మన ఊరు-మనబడి’ నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధి సాధ్యమవుతుంది. కేవలం పట్టణాల్లోనే లభించే కార్పొరేట్ విద్య గ్రామస్థాయి విద్యార్థులకు అందుబాటులోకి వస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకుసాగాలంటే విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐల భాగస్వామ్యం కూడా తప్పనిసరి. తాము జన్మించిన గ్రామం కోసం ముందుకువచ్చి చేయూతనందిస్తే ‘మన ఊరు-మన బడి’ మరింత ఫలవంతమవుతుంది. ఉదాహరణకు నన్నే తీసుకుంటే.. నేను నిరుపేద, దళిత కుటుంబానికి చెందిన వ్యక్తిని. నాటి పరిస్థితులు, నేటి విద్యా సౌకర్యాలు, అమలవుతున్న సంక్షేమ విద్యాభివృద్ధి పథకాలను ఆకళింపు చేసుకున్నాను. నాడు గురుకులాల్లో, సంక్షేమ వసతి గృహాల్లో పురుగులు పడ్డ దొడ్డు బియ్యపు అన్నం, చింతపండు పులుసుతో కడుపునింపుకొన్న రోజులు. ఈ దుస్థితి ఏనాటికైనా మారేనా అనే ఆలోచన వెంటాడుతుండేది. కానీ మన రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత విద్యారంగంలో సమూలమైన విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. సమాజం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే బడుగు, బలహీనవర్గాలు ఆర్థికంగా ఎదగాలి. ఈ నేపథ్యంలోంచే అంబేద్కర్ అలోచన విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చడం అభినందనీయం. దళితులు, గిరిజనులు, బడుగులు, మైనారిటీలు విద్యారంగంలో అభివృద్ధిని సాధిస్తే వారు ఆర్థికంగా ఎదిగి స్థిరపడతారని అంబేద్కర్ ఆలోచన. దీన్నే ఇవ్వాళ కేసీఆర్ ఆచరణాత్మకంగా ముందుకు తీసుకుపోతున్నారు.
విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 238 సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలు, డిగ్రీ కళాశాలలు 30 ఉన్నా యి. వీటిలో 1,45,485 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. రాష్ట్రంలో సుమారుగా వెయ్యి మందికిపైగా వివిధ వర్గాలకు సంబంధించిన గురుకులాలున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనారిటీల కోసం 2016-17 విద్యా సంవత్సరంలో 71 మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేశారు. 2017-18లో మరో 133 పాఠశాలలను ప్రారంభించారు. ప్రస్తుతం 107 బాలుర గురుకులాలు, 97 బాలికల గురుకులాలు మొత్తం 204 గురుకుల పాఠశాలల్లో 1,30,650 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 2020-21లో 71 గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు 83 జూనియర్ కళాశాలల్లో 13,280 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటికి పక్కా భవన నిర్మాణాల కోసం ఒక్కొక్క స్కూలుకు రూ.18 కోట్ల నిధులు, తర్వాత 3వ, 4వ విడతలుగా రూ.20 కోట్లు ప్రభుత్వం మంజూరుచేసింది.
గడిచిన ఏడేండ్లలో ఎస్సీ హాస్టళ్లలో 5,01,387 మంది విద్యార్థులకు రూ.1,713 కోట్లతో వసతి భోజన సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రంలోని వసతి గృహాలన్నింటికీ రూ.32 కోట్లతో మరమ్మతులు చేస్తున్నారు. విద్యార్థుల సౌలభ్యం కోసం డిజిటల్ లైబ్రరీలు, సోలార్ వాటర్ హీటర్లు ఏర్పాటుచేశారు. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కింద 4,49,241 మంది విద్యార్థులకు రూ.264 కోట్ల 12 లక్షలను ప్రభుత్వం అందించింది. రాష్ట్రంలోని 16,73,332 మంది విద్యార్థులకు గడిచిన ఏడేండ్లలో 2,905 కోట్ల 48 లక్షల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను అందించింది. ప్రస్తుతం 268 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు నడుస్తుండగా ఇందులో 104 రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. కేవలం ఎస్సీ మహిళల కోసం 30 డిగ్రీ కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించటం గమనార్హం.
ఎస్సీ విద్యార్థులకు విదేశాల్లో విద్యాభ్యాసానికి తోడ్పాటునందించాలనే సంకల్పంతో
‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి’ ద్వారా ఒక్కొక్కరికి ఇరువై లక్షలు అందించి వారి అభ్యున్నతికి ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. 581 మంది విద్యార్థులకు 100 కోట్ల 80 లక్షలను ప్రభుత్వం ఖర్చుచేసింది. సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలే వారిని ఆ స్థాయికి తీసుకువెళ్లాయి.
గురుకులాల్లో చదివిన విద్యార్థులు పోటీ పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ కనబర్చారు. 278 మంది విద్యార్థులు ఎంబీబీఎస్, 156 మంది ఐఐటీ, 358 నీట్, అనేక మంది బీడీఎస్,
బీవీఎస్సీ, అగ్రికల్చర్ బీఎస్సీ, హార్టికల్చర్ బీఎస్సీకి ఎంపికయ్యారు. అజిత్ ప్రేమ్జీ యూనివర్సిటీ, హార్వర్డ్, జేఎన్యూ. అశోక యూనివర్సిటీ, శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, రాయల్ కాలేజ్ ఆఫ్ లండన్లో గురుకులాల విద్యార్థులు సీట్లు సంపాదించటం తెలంగాణ రాష్ర్టానికి గర్వకారణం.
నాడు దళితులు కూలీపనుల్లో ఉంటే, నేడు అదే దళితులు పారిశ్రామికవేత్తలుగా మారి ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందించిన చేయూతనే కారణం. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాల వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు లొచ్చాయి. ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా విద్యనందిస్తున్నది. గురుకులాల్లో నేడు క్రీడారంగంతో పాటు సాంస్కృతిక విద్యారంగం కూడా అత్యున్నత ప్రమాణాలతో ఉన్నది. అందువల్లనే దళిత, బహుజనవర్గాల పిల్లలు అత్యున్నత స్థానాలు సొంతం చేసుకుంటున్నా రు. ఈ పరిస్థితులకు అనువైన, అవసరమైన రీతిలో విద్యా బోధన అందిస్తూ విద్యార్థుల జీవితాల్లో వెలుగును నింపుతున్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు ఆద్యుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర పుటల్లో నిలిచిపోతారనడంలో సందేహం లేదు.
(వ్యాసకర్త: -సుంకె రవిశంకర్, శాసనసభ్యులు,చొప్పదండి)