దేశంలో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్రం మాట నిలుపుకోలేదు.ఆ మాట నిలబెట్టుకునేందుకైనా ఈ బడ్జెట్లో వ్యవసాయా నికి భారీగా కేటాయింపులు ఉంటాయనుకున్న రైతులకు మొండి చెయ్యి చూపింది మోదీ సర్కార్. రైతుల ఆదాయాలు పెంచేందుకు మార్కెట్ ధరల ప్రోత్సాహకాలు, ఇన్పుట్ సబ్సిడీల పెంపు, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, దేశీయంగా నూనెగింజలు, అపరాల సాగుకు భారీ ప్రోత్సాహకాలు బడ్జెట్లో లేకపోవటం ద్రోహపూరితమే.
రైతుల పోరాటంతో రైతువ్యతిరేక చట్టాలను రద్దు చేసి న కేంద్రం, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తామ ని మాత్రం చెప్పలేదు. స్వామినాథన్ సిఫారసు ప్రకారం ఉత్పత్తి ఖర్చులు పోను, 50శాతం లాభం ఉండేలా విధా న నిర్ణయాలు చేయాలి. ఆ దిశగా బడ్జెట్ కేటాయింపులు లేవు. 2,30,000 కోట్లు వెచ్చించి దేశంలో ఉత్పత్తి అవుతున్న వడ్లు, గోధుమలు కొనుగోలు చేశామని చెప్పుకొచ్చారు. అయితే 2020-21లో దేశంలో 30కోట్ల టన్ను ల పైచిలుకు ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయితే, కేంద్రం కొనుగోలు చేసింది 30 శాతం మాత్రమే. ఇంకా 65 శాతం ఆహారధాన్యాలను కొనుగోలు చేయక పోవటం రైతులను నట్టేట ముంచటమే.
దేశంలో రోజురోజుకు ఉద్యాన రంగం బలోపేతమవుతూ, ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఈ ఉత్పత్తులు 2020-21లో 33 కోట్ల టన్నుల పైనే. వీటికి త్వరగా చెడిపోయే గుణం ఉండటం ఓ పరిమితి అయితే, విలువ జోడింపునకు ఎక్కువ అవకాశాలుండటం సానుకూలం. ఎగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ దిశగా భారీ కేటాయింపులు ఉండాలి. కానీ లేవు. దానికి తోడు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం అంటే, పరోక్షంగా కార్పొరేట్ సంస్థలకు ఈ రంగంలో ప్రవేశం లభించినట్లే. దీంతో భవిష్యత్తులో వ్యవసాయం ప్రైవేట్, కార్పొరేట్పరమ య్యే ప్రమాదం కూడా కనిపిస్తున్నది. సేంద్రియ సాగు ఒక్కరోజులో సాధ్యమయ్యేది కాదు. దశలవారీగా రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తూ ముందుకు పోవాలి. ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెస్తూ, రైతులను ఆదుకునేందుకు సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
2023 సంవత్సరాన్ని కేంద్రం ‘తృణధాన్యాల సంవత్సరం’గా ప్రకటించింది. మారుతున్న పరిస్థితుల్లో వీటికి ప్రాధాన్యం పెరిగింది. అయితే ఈ పంటలపై ప్రత్యేక పరిశోధనలు చేపట్టడానికి ‘ఐసీఐసీఏఆర్’కు, అలాగే రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు నిధుల కేటాయింపు లు పెంచాల్సిన అవసరమున్నది. కానీ ఆ దిశగా కేటాయింపులు లేకపోవటం బాధ్యతారాహిత్యమే.
విదేశాల నుంచి అపరాలు, నూనె గింజల దిగుమతి కోసం ఏటా లక్షా 15 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. బదులుగా దేశంలో నూనె గింజలు, అపరాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తే ఆ లాభాలు మన రైతులకు అందుతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఆయిల్ పామ్ పంటలను లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు సిద్ధమవటం గమనార్హం. ఈసారి దీనికోసం కేంద్రం నుంచి కేటాయింపులు ఆశించినప్పటికీ నిరాశే మిగిలింది.
జీరో బడ్జెట్, నేచురల్ ఫార్మింగ్, సేంద్రియ సాగు అంటూనే ప్రోత్సాహకాలు మరిచారు. ఎరువుల సబ్సిడీని మరింత తగ్గిస్తూ భారం మోపుతున్నారు. ప్రైవేట్ రంగం లో అడవుల అభివృద్ధికి అవకాశం ఇస్తామనడం బిడ్డల బాగోగు లను దయ్యాలకు అప్పగించినట్టే. 22.84 లక్షల కోట్ల ఖచ్చితమైన వార్షిక ఆదాయం ఉన్న దేశంలో కనీసం పది కోట్ల మేర వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఉండాలి. అప్పుడే వ్యవసాయంపై ఆధారపడిన 60 శాతం దేశ జనాభాకు న్యాయం చేసినట్లు అవుతుంది. కానీ కార్పొరేట్ల మేలుకోసం పరితపించే మోదీ ప్రభుత్వం నుంచి రైతు సంక్షేమం ఆశించటం అత్యాశే.
(వ్యాసకర్త: డాక్టర్ పిడిగం సైదయ్య,7780509322, అసోసియేట్ ప్రొఫెసర్, ఉద్యాన విశ్వవిద్యాలయం)