విశ్వనగరంగా రూపాంతరం చెందుతున్న హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులతో మౌలిక సదుపాయాల కల్పన పనులను
చేపట్టింది. ఈ పనులన్నీ ప్రస్తుత హైదరాబాద్ను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నవి కాదు. ముప్పయ్యేండ్ల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని ముందుచూపుతో, సమగ్ర ప్రణాళికతో చేపట్టిన పనులు.
రాష్ట్ర ప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో హైదరాబాద్ నగరాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దింది. ఈ మధ్యకాలంలో నగర జనాభా భారీగా పెరిగింది. నగరం నలువైపులా విస్తరించింది. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి నగరంలో ఎటుచూసినా సమస్యలే. నగరంలోని చెరువులు, మూసీ నది మురికినీటితో నిండిపోయింది. వర్షం పడితే కాలనీలన్నీ చెరువుల్లా మారిపోయే దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆవిర్భవించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంతో పాటు, హైదరాబాద్ నగరం అద్భుతరీతిలో ముందుకుపోతున్నది.
ట్రాఫిక్ సమస్య నగరాభివృద్ధికి ఆటంకం కావొద్దనే ఆలోచనతో ముందుగా ప్రభుత్వం రోడ్లపై దృష్టి పెట్టింది. రవాణా అవసరాల కోసం మెట్రో రైలును అందుబాటులోకి తెచ్చింది. ఏకంగా రూ.29,695 కోట్లతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ)కి శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 15 ఫ్లై ఓవర్లు, 5 అండర్పాస్లు, 6 రైల్వే ఓవర్, అండర్ బ్రిడ్జిలు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేసింది. దీంతో నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారమైంది. మరో 17 ఫ్లైఓవర్లు, 3 రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి. ఎస్ఆర్డీపీనే కాకుండా హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే 21 రోడ్లను నిర్మించింది. ఇంకా 100 లింక్ రోడ్లను నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మూసీ నది మీద రాకపోకల కోసం 14 బ్రిడ్జ్ల నిర్మాణం చేయాలని నిర్ణయించింది. ఈ పనులు పూర్తయితే మరో 30 ఏండ్ల వరకు నగరంలో ట్రాఫిక్ సమస్య ఉండదు.
తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించింది. తెలంగాణ ఏర్పడేనాటికి నగరంలో 340 ఎంజీడీ తాగునీటి సరఫరా జరిగేది. ఇప్పుడు దాదాపుగా 600 ఎంజీడీ నీటిని అందించే సామర్థ్యాన్ని ప్రభుత్వం కల్పించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నగర తాగునీటి అవసరాలకు రూ.2,500 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు మరో రూ.1,200 కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్-2 పనులు చేపట్టింది. ఇవి పూర్తయితే ఓఆర్ఆర్ పరిధిలో తాగునీటి సమస్యే ఉండదు. నగరంలో వరద ముంపు సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఇందుకోసం స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎస్ఎన్డీపీ)కి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.985.45 కోట్లతో 60 పనులు చేపట్టింది. 473 కి.మీ. పరిధిలోని 78 కి.మీ. నాలా నెట్వర్క్లో పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే నగరంలో ముంపు సమస్య పరిష్కారమవుతుంది.
నగరంలో ఒకప్పుడు పచ్చదనం నిండుగా ఉండేది. కానీ, ఆ తర్వాతి కాలంలో క్రమంగా తగ్గిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నగరంలో పచ్చదనాన్ని పెంపొందించి నగర ప్రజలకు ఆహ్లాదకర, ఆరోగ్యకర వాతావరణాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నది. నగరంలో ఏటా పెద్ద ఎత్తున హరితహారం చేపడుతున్నది. నగరంతో పాటు శివార్లలో అర్బన్ ఫారెస్టుల అభివృద్ధి చేపట్టింది. అర్బన్ లంగ్ స్పేస్లను అభివృద్ధి చేసింది. నగరంలోని పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దింది. పచ్చదనంతో పాటు నగర సుందరీకరణకు కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. ఇలా అన్ని అంశాల్లోనూ ప్రస్తుత జనాభాకు తగ్గట్లుగా నగరాన్ని అభివృద్ధి చేయడం, ప్రస్తుత జనాభా కనీస అవసరాలను తీర్చడంతో పాటు రానున్న ముప్ఫై ఏండ్ల భవిష్యత్తులో పెరగనున్న జనాభా, నగర విస్తరణకు తగ్గట్లుగా నగరాన్ని ప్రభుత్వం ముందుచూపుతో అభివృద్ధి చేస్తున్నది. ఇది ఎవరూ విభేదించలేని, కాదనలేని సత్యం.
–డాక్టర్ ఎన్.యాదగిరిరావు
(వ్యాసకర్త: అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ)