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో, సమాజంలోని ఇతర కులాలతో పోలిస్తే బీసీ కులాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏయే రాష్ర్టాల్లో బీసీల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి? ఈ ప్రశ్నలకు అధికారపూర్వక సమాధానం బీసీల జనాభా గణన ద్వారానే వీలవుతుంది.
ఈ నేపథ్యంలో బీసీ కులాల మధ్య సాపేక్ష స్థితిగతులు అర్థం కావాలన్నా, బీసీల అభివృద్ధి జరగాలన్నా బీసీల జన గణన తక్షణావసరం. ఇందుకోసం బలమైన ఉద్యమం చేపడితేనే బీసీల డిమాండ్లు సాకారమవుతాయి. ఇందుకోసం ఉద్యమించడానికి సరైన సమయం ఇదే. ఇందుకోసం బీసీలు ఎక్కడికక్కడ ఎవరికి వీలైనంత వరకు వాళ్లు సమావేశాలు, సదస్సులు నిర్వహించాలి. పత్రికా ప్రకటనలు, వినతి పత్రాలు ఇస్తూ మన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి.
దేశ జన గణనలో బీసీల గణనను చేర్చాలన్న డిమాండ్పై సంఘటితంగా పోరాడాలి. మన హక్కులను సాధించుకోవాలి. గాంధీజీ చూపిన అహింసాయుత మార్గంలో ఉద్యమం చేయాలి. బీసీ వర్గానికి చెందిన ప్రధానమంత్రి బీసీల కుల గణనను దేశ జన గణనలో చేర్చాలని బీసీ ప్రజలంతా కోరుకుంటున్నారు. ఉత్తర్ప్రదేశ్, బీహార్ లాంటి రాష్ర్టాలు బీసీల కుల గణన చేపడతామని ప్రకటించడం సంతోషకరం. ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు కూడా బీసీల జన గణన చేపట్టి బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేస్తారని ఆశిద్దాం.
డాక్టర్ అశోక్ పరికిపండ్ల
99893 10141
(వ్యాసకర్త: సామాజిక కార్యకర్త)