కర్ణాటకలో గెలిచినం.. తెలంగాణలోనూ మేమే అంటున్న కాంగ్రెస్ నేతల మాటలు నమ్మితే అంతే సంగతులు. అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా గడవకముందే.. మూడు చెరువుల నీళ్లు తాగించినంత పనిచేశారని ప్రజలు లబోదిబోమంటున్నారు. ఐదు వరాలని అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెక్కాక ఉచిత బియ్యానికి అతీగతీ లేదు. కరెంట్ చార్జీలు పెంచడంతో ఆందోళనలు జరుగుతున్నాయి. మరోవైపు పాలకపక్షం ఎమ్మెల్యేల అసమ్మతితో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోయినట్టు వాపోతున్నారు. బళ్ళారి కలెక్టర్గా టి.వెంకటేశ్ అనే అతన్ని మంత్రి నాగేంద్ర ఏరికోరి తెచ్చుకుంటే, ఎవరిని అడిగి తెచ్చుకున్నారని ఆ జిల్లా ఎమ్మెల్యేలంతా సీఎం సిద్ధరామయ్య వద్దకెళ్లి ఉత్తర్వులను రద్దు చేయించారట. రాష్ట్రమంతా ఇలాంటి గొడవలేనంట మరి అట్లుంటది కాంగ్రెస్తోని.
బీజేపీలోకి రమ్మని అడిగితే తనకే రివర్స్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారని ఈటల రాజేందర్ చెప్తే, పార్టీని బద్నాం చేస్తావా అంటూ నేతలంతా కయ్యిన లేచారు. ఆలస్యంగానైనా వాస్తవం గ్రహించిన బండి సంజయ్ కూడా ఇప్పుడు అదే చెప్తున్నారు. ఎండనక, వాననక తిరిగాను. గుండె నొప్పి ఉన్నా లెక్క చేయలేదు. స్టేజీపై కుర్చీ తీసి అవమానించినా భరించా. బాగా పనిచేస్తున్నావని మోదీ, అమిత్ షా కూడా మెచ్చుకున్నారు. మరి ఏమైందో ఏమో, పీకి అవతల పారేశారని ఆయన వాపోయారు. ఇంతకూ బండి ఇచ్చే సందేశం ఏమంటే, రేపటి నాడు ఎవరికైనా ఇదే పరిస్థితి వస్తుందని.
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఖమ్మం నుంచి తన వారికి కూడా టిక్కెట్లు ఇచ్చేలా కాంగ్రెస్ నుంచి హామీ తీసుకున్నట్టు సమాచారం. ఆయన వెంట వెళ్లిన జూపల్లి కృష్ణారావు తానొక్కడికే టికెట్ అడిగితే తక్కువ అంచనా వేస్తారని అనుకున్నారేమో. తనకు కొల్లాపూర్, తనవాళ్లకు గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ టిక్కెట్లు కావాలని అడిగారట. మీ టికెటేదో అడుగకుండా మిగతా వాటితో మీకేమి సంబంధమని అక్కడి కాంగ్రెస్ నేతలకు భగ్గున మండుతున్నది. గత ఎన్నికల్లో కొల్లాపూర్లోనే గెలువలేనోడివి, నాగర్కర్నూల్, గద్వాల, వనపర్తి టిక్కెట్లు తీసుకొని ఏమి చేస్తావని కార్యకర్తల సమావేశంలో నాగం జనార్దన్రెడ్డి సూటిగా నిలదీయడంతో సౌండ్ లేదు.
పార్టీలో గొడవలతో వేగలేక ఏడాదో, రెండేండ్లో గడిచాక ‘థూ దీనమ్మ జీవితం’ అనుకుంటే అర్థం ఉంది. కానీ, పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన మొదటిరోజే కిషన్రెడ్డి ముఖం కళ తప్పింది. పార్టీ ఆఫీసులో జరిగిన ఆయన పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమం ఆద్యంతం బండి సంజయ్ వీడ్కోలు సభను తలపించింది. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ హయాంలో పార్టీ ఇంత పొడుగు, అంత పొడుగు పెరిగిందని నేతలంతా ఆకాశానికి ఎత్తేస్తుంటే, అసలు తనకెందుకు కట్టబెట్టారు ఈ పోస్టు? కేంద్ర మంత్రి పదవిని కూడా త్యాగం చేయడం అవసరమా? థూ దీనమ్మ జీవితం అనుకున్నారేమో కిషన్రెడ్డి.. వేదికపై బేలగా దిక్కులు చూస్తూ కనిపించారు. పార్టీ అధ్యక్షుని హోదాలో రాష్ర్టానికి చేరుకున్న రోజు పెద్ద బిల్డప్ ఇద్దామనుకుంటే, దానినేమో ఎమ్మెల్యే రఘునందన్రావు హైజాక్ చేశారు. కనీసం పదవీ స్వీకారం రోజైనా తాను గతంలో అధ్యక్షునిగా ఉన్నప్పటి రోజులను గుర్తు చేస్తారనుకుంటే, చచ్చిన బర్రె బుడ్డెడు పాలిచ్చేదన్నట్టు నేతలంతా బండిని పొగడం ఏమిటని? ఫీల్ అయినట్టున్నారు, పాపం.
– వెల్జాల