దళిత సాధికారత కోసం ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని ప్రారంభించడాన్ని స్వాగతించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం హుజూరాబాద్లో ‘దళిత బంధు’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా సామాజిక అణచివేతలకు గురైన దళితులు ఆర్థికరంగంలోనూ అణగారిపోయి ఉన్నారన్నారు. కుల వివక్షకు గురై అట్టడుగున ఉన్న దళిత సమాజం ధనిక సమాజంగా మారినప్పుడే, రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి సాధించినట్లు అవుతుందని తెలిపారు. దళిత బంధు పథకాన్ని అమలు జరిపి, దళితులను వృత్తి, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చేసి తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుదామని తన సంకల్పాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేయడం సంతోషం. ఈ నేపథ్యంలో ‘దళిత బంధు’ పథకం చరిత్రాత్మకం అని చెప్పవచ్చు.
రాష్ట్రంలో దాదాపు 17 లక్షల దళిత కుటుంబాలున్నాయి. ఎస్సీల్లో మెజారిటీ ప్రజలు ఆర్థికంగా చాలా పేదరికంలో ఉన్నారు. విద్యలో, సంపదలో అందరికంటే వెనుకబడి ఉన్నారు. రాష్ట్రంలో 75 శాతం మంది ఎస్సీలు గ్రామీణ ప్రాంతాల్లోనూ, 25 శాతం మంది ఎస్సీలు పట్టణ ప్రాంతాల్లోనూ నివసిస్తున్నారు. సామాజిక వనరులు, అవకాశాల నుంచి దళితులు తరతరాలుగా మినహాయించబడుతున్నారు. పక్కకు నెట్టివేయబడుతున్నారు. బాలకార్మిక, జోగిని, కనీస వేతనాలు అందని స్థితి, నిరుద్యోగం, భూమి లేకపోవడం వంటి ఎన్నో తీవ్రమైన సమస్యలతో దళితులు బాధపడుతున్నారు. సమాజంలోని సకల ఉత్పత్తులకు మూల కారణంగా ఉంటూ కూడా అన్నిరకాల సహజ వనరులకు దూరంగా ఉన్నారు. చదువులో చాలా వెనుకబడి ఉన్నారు. చదువుకున్న కొద్దిమందికీ ఉద్యోగ, ఉపాధి, ఆధునిక జీవన నైపుణ్యాలు దక్కటం లేదు. ఎక్కడైనా కొందరికి అవి లభిస్తున్నా.. అలాంటివారికి కూడా స్వయం ఉపాధికి పెట్టుబడుల్లేవు. ఎన్నో మౌలిక జీవన భద్రత సమస్యలను దళిత సమాజం ఎదుర్కొంటున్నది. నిత్య పీడితులుగా వారు సతమతమవుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని ప్రారంభించడానికి ముందు దళితులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, సామాజిక అణచివేత, వెనకబాటుతనం నేపథ్యాలను పరిగణనలోకి తీసుకోవడం హర్షణీయం. గతంలో అంతా మంచే జరిగిందనే ఆధిపత్య, సామాజిక ధోరణి నుంచి బయటపడి, ‘ఇదిగో! ఇక్కడ తీవ్రమైన పేదరికం, నిరక్షరాస్యత, కులవివక్ష, అభివృద్ధిలో అట్టడుగుతనం ఇంకా మిగిలే ఉంది!’ అని దళిత సమాజాల సామాజిక వాస్తవికతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం శుభపరిణామం. ఇది అణగారిన దళిత సామాజికవర్గాలకు ఓ ఆశారేఖగా చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే సమాజం సహానుభూతితో వ్యవహరించాలి. సామాజిక వివక్ష, అణచివేత, పేదరికం నుంచి బయటపడేందుకు దళిత వర్గాలకు లభించే అవకాశాన్ని ప్రతిఒక్కరూ స్వాగతించాలి. చేయూతనందించాలి. ఈర్ష్య, అసూయలకు తావులేకుండా, దళితుల అభివృద్ధిని అందరూ స్వాగతించాలనే సానుకూల దృక్పథంతో ముఖ్యమంత్రి పిలుపునివ్వడం హర్షణీయం.
ఒక మొక్క చెట్టుగా ఎదగాలంటే.. లక్షలు ఖర్చు పెట్టి మొక్క చుట్టూ కేవలం ఎరువులు నింపినంత మాత్రాన అయిపోదు. మొక్క ఎదుగుదలకు ఎరువొక్కటే సరిపోదు. ఆ మొక్కకు రోజూ తగినంత నీరు అందించాలి. కంచె కట్టాలి, కాపలా ఉండాలి. అవసరాన్ని బట్టి తెగుళ్ల నివారణ మందులూ వాడాలి. క్రమేపీ మొక్కకు బలాన్నిచ్చే ఎరువులు వాడాలి. ఇటువంటి క్రమానుగతమైన, సమయావసరమైన సంరక్షక కృషి ద్వారానే మొక్క బలమైన వృక్షంగా ఎదుగుతుంది, స్థిరపడుతుంది. పండ్లను అందిస్తుంది. ఇదే మాదిరిగా ‘దళిత బంధు’ పథకంతో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల సాధికార నిధిని సమకూర్చే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం ప్రశంసనీయమైనది. దీనితోపాటు మరో ముఖ్యమైన అంశమేమంటే, ఈ పథకం కింద లబ్ధిపొందిన వారి వ్యాపార, పారిశ్రామిక, వృత్తి నైపుణ్యాలు, సామర్థ్య నిర్మాణ స్థాయిలను పెంచడానికి ప్రణాళికాబద్ధమైన, అవసరమైన శిక్షణ ఇవ్వడానికి పూనుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వటం కూడా అవసరమైనది, ఆహ్వానించదగినది. వాస్తవానికి సాయంగా పొందిన రూ.10లక్షల లబ్ధి పైకి కనిపించేది మాత్రమే. కానీ, లబ్ధిదారులకు శిక్షణ ద్వారా లభించే గొప్ప నైపుణ్యా లు, సామర్థ్యాలు పైకి కనిపించేవి కావు. శిక్షణతో లభ్యమయ్యే శక్తి సామర్థ్యాలు, ఆలోచన ధోరణిలో మార్పు లబ్ధిదారుల స్థాయిని మార్చేస్తాయనడంలో ఎటువంటి సం దేహం లేదు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచే అత్యుత్తమ శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలి. ‘దళిత బంధు’ ద్వారా అందివచ్చిన సాయాన్ని ఫలప్రదంగా వినియోగించుకునే విధంగా ఎస్సీలను చైతన్య పర్చాలి. ఈ పునాదులపై ఆర్థికంగా ఎదగటంతోపాటు సామాజికంగా, సాంస్కృతికంగా ఎదిగేందుకు ప్రతి దళిత కుటుంబం నిబద్ధతతో కృషిచేయాలి.
‘దళిత బంధు’ పథకాన్ని ఎస్సీల్లోని అన్ని ఉప, ఆశ్రిత కులాలతోపాటు అందరికీ క్రమంగా వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నిజంగా దళితుల అభ్యున్నతిలో కొత్త శకం. రాష్ర్టాన్ని సాకారం చేసినట్లుగానే, ‘దళిత బంధు’ ద్వారా సాధికార లక్ష్యాన్ని సాధిస్తారనటంలో సందేహం లేదు. నిజాయితీతో కూడిన ఆచరణ దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. కేసీఆర్ సామాజిక న్యాయ ఆకాంక్షను నిజం చేయటానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలి.
(వ్యాసకర్త: రాజకీయ, సామాజిక విశ్లేషకుడు)
కృపాకర్ మాదిగ