ఎన్నెన్ని ప్రస్థానాలు మనిషికి?
ఎన్నెన్ని పరిభ్రమణాలు మనిషికి?
అంతలోనే నురగల పరుగు.
అంతలోనే కదలని అడుగు.
ఎవరు తాను?
ఏ ధాతుగర్భంనుండి ఎదిగిన మాను?
ఎలా కుదించుకున్నాయో
ఇంత మొలకలో అంతటి శాఖలు?
ఎలా పొదుగుకున్నాయో
ఇంత విత్తులో అంతటి జీవరేఖలు?
తరువులా పెరిగిన మనిషి
తిరిగి చూసుకుంటాడు తనను తాను.
ముసురుకొస్తాయి హరితస్మృతులు
మొక్కపొత్తిళ్ళ నుంచి
కొమ్మల పందిళ్ళ దాకా.
అమ్మ ఒడినే అనంత విశ్వమనుకుని
స్తన్యంలోనే సమస్త మధురిమలందుకుని
బురదను పిసికి
బుగ్గలకు పూసుకుని
ఆకాశంలోని జాబిల్లిని
అద్దంలోకి దింపుకొని
కొయ్యగుర్రమెక్కి
కోటి ఆమడలు తిరగేసి
కట్టెపుల్లలు పట్టి
కత్తిసాములు చేసి
బాల్య కుల్యలీదిన మనిషి
పలవరించాడు తనలో తాను మెరిసి.
అగుపించిన సొగసులన్నీ
మగువగా మలచుకుని
అల్లుకున్న స్వప్నాలన్నీ
ఆకృతులుగా నిలపుకొని
తాకిన పూలరేకులన్నీ
తరుణి పెదవులనుకుని
సోకిన గాలితరగలన్నీ
సురభిళ శ్వాసలనుకుని
తరలిపోయే కాలాన్ని
పరిష్వంగంలో పొదుగుకుని
పరవశించిన ప్రతిక్షణాన్ని
సురానుభూతిగా దాచుకుని
యవ్వన గగనాలంటిన మనిషి
నవ్వుకున్నాడు తనలోతాను ఎగిసి.
–సినారె
‘జ్ఞానపీఠ అవార్డు’ పొందిన ‘విశ్వంభర’ కావ్యం నుంచి..